చెన్నై : తమిళనాడులో పాలక డీఎంకే మంత్రి పీకే శేఖర్ బాబు నార్త్ ఇండియన్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నివసించే ఉత్తరాది ఓటర్లు డీఎంకేతో లబ్థి పొంది అసెంబ్లీ ఎన్నికల్లో తమను మోసం చేసి బీజేపీకి ఓటు వేశారని ఆయన మండిపడ్డారు. శేఖర్ బాబు బుధవారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తమిళనాడులో నివసించే ఉత్తరాది వారు డీఎంకే చేపట్టిన చర్యలతో లబ్ధిపొందారని, కానీ ఎన్నికల్లో మాత్రం బీజేపీకి ఓటు వేశారని వ్యాఖ్యానించారు.
డీఎంకేతో లాభపడిన మీరు (నార్త్ ఇండియన్లు) బీజేపీకి ఓటు వేశారు..డీఎంకేకు ఓటేశామని మమ్మల్ని మోసగించారని ఉత్తరాది ఓటర్లను ఉద్దేశించి ఆయన పేర్కొన్నారు. ఇంకా తప్పు చేసిన వారు మరింత సిగ్గుపడేలా వారిలో వివేకం పెరిగేలా వారికి ఉపయోగపడే మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి అన్నారు. స్టాలిన్ ప్రభుత్వంలో శేఖర్ బాబు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు.