Krithi Shetty | టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కృతి శెట్టి తన కెరీర్లో ఎదుర్కొంటున్న విమర్శలపై తాజాగా స్పందించారు. నటిగా ప్రతి సినిమాలోనూ తాను వంద శాతం శ్రమిస్తానని, పాత్రకు న్యాయం చేయడానికి ఎలాంటి రాజీ పడనని చెప్పారు. అయితే సినిమా ఫలితం మాత్రం పూర్తిగా తన చేతిలో ఉండదని, అలాంటి పరిస్థితుల్లో ‘ఐరెన్ లెగ్’ అని ముద్ర వేయడం తనను తీవ్రంగా బాధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా హిట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని, కేవలం తనను లక్ష్యంగా చేసుకుని విమర్శించడం సరైంది కాదని ఆమె పేర్కొన్నారు. కొన్నిసార్లు కేవలం అదృష్టం లేకపోవడం వల్ల అవకాశాలు కోల్పోవడం ఒక నటిగా తనను కృంగదీస్తోందని తెలిపారు.
ప్రస్తుతం తాను నటిస్తున్న ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ చిత్రంపై కూడా కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయని, అవి తనను కలచివేస్తున్నాయని కృతి వెల్లడించారు. అయినప్పటికీ తన కృషిని మాత్రం ఎప్పటికీ ఆపబోనని, మంచి కథలతో ప్రేక్షకులను అలరించడానికి ప్రయత్నిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. ఈ చిత్రంలో తాను ‘ధీమా’ అనే పాత్రలో కనిపించనున్నట్లు కృతి చెప్పారు. సోషల్ మీడియాకు బానిసైన, ‘నోమోఫోబియా’తో బాధపడే యువతిగా నటించడం తనకు కొత్త అనుభూతిని ఇచ్చిందని తెలిపారు. కథ 2040 నేపథ్యంతో సాగుతున్నప్పటికీ, ప్రస్తుత సమాజానికి బాగా కనెక్ట్ అవుతుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.
సినిమా షూటింగ్ సమయంలో ప్రముఖ నటి నయనతారతో తనకు మంచి అనుబంధం ఏర్పడిందని కృతి తెలిపారు. ఒక సందర్భంలో తనకు సమస్య ఎదురైనప్పుడు నయనతార స్వయంగా ఫోన్ చేసి గైడ్ చేసిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు.ఇక సోషల్ మీడియాలో వచ్చే నెగటివ్ ట్రోల్స్పై కూడా కృతి స్పందించారు. విమర్శలు చేసే వారు తమ ఆలోచనా ధోరణి మార్చుకోవాలని, పాజిటివ్గా ఆలోచించడం చాలా ముఖ్యం అని సూచించారు. తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ, తాను పాతకాలపు ప్రేమకే ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. ప్రస్తుతం తన పూర్తి దృష్టి నటనపైనే ఉందని, మరో ఐదు నుంచి పది సంవత్సరాల తర్వాత డేటింగ్ చేసి పెళ్లి గురించి ఆలోచిస్తానని వెల్లడించారు. అనీల్ రావిపూడి సినిమాతో పాటు తమిళ, హిందీ భాషల్లో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నట్లు తెలిపారు.