హైదరాబాద్, ఏప్రిల్9 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల పునరుద్ధరణ పనులపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం ప్రత్యేకంగా సమీక్షించారు. సచివాలయంలో ఇరిగేషన్శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ప్రాజెక్టు ఉన్నతాధికారులు, పునరుద్ధరణ పనుల డిజైన్స్ కన్సల్టెన్సీ ఆఫ్రీ, ఐఐటీ చెన్నై ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ బరాజ్లకు మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
ఎన్డీఎస్ఏ సూచనల మేరకు పనులను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని స్పష్టంచేశారు. సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రిసెర్చ్ స్టేషన్ ఆధ్యర్యంలో జరుగుతున్న పరీక్షలు, నమూనాల సేకరణను వర్షాకాలం ప్రారంభానికి ముందే పూర్తిచేయాలని చెప్పారు. నీటిపారుదలశాఖ, సీడబ్ల్యూపీఆర్ఎస్, బరాజ్ నిర్మాణ సంస్థలు, డిజైన్ కన్సల్టేషన్స్తో టీమ్ ఏర్పాటుచేయాలని సూచించారు.
మేడిగడ్డలో కుంగిపోయిన పిల్లరే కాకుండా మొత్తం 1.6 కిలోమీటర్ల బరాజ్ను అధ్యయనం చేయాల్సి ఉంటుందని ఇంజినీర్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. మేడిగడ్డ దగ్గర 500 బోరుబావులు తవ్వాల్సి ఉందని, ప్రత్యేక యాక్షన్ప్లాన్ సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. మరమ్మతుల డిజైన్లు, డిసెంబర్ వరకు చేయాల్సిన పనుల పూర్తి షెడ్యూల్ సిద్ధం చేయాలని ఆదేశించారు. సమావేశంలో సీఎస్ రామకృష్ణారావు, ఇరిగేషన్ సెక్రటరీ శ్రీధర్, సీఎం కార్యదర్శి మానిక్రాజ్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.