న్యూఢిల్లీ: ఢిల్లీ బాంబు పేలుడు ఘటన నేపథ్యంలో అల్ ఫలాహ్ వర్సిటీ పేరు తెరపైకి వచ్చింది. ఈ వర్సిటీలో పనిచేస్తున్న డాక్టర్లు, ప్రొఫెసర్లు ఉగ్ర కుట్రలో భాగం కావడంతో దర్యాప్తు సంస్థల దృష్టి ఈ వర్సిటీపై పడింది. ఫరీదాబాద్ పరిధిలోని ధౌజ్ గ్రామంలో 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ సంస్థ హర్యానా రాజధానికి కేవలం 30 కి.మీ దూరంలోనే ఉంది. వైట్ కాలర్ టెర్రర్ నెట్వర్క్కు, రాడికలైజ్డ్ నిపుణుల బృందం తలపెట్టిన ఒక మారణహోమానికి కేంద్ర బిందువుగా మారింది. పోలీసులు, ఇతర దర్యాప్తు బృందాలు పలువురు సిబ్బందిని ప్రశ్నించారు.
మరో డాక్టర్ మిస్సింగ్
డాక్టర్ ఉమర్ కాకుండా, ఉగ్ర దాడికి సహకరించారని అనుమానిస్తున్న, జైషే మహ్మద్తో సంబంధం ఉన్న అతని ఇద్దరు సహాయకులు డాక్టర్ ముజమ్మిల్ షకీల్, డాక్టర్ షాహిన్ షాహిద్లు కూడా ఇదే విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. డాక్టర్ షకీల్ను అరెస్ట్ చేయడంతో తనను కూడా అరెస్ట్ చేస్తారన్న భయంతో ఉమర్ సోమవారం కారు బాంబు పేలుడుకు పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. డాక్టర్ షాహిన్ కారు నుంచి రైఫిళ్లు, మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు ఆరుగురిని యూనివర్సిటీ నుంచి అరెస్ట్ చేశారు. పేలుడు అనంతరం మరో డాక్టర్ నిసర్-ఉల్-హసన్ పరారీలో ఉన్నాడు. హసన్ ప్రస్తుతం ఈ యూనివర్సిటీలో మెడిసిన్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా ఉన్నారు. దేశ ద్రోహ కార్యకలాపాలకు పాల్పడ్డాడన్న ఆరోపణపై ఆయనను శ్రీ మహరాజ హరి సింగ్ హాస్పిటల్ నుంచి జమ్ము కశ్మీర్ లెఫ్ట్నెంట్ గవర్నర్ విధుల నుంచి తొలగించారు. అయితే ఇలాంటి రికార్డు ఉన్న వ్యక్తిని ఈ యూనివర్సిటీలో ఎలా నియమించారన్న విషయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వారితో సంబంధం లేదు: వర్సిటీ
బాంబు పేలుడు ఘటనలో అనుమానిత డాక్టర్లు అల్ ఫలాహ్ వర్సిటీకి చెందని వారు కావడంతో తమపై జరుగుతున్న ప్రచారంపై యూనివర్సిటీ స్పందించింది. నిందితులుగా పేర్కొంటున్న డాక్టర్లు తమ విశ్వవిద్యాలయంలో అధికారికంగా పనిచేయడం తప్ప ఆ వ్యక్తులతో తమకు ఎలాంటి వ్యక్తిగత సంబంధం లేదని విశ్వవిద్యాలయం స్పష్టం చేసింది. ఈ మేరకు వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ భూపీందర్ కౌర్ ఆనంద్ ఒక ప్రకటన విడుదల చేశారు.