న్యూఢిల్లీ : ఆక్సిజన్ కొరతపై రాజకీయాలు ఆపి, ప్రాణాలు కాపాడేందుకు ఉత్పత్తిని పెంచేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను గమనించాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. శుక్రవారం పార్లమెంట్లో ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి సభనుద్దేశించి మాట్లాడారు. ఆక్సిజన్ లభ్యతను నిర్ధారించేందుకు కేంద్ర ప్రభుత్వం సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేసిందని, మహమ్మారి సెకండ్ వేవ్ సమయంలో డిమాండ్ పెరిగిన అనంతరం ఉత్పత్తిని పెంచిందని చెప్పారు. ‘బాధాకరమైన పరిస్థితుల్లో చాలా మంది రాజకీయాలు చేయడం మానుకోలేదని, అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.. నిజాయితీగా మేం చేస్తున్న ప్రయత్నాలను గమనించండి.
ఇది రాజకీయాలకు సంబంధించిన అంశం కాదు’ అంటూ ప్రతిపక్షాలకు సూచించారు. ఆక్సిజన్ మరణాలపై కాంగ్రెస్ ఎంపీ సురేష్ ధనోర్కర్ అడిగిన ప్రశ్నకు ఆరోగ్యశాఖ మంతి సమాధానం ఇచ్చారు. కరోనా సెకండ్ వేవ్లో ఆక్సిజన్ కొరత కారణంగా మరణాలు సంభవించాయన్న ప్రతిపక్షాల వాదనలను మన్సుఖ్ మాండవీయ కొట్టిపారేశారు. మరణాలపై కేంద్రం రాష్ట్రాల నుంచి సమాచారం కోరిందని, అయితే పంజాబ్ ప్రభుత్వం మాత్రమే నాలుగు అనుమానాస్పద మరణాలున్నాయని, వాటిపై విచారణ జరుగుతోందని పేర్కొన్నారు. ఆక్సిజన్ కొరత కారణంగా మరణించిన వారి సంఖ్యను దాచాల్సిన అవసరం లేదని ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రుల సమావేశంలో చెప్పారంటూ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి గుర్తు చేశారు.