బెంగళూరు: దొంగిలించిన బంగారం పోలీసులకు చిక్కకూడదు అనే తొందరలో ఓ దొంగ దాన్ని మింగేశాడు. కానీ అతని ప్లాన్ బెడిసి కొట్టి ఆ బంగారం పోలీసుల చేతిల్లోకే వెళ్లింది. వివరాల్లోకి వెళ్తే.. కేరళకు చెందిన శిబు అనే వ్యక్తి కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఉంటున్నాడు. తరచూ దొంగతనాలకు పాల్పడుతూ పూట గడపుతున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల కూడా ఓ ఇంట్లో 35 గ్రాముల బంగారం దొంగతనం చేశాడు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు శిబు కోసం గాలించి పట్టుకున్నారు. అయితే, పోలీసులను ముందే పసిగట్టిన దొంగ తాను దొంగిలించిన బంగారం వారికి చిక్కకూడదనే ఉద్దేశంతో దాన్ని మింగేశాడు. కానీ, ఆ దొంగ తెలివి ఇక్కడ పనిచేయలేదు. బంగారాన్ని మింగిన కాసేపటికే అతనికి తీవ్రంగా కడుపునొప్పి వచ్చింది. దాంతో పోలీసులు ఆ దొంగను ఆస్పత్రికి తరలించారు. ఎక్స్రే రిపోర్టుల్లో అతని కడపులో బంగారం ఉన్నట్లు తేలింది.
దాంతో పోలీసులు ఆ బంగారాన్ని బయటికి తీయించి స్వాధీనం చేసుకున్నారు. బంగారం గురించి పోలీసులకు తెలియకుండా ఉండేందుకు తాను ఐస్క్రీంతో కలిపి 35 గ్రాముల ఉంగరాలను మింగేశానని నిందితుడు తెలిపాడు.