శ్లో: ‘ప్రహ్లాద మానస సరోజ విహారభృంగ, గంగాతరంగ ధవళాంగ రమాస్థితాంక’ ‘శృంగార సుందర కిరీటల సద్వరాంగ, లక్ష్మీనృసింహ మమదేహి కరావలంబమ్’
యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 1 : యాదగిరిగుట్ట ప్రధానాలయానికి అనుబంధమైన పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. భేరీపూజ, గరుత్మంతుడితో దేవతాహ్వానం తంతును సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. గరుత్మంతుడిని ఆహ్వానించే ధ్వజారోహణం, దేవతాహ్వానం కార్యక్రమాలు నిర్వహించారు. గురువారం శ్రీవారు పెళ్లి కొడుకుగా ముస్తాబు కానున్నారు.
ఈ సందర్భంగా ఎదుర్కోలు ఉత్సవం, వివాహ నిశ్చయ కార్యక్రమం నిర్వహించనున్నారు. శ్రీమన్నారాయణుడి వాహనమైన గరుత్మంతుడిని ఆహ్వానించి సకల దేవతలకు యాదగిరీశుడు పెళ్లికొడుకు అవుతున్నారని సబ్బండ బంధుగణంతో తరలిరావాలని ఆహ్వానాన్ని పంపే తంతును అర్చకబృందం ఆధ్వర్యంలోని వేద పండితులు, అర్చకులు, పారాయణీకులు, వేదమంత్రాల ఘోషలో నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లను ఉదయం పంచామృతాలతో అభిషేకించి పుష్పాలతో అలంకరించారు. స్వామి, అమ్మవార్లను ధ్వజస్తంభానికి ఎదురుగా ప్రత్యేక పీఠంపై అధిష్టింపజేసి ధ్వజారోహణం తంతు నిర్వహించారు.
ఆలయంలో హవనం
బ్రహ్మోత్సాల్లో స్వామి, అమ్మవార్లకు ఎదురుగా అగ్ని ప్రతిష్ట చేసి, ఆ అగ్నిలో రాగి, మేడి, జువ్వి, మోదుగు, మామిడి చెట్ల కర్రలతో హోమాన్ని వెలిగించారు. అందులో నారాయణ, లక్ష్మి, సుదర్శన, నారసింహ, ఆంజనేయ, గరుఢ మొదలైన మూలమంత్రాలతో హవనం చేశారు.
సాయంకాలం భేరీ పూజ, దేవతాహ్వానం
బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిత్యారాధనల అనంతరం వేద పారాయణికులచే వేదపారాయణాలు, మూలమంత్ర, అనుష్టానం గావించారు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి అంశ అయిన లక్ష్మీనారసింహుడి బ్రహ్మోత్సవాలకు 33కోట్ల మంది దేవతలను ఆహ్వానించే ప్రక్రియ అయిన దేవతాహ్వానాన్ని సాయంత్రం నిర్వహించారు. అంతకుమందు ఆలయ అర్చకులు భేరీ పూజ చేశారు. సకల దేవతలకు భేరీ నినాదాలు, మంగళవాయిద్యాలతో రాగ, తాళయుక్తంగా ఆవాహనం చేసి గర్భాలయంలోని ప్రధాన కలశంలో అధిష్టింపజేశారు. సకల మూలమంత్రాలతో హవనం చేశారు. వేడుకల్లో ఆలయ ఇన్చార్జి ఈఓ రామకృష్ణారావు, ప్రధానార్చకులు మోహనాచార్యులు, ఉప ప్రధానార్చకులు మాధవాచార్యులు, డీఈఓ భాస్కర్, ముఖ్య అర్చకుడు భాస్కరాచార్యులు, అర్చకులు నరేశాచార్యులు, సంపతాచార్యులు, సత్యనారాయణాచార్యులు, పరిచారకులు వినయ్కుమారాచార్యులు, ఫణికుమారాచార్యులు, వేద పండితులు ఫణికుమార్శర్మ, పవన్కుమారాచార్యులు, వినయ్కుమారాచార్యులు పాల్గొన్నారు.
నేడు ఎదుర్కోలు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి ఎదుర్కోలు మహోత్సవం నిర్వహించనున్నారు. ఉదయం 8గంటలకు హవనం, సింహ వాహన సేవ, సాయంత్రం 6గంటలకు హవనం, రాత్రి 8గంటలకు ఎదుర్కోలు ఉత్సవం నిర్వహిస్తారు. రాత్రికి శ్రీవారు అశ్వవాహన సేవలో ఊరేగనున్నారు. అనంతరం శ్రీవారి విహహ నిశ్చయ ఘడియలు ఖరారు చేసే తంతును రాత్రి 9 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తారు.