యాదగిరిగుట్ట, జూలై 1 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి నిత్య తిరుకల్యాణోత్సవం శాస్ర్తోక్తంగా జరిగింది. శనివారం ఉదయం స్వామివారికి సుదర్శన నారసింహ హోమం జరిపిన అర్చకులు కల్యాణమూర్తులకు గజవాహన సేవలు నిర్వహించారు. అనంతరం వెలుపలి ప్రాకార మండపంలో తూర్పు అభిముఖంగా స్వామి, అమ్మవార్లను వెంచేపు చేసి కల్యాణోత్సవం జరిపారు. సుమారు గంటన్నరపాటు సాగిన వేడుకల్లో భక్తులు పాల్గొని కల్యాణోత్సవాన్ని తిలకించారు. స్వామివారి నిత్యోత్సవాలు తెల్లవారుజాము నుంచే మొదలయ్యాయి. ఉదయం సుప్రభాత సేవతో స్వయంభూ నారసింహుడిని మేల్కొలిపిన అర్చకులు తిరువారాధన నిర్వహించి ఉదయం ఆరగింపు చేపట్టారు.
స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన జరిపారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లకు తిరువీధి సేవోత్సవం, దర్బార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా సాగాయి. స్వామివారి దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో ఆలయం సందడిగా మారింది. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో క్యూలైన్లలో భక్తులు కనిపించారు. స్వామివారిని సుమారు 25 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలు కలిపి ఆలయ ఖజానాకు రూ.29,41,715 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
స్వామివారి సేవలో ప్రభుత్వ విప్, నాబార్డు రాష్ట్ర సీజీఎం..
లక్ష్మీనరసింహస్వామివారి సేవలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, నాబార్డు రాష్ట్ర చీఫ్ జనరల్ మేనేజర్ సుశీల చింతాల, నాబార్డు మాజీ చైర్మన్ చింతల గోవిందరాజు పాల్గొని తరించారు. శనివారం కొండపైకి చేరుకున్న వారు మొదటగా స్వయంభూ నారసింహస్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులకు సువర్ణపుష్పార్చన జరిపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి ఆలయ సంప్రదాయరీతిలో ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ప్రాకార మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా, ఆలయ పర్యవేక్షకులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం వారు నూతన ఆలయాన్ని తిలకించారు. యాదగిరిగుట్ట ఆలయం ఎంతో అద్భుతంగా ఉందని కితాబిచ్చారు.