యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం శనివారం కిటకిటలాడింది. సెలవు రోజు అవడంతో భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే స్వామివారిని సందర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సమంత హీరోయిన్గా నటించిన శాకుంతలం సినిమా విడుదల వచ్చే నెల 14న ఉన్న నేపథ్యంలో దర్శకుడు గుణశేఖర్ సెంటిమెంట్గా స్వామివారిని దర్శించుకున్నారు.
– యాదగిరిగుట్ట, మార్చి11
యాదగిరిగుట్ట, మార్చి 11 : యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి ప్రధానాలయం శనివారం భక్తులతో సందడిగా మారింది. సెలవు దినం కావడంతో స్వామి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మాఢవీధులు, క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు, తిరు మాఢవీధులు, గర్భాలయ ముఖ మండపంలోని క్యూలైన్లు భక్తులతో సందడిగా మారాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులకు నిర్వహించే సువర్ణ పుష్పార్చన, వేదాశీర్వచనంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బంగారు పుష్పాలతో ఉత్సవమూర్తిని అర్చించారు. స్వామి, అమ్మవార్ల నిత్య తిరు కల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామిని సుమారు 28వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. అన్ని విభాగాలు కలుపుకొని ఖజానాకు రూ.30,85,745 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
అష్టోత్తర శతఘటాభిషేకం
యాదగిరిగుట్ట ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ పాతగుట్ట ఆలయంలో స్వాతి నక్షత్ర పూజలు ఘనంగా నిర్వహించారు. స్వామి వారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా అష్టోత్తర శతఘటాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రధానాలయ ముఖ మండపంలో శత కళశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి జలాలకు ప్రత్యేక పూజలు చేశారు. పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో స్వయంభువుడికి అష్టోత్తర శతఘటాభిషేకం చేశారు.
స్వామివారి సేవలో న్యాయమూర్తులు
స్వయంభువుడిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విమాన గోపురం స్వర్ణ తాపడానికి రూ.1,00,116 విరాళం అందజేశారు. నల్లగొండ జిల్లా న్యాయమూర్తి తిరుపతి కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. దర్శన అనంతరం అర్చకులు వారికి స్వామి ఆశీర్వచనాలు అందించగా ఆలయ ఏఈఓ రాంమోహన్ ప్రసాదం అందించారు.
శ్రీవారి సేవలో దర్శకుడు గుణశేఖర్
స్వామివారిని సినీ డైరెక్టర్ గుణశేఖర్, నిర్మాత నీలిమాగుణ దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ స్వామి ఆలయాన్ని సీఎం కేసీఆర్ మహాద్భుతంగా తీర్చిదిద్దారని కొనియాడారు. కళలు, సంప్రదాయాలపై సీఎం కేసీఆర్ అభిరుచికి నిదర్శనమే యాదగిరిగుట్ట దేవస్థానం పునర్నిర్మాణమని పేర్కొన్నారు. ఏప్రిల్ 14న శాకుంతలం సినిమా విడుదల కాబోతుందని, ఈ నేపథ్యంలో స్వామిని దర్శించుకున్నట్లు తెలిపారు.