యాదగిరిగుట్ట, జనవరి22 : యాదగిరిగుట్ట లక్ష్మీనారసింహ స్వామి నిత్యోత్సవాలు ఆదివారం శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవతో స్వామిని మేల్కొల్పిన అర్చకులు తిరువారాధన నిర్వహించి, ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేశారు. స్వామివారికి సుదర్శన నారసింహ హోమం నిర్వహించిన అర్చకులు కల్యాణమూర్తులకు గజవాహన సేవ నిర్వహించారు.
అనంతరం వెలుపలి ప్రాకార మండపంలో తూర్పునకు అభిముఖంగా స్వామి, అమ్మవార్లను వేంచేపు చేసి కల్యాణోత్సవం జరిపించారు. సుమారు గంటన్నర పాటు సాగిన వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కల్యాణోత్సవాన్ని తిలకించారు. సాయంత్రం స్వామి, అమ్మవార్ల తిరువీధి సేవోత్సవం, దర్బార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం సెలవు దినం కావడంతో స్వామి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సుమారు 30వేల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామి వారి ఖజానాకు రూ.34,07,341 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
రేపు హుండీ లెక్కింపు
శ్రీవారి హుండీలను ఈ నెల 24న లెక్కించనున్నట్లు ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు. కొండకింద సత్యనారాయణ వ్రత మండపంలో ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభిస్తామని తెలిపారు.