యాదగిరిగుట్ట, మార్చి1; యాదగిరి గుట్ట బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. బుధవారం ఉదయం లక్ష్మీనరసింహ స్వామి గరుడ వాహనంపై మహావిష్ణువు అలంకారంలో దర్శనమిచ్చాడు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య అలంకార సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. రాత్రి ప్రధానాలయ తిరుమాఢ వీధుల్లో దివ్య విమాన రథోత్సవం కనుల పండువగా జరిగింది. కల్యాణ దంపతులైన స్వామి, అమ్మవారిని రథంపై అధిష్టింపజేసి భక్తులు కోలాటాలు, భజనలు, సంకీర్తనలు చేస్తూ ముందుకు సాగారు. జై నారసింహ, జై జై నారసింహ, గోవింద నామస్మరణలతో గుట్ట పులకరించిపోయింది. బ్రహ్మోత్సవాల్లో గురువారం ఉదయం మహా పూర్ణాహుతి, చక్రతీర్థ స్నానం, సాయంత్రం పుష్పయాగం, దేవతోద్వాసన, దోపోత్సవం నిర్వహిస్తారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనారసింహుడు బుధవారం ఉదయం గరుడవాహనంపై మహావిష్ణువుగా దర్శనమిచ్చాడు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా లక్ష్మీనాథుడైన స్వామివారు విష్ణుమూర్తి అలంకారంలో గరుత్మంతుడిపై అమ్మవారి సమేతంగా ఊరేగారు. అర్చక బృందం, వేద పండితులు, పారాయణదారులు వేదోక్త పఠనాలు, ఆస్థాన విద్వాంసుల మంగళవాయిద్యాల నడుమ అలంకార సేవ కనులపండువగా సాగింది. రాత్రి ప్రధానాలయ తిరుమాఢవీధుల్లో స్వామివారి దివ్య విమాన రోథ్సతవం అంగరంగ వైభవంగా సాగింది. అనంతరం ఉత్సవమూర్తులను అలంకారసేవపై అధిష్టించి భక్తుల దర్శనార్థం కొండ కింద రథోత్సవ వేడుక నిర్వహించారు.
వైభవంగా దివ్యవిమాన రథోత్సవం..
సాయంత్రం స్వామివారి దివ్యవిమాన రథోత్సవాన్ని ప్రధానాలయ తిరుమాఢ వీధుల్లో నిర్వహించారు. ప్రధానాలయంలో నిత్యారాధనలు, చతుస్థానార్చనలు, మంటపారాధనలు, మూలమంత్రజపాలు, ద్వారతోరణ పూజలు, దివ్యప్రబంధ పారాయణాదులు, మహామంత్ర పుష్ప పఠనాలు నిర్వహించారు. వేదమంత్రాలతో ఆలయ అర్చకులు రథాంగ హోమం చేపట్టారు. కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాలు, చెక్కభజనలతో భక్తిభరితంగా రథోత్సవం సాగింది. కార్యక్రమంలో అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఈఓ ఎన్.గీత, డిప్యూటీ ఈఓ దోర్బల భాస్కర్, ఆలయ ప్రధానార్చకుడు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, ఉప ప్రధానార్చకులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
మహావిష్ణువుగా యాదగిరీశుడి దర్శనం
బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారు మహావిష్ణువుగా దర్శనమిచ్చారు. ఉదయం స్వయంభూ నారసింహుడి నిత్యారాధనల అనంతరం స్వామివారిని మహావిష్ణు అలంకారం గావించి గరుడవాహనంపై ఊరేగించారు.
నేడు చక్రతీర్థం.. దేవతోద్వాసన
స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం 10.30 గంటలకు మహాపూర్ణాహుతి, చక్రతీర్థం, సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం, దేవతోద్వాసన, దోపోత్సవం నిర్వహించనున్నారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
యాదగిరిగుట్టకు చెందిన వైష్ణవ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో ఉదయం ప్రభాతభేరీ, లక్ష్మీనరసింహ స్వామి మహిళా భజన మండలి, హైదరాబాద్కు చెందిన శబరిగిరీశ అయ్యప్ప భక్తబృందం ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు, ఆస్థానం వారితో మంగళవాయిద్యాలు జరిగాయి. అనంతరం భాస్కరభట్ల ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో గజేంద్రమోక్షంపై ఉపన్యాసం, రామాంజనేయ భాగవతార్ ఆధ్వర్యంలో సీతాకల్యాణం హరికథ, సాయంత్రం వివిధ బృందాలతో కూచిపూడి నృత్య ప్రదర్శన, భక్తి సంగీతం, చిందు, యక్షగానం, పాండు బృందం వారితో కోలాటం నిర్వహించారు.