యాదాద్రి, ఆగస్టు 26 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో స్వామి, అమ్మవార్లకు నిత్యరాధనలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పిన అర్చకులు తిరువారాధన, నిజాభిషేకాలతో నిత్యారాధనలు ప్రారంభించారు. స్వామివారికి సహస్రనామార్చన, లక్ష్మి అమ్మవారికి కుంకుమార్చనలు శాస్ర్తోక్తంగా జరిపించారు. నృసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేసి, హారతి నివేదనలు అర్పించారు. ఉదయం సుమారు గంటన్నర పాటు సుదర్శన హోమంతో శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం చేశారు. అనంతరం దేవేరులను ముస్తాబు చేసి గజవాహన సేవ నిర్వహించారు.
ప్రతిరోజూ నిర్వహించే నిత్య తిరుకల్యాణోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వీక్షించారు. లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణ తంతు జరిపించారు. కల్యాణమూర్తులను ముస్తాబు చేసి ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో భక్తులకు అభిముఖంగా అధిష్టించి కల్యాణ తంతు జరిపించారు. అనంతరం నిర్వహించిన మొక్కు బ్రహ్మోత్సవ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా దర్శనాలు కొనసాగాయి. సాయంత్రం వేళ ఉభయ జోడు సేవలు, దర్బార్ సేవ నిర్వహించారు. రాత్రి నివేదన, శయనోత్సవ కార్యక్రమం వైభవంగా కొనసాగింది. దీక్షాపరుల మండపంలో నిర్వహిస్తున్న సత్యనారాయణ వ్రతాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వ్రతమాచరించారు. సాయంత్రం అద్దాల మండపంలో ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవను కోలాహలంగా నిర్వహించారు. పరమ పవిత్రంగా నిర్వహించే సేవలో మహిళా భక్తులు పాల్గొని తరించారు. ప్రధానార్చకుడు ఆధ్వర్యంలోని అర్చక బృందం వైభవంగా పూజలు నిర్వహించింది. ముత్తయిదువులు మంగళహారతులతో అమ్మవారిని స్తుతిస్తూ పాటలు పాడుతూ సేవ ముందు నడిచారు. తిరువీధిసేవ అనంతరం అమ్మవారిని అద్దాల మండపంలోని ఊయలతో శయనింపు చేశారు. గంట పాటు వివిధ రకాల పాటలతో అమ్మవారిని కొనియాడుతూ లాలిపాటల కార్యక్రమం కోలాహలంగా సాగింది. వివిధ విభాగాలు కలుపుకొని శ్రీవారి ఖజానాకు రూ. 28,28,212 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
నేటితో శ్రావణలక్ష్మి కోటి కుంకుమార్చన పరిపూర్ణం
శ్రావణమాసం సందర్భంగా స్వామివారి ప్రధానాలయం వెలుపలి ప్రాకారం ఈశాన్య మండపంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘శ్రావణలక్ష్మి కోటి కుంకుమార్చన’కు ప్రధానార్చక బృందం శనివారం సాయంత్రం ముగింపు పలకనుంది. ప్రధానాలయ పునఃప్రారంభం అనంతరం తొలిసారిగా జూలై 29న కోటి కుంకుమార్చన చేపట్టగా శనివారం నాటికి పూర్తికానున్నాయి. యాదాద్రీశుడిని హైదరాబాద్ కమాండెంట్ ఆఫ్ ఆర్టీ సెంటర్ బ్రిగేడియర్ జయదీప్ యాదవ్ కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
త్వరలో కోటి పుష్పార్చన!
యాదాద్రి నారసింహుడికి కోటి పుష్పార్చన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. వివిధ రకాల కోటి పుష్పాలతో స్వామివారికి ప్రత్యేకమైన పూజా కైంకర్యాలు చేపట్టనున్నారు. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు, విధి విధానాలపై ఆలయాధికారులు దృష్టి సారించారు. కోటి పుష్పార్చనకు సంబంధించిన వివరాలను త్వరలో అధికారికంగా వెలువడనున్నాయి. వచ్చే నెలలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.