యాదాద్రి, డిసెంబర్ 17: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి నిత్య కల్యాణోత్సవాన్ని అర్చకులు శనివారం శాస్ర్తోక్తంగా జరిపించారు. ఉదయం స్వామి వారికి సుదర్శన నారసింహ హోమం, కల్యాణమూర్తులకు గజవాహన సేవ నిర్వహించారు. అనంతరం వెలుపలి ప్రాకార మండపంలో తూర్పునకు అభిముఖంగా స్వామి, అమ్మవార్లను వెంచేపు చేసి కల్యాణోత్సవం జరిపించారు. సుమారు గంటన్నర పాటు నిర్వహించిన వేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భక్తులు స్వయంభువుడిని దర్శించుకున్నారు. స్వామి వారి నిత్యోత్సవాలు తెల్లవారుజాము నుంచే మొదలయ్యాయి. ఉదయం సుప్రభాత సేవతో స్వామిని మేల్కొల్పిన అర్చకులు తిరువారాధన నిర్వహించి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేశారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లకు తిరువీధి సేవోత్సవం, దర్బార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా సాగాయి. స్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులతో ఆలయం సందడిగా మారింది. స్వామి వారిని సుమారు 22వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామి వారి ఖజానాకు రూ.26,38,054 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
స్వామిని దర్శించుకున్న కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ.వివేకానందగౌడ్ దర్శించుకున్నారు. శనివారం యాదాద్రికి చేరుకున్న ఆయన స్వయంభువుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు ఆయనకు ఆలయ సంప్రదాయరీతిలో ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు వేదాశీర్వచనం చేయగా, ఆలయాధికారులు స్వామి ప్రసాదం అందించారు.
నేడు తిరుపతికి పాదయాత్ర ప్రారంభం
హాతీరామ్బాబా బాలాజీ తిరుపతి దైవదర్శన పాదయాత్ర ఆదివారం ఉదయం 10గంటలకు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం నుంచి ప్రారంభంకానుంది. యాదాద్రి డిప్యూటీ స్తపతి మోతీలాల్ ఆధ్వర్యంలో నిర్వహించే మహా పాదయాత్రలో భక్తులు, సంత్లు, మహా సంత్లు పాల్గొననున్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం పునర్నిర్మాణం పూర్తయితే కాలినడకన తిరుమల తిరుపతికి వచ్చి దర్శనం చేసుకుంటామని అప్పట్లోనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 2023 జనవరి 2వ తేదీ వరకు తిరుపతికి చేరుకుని స్వామిని దర్శించుకుని మొక్కు తీర్చుకోనున్నట్లు తెలిపారు.
వైభవంగా ధనుర్మాసోత్సవాలు
యాదాద్రి ప్రధానాలయంలోని మొదటి ప్రాకార మండపంలో ధునుర్మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శనివారం రెండోరోజు ఆండాళ్ అమ్మవారిని దివ్య మనోహరంగా అలంకరించారు. గోదాదేవి, శ్రీరంగనాయకుడిపై రచించిన పాశురాలను పఠిస్తూ అర్చకులు మార్గళి పూజలు చేశారు.