తుర్కపల్లి, నవంబర్ 26 : అర్హులంతా ఓటు నమోదు చేయించుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. మండలంలోని రుస్తాపురంలో ఏర్పాటు చేసిన ఓటరు నమోదు కేంద్రాన్ని శనివారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. 18 ఏండ్లు నిండిన యువతీ యువకులు ఫారం-6 పూర్తిచేసి బీఎల్ఓల వద్ద ఓటు నమోదుచేసుకోవాలన్నారు. ఫారం-8 ద్వారా ఓటరు సవరణ, ఫారం- 7 ద్వారా ఓటరు తొలగింపు చేసుకోవచ్చన్నారు. బీఎల్ఓలు ఓటరు నమోదు కేంద్రాల్లో అందుబాటులో ఉండి దరఖాస్తులు స్వీకరించాలన్నారు. తుర్కపల్లి ఓటరు నమోదు కేంద్రాన్ని డీఆర్డీఓ ఉపేందర్రెడ్డి సందర్శించారు. వారి వెంట తాసీల్దార్ బ్రహ్మయ్య, బీఎల్ఓలు ఉన్నారు.
యాదగిరిగుట్ట రూరల్ : 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని రామాజీపేట సర్పంచ్ మొగిలిపాక తిరుమలారమేశ్ సూచించారు. ఓటరు నమోదు ప్రత్యేక కార్యక్రమాన్ని పురస్కరించుకొని గ్రామానికి చెందిన పలువురి నుంచి శనివారం దరఖాస్తులు స్వీకరించి వాటిని రెవెన్యూ అధికారులకు అందజేశారు. కార్యక్రమంలో ఆర్ఐ రామారావు, బీఎల్ఓ, వీఆర్ఏలు పాల్గొన్నారు.
భూదాన్పోచంపల్లి : పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో ఓటర్ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా తాసీల్దార్ వీరాబాయి మాట్లాడుతూ 18 ఏండ్లు నిండిన వారంతా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ సైదిరెడ్డి, ఆర్ఐ వెంకట్రెడ్డి, అంగన్వాడీ టీచర్లు, వీబీకేలు పాల్గొన్నారు.
ఆలేరు రూరల్ : ఓటరు నమోదును వినియోగించుకోవాలని తాసీల్దార్ రామకృష్ణ అన్నారు. శనివారం మండల వ్యాప్తంగా ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. పోలింగ్ బూత్లలో ఓటరు జాబితాతోపాటు బీఎల్ఓలు అందుబాటులో ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ తాసీల్దార్ ఇద్రీస్, బీఎల్ఓలు, వీఆర్ఏలు పాల్గొన్నారు.
రామన్నపేట : మండలంలోని వెల్లంకి గ్రామంలో ఓటు నమోదు కేంద్రాన్ని తాసీల్దార్ ఆంజనేయులు పరిశీలించారు. బీఎల్ఓలకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 2023 జనవరి 1 నాటికి 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలన్నారు. ఆయన వెంట డిప్యూట్యీ తాసీల్దార్ శ్రీనివాస్, గాలయ్య ఉన్నారు.
గుండాల : 18 ఏండ్లు నిండిన యువత ఓటు నమోదు చేసుకోవాలని తాసీల్దార్ జ్యోతి సూచించారు. శనివారం మండలంలోని అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఓటరు నమోదు కేంద్రాలను ఆమె పరిశీలించారు. నూతన ఓటర్లు ఫారం-6 ద్వారా, ఓటు తొలగింపు ఫారం-7 ద్వారా, చిరునామా మార్పు ఫారం-8తో చేసుకోవచ్చని తెలిపారు.