కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
నల్లగొండ, ఫిబ్రవరి 12 : ప్రభుత్వం ఆదేశాల మేరకు ‘మన ఊరు – మన బడి, మన బస్తీ-మన బడి’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి కార్యక్రమంతో పాటు వ్యాక్సినేషన్పై ఆయా జిల్లాల కలెక్టర్లు, జడ్పీ చైర్మన్లతో శనివారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 1483 ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హైస్కూల్స్ ఉన్నట్లు తెలిపారు. విద్యాశాఖ జారీ చేసిన జాబితా ప్రకారం ఎన్ని పాఠశాలలు గ్రౌండింగ్ చేయాలనేది చూసి దాని ఆధారంగా చేస్తామని మంత్రులకు వివరించారు. జిల్లా, మండల స్థాయిలో ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఈ కార్యక్రమం విజయవంతానికి చర్యలు చేపడతామన్నారు. వ్యాక్సినేషన్ విషయంలో రెండో వ్యాక్సిన్తో పాటు బూస్టర్ డోస్ వేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, జడ్పీ సీఈఓ వీరబ్రహ్మచారి, డీఈఓ పాల్గొన్నారు.
ల్యాండ్ ఫూలింగ్ స్కీం కింద వెంచర్లు ఏర్పాటు
నీలగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(నుడా) పరిధిలో ల్యాండ్ ఫూలింగ్ స్కీం కింద వెంచర్లు ఏర్పాటు చేసి లే అవుట్లు అభివృద్ధి చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. నుడా పథకం అమలులో భాగంగా అవసరమైన భూమి సేకరణకు నల్లగొండ మండలంలోని కొత్తపల్లి, జీ చెన్నారం గ్రామాలకు చెందిన రైతులు, లావుణి పట్టాదారులతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల పరస్పర భాగస్వామ్యంతో నుడా కింద కొత్తపల్లి, జీ.చెన్నారం గ్రామాల పరిధిలో వెంచర్లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ల్యాండ్ ఫూలింగ్కు కనీసం 50ఎకరాల భూమి అవసరమని అందుకోసం భూమి పట్టాదారులు ముందుకు వస్తే ప్రభుత్వమే అన్ని ఖర్చులతో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. రోడ్డు ఫేస్ ఉన్న వాళ్లకు మొదటి ప్రాధాన్యం ఇవ్వనున్నుట్లు తెలిపారు. లావాణీ పట్టాదారులకు మాత్రం ఎకరాకి 600గజాలు స్థలం ఇవ్వనున్నట్లు తెలిపారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ రాహుల్శర్మ, డీఆర్ఓ జగదీశ్వర్రెడ్డి, తాసీల్దార్ నాగార్జున్రెడ్డి, రైతులు పాల్గొన్నారు.