కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ అల్లుడు, హైదరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ ఏకే ఖాన్ కొడుకుపై క్రిమినల్ కేసు నమోదైంది. పెట్టుబడుల పేరిట రూ.50లక్షలు మోసం చేశాడని సినీ నిర్మాత వెంకట అనీశ్ రెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని మణికొండ ప్రాంతానికి చెందిన సినీ నిర్మాత వెంకట అనీశ్ రెడ్డి ప్రస్తుతం మహారాగ్ని అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కోసం అతను ఫైనాన్షియర్ల కోసం వెతుకుతున్న సమయంలో షబ్బీర్ అలీ అల్లుడు మోసిన్ ఖాన్, తబ్రేజ్ పరిచయమయ్యారు. జూబ్లీహిల్స్ సన్లైట్ కార్యాలయంలో పరిచయమైన వారు.. పెట్టుబడులను సమకూరుస్తామని నమ్మించారు. ఫైనాన్స్ ఇప్పించాలంటే తమకు కమిషన్ రూపంలో ముందుగానే రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే వారిని నమ్మిన అనీశ్ రెడ్డి.. అడిగినంత డబ్బును ముందుగానే ఇచ్చేశాడు.
అయితే డబ్బులు తీసుకుని రోజులు గడుస్తున్నప్పటికీ మోసిన్ ఖాన్, తబ్రేజ్ల నుంచి ఎటువంటి స్పందన లేదు. దీంతో జూబ్లీహిల్స్ సన్లైట్ కార్యాలయానికి వెళ్లి డబ్బులు తిరిగి ఇవ్వాలని అనీశ్ పట్టుబట్టాడు. అయితే డబ్బులు ఇవ్వకుండా బౌన్సర్లతో దాడి చేయించి అక్కడి నుంచి పంపించారు. ఈ క్రమంలో అనీశ్ రెడ్డి పోలీసులను ఆశ్రయించారు. అనీష్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.