ట్విట్టర్ మెసేజ్కు స్పందించి ఆదుకోవాలని అధికారులకు ఆదేశం
మోటకొండూర్, ఫిబ్రవరి 15 : తండ్రిని కోల్పోయి చదువు దూరమై ఇబ్బంది పడుతున్న చిన్నారులకు అండగా నిలిచారు మంత్రి కేటీఆర్. వారి కుటుంబానికి తోడ్పాటునందించాలని జిల్లా కలెక్టర్, జిల్లా బాలల పరిక్షణ అధికారులను ఆదేశించారు. దాంతో మంగళవారం బాలల పరిరక్షణ అధికారులు పిల్లల ఇంటికి వెళ్లి వివరాలు తెలుసుకొని నిత్యావసరాలు అందించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్ మండలం ముత్తిరెడ్డిగూడేనికి చెందిన చిట్టిగళ్ల స్వామి(32), రజిత(29) దంపతులు. వీరికి ముగ్గ్గురు సంతానం కాగా పెద్ద కూతురు అమ్ములు(8) 3వ తరగతి, కుమారుడు మను(6) 2వ తరగతి, చిన్న కూతురు చిట్టి (3) అంగన్వాడీలో చదువుతున్నారు. స్వామి గ్రామంలో ఆటో నడుపుతూ.. భార్య రజిత రోజు వారీ కూలీ పని చేస్తూ జీవనం సాగించేవారు. కరోనా లాక్డౌన్తో పని లేక ఆటో నడపడం కష్టంగా మారడంతో స్వామి గత సంవత్సరం నుంచి ఇంటి వద్దనే ఉంటూ కూలీ పనికి వెళ్లేవాడు. గత నెల జనవరి 15న తీవ్ర కడుపునొప్పి రావడంతో స్వామిని హైదరాబాద్లోని దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ జనవరి 20న మృతి చెందాడు. దాంతో చిన్నారుల చదువులు ప్రశ్నార్థకంగా మారాయి. తల్లి కూలి చేస్తేనే గానీ పూట గడువని పరిస్థితి.. ఇంటి పెద్ద దిక్కు లేకపోవడంతో స్థానికులు చిన్నారులను చూసి చలించిపోయారు.
ట్విట్టర్ మెస్సేజ్కు స్పందించిన మంత్రి కేటీఆర్
‘నిరుపేద దళిత కుటుంబానికి చెందిన చిన్నారులు తండ్రిని కోల్పోయి.. చదువుకు దూరమై.. జీవనం గడపానికి కూడా ఇబ్బంది ఉందని.. చిన్నారులకు మంచి చదువు అందించాలి’ అని కోరుతూ వారి బంధువైన మురళి అనే యువకుడు మంత్రి కేటీఆర్కు ఈ నెల 13న టిట్టర్లో పోస్ట్ చేశాడు. మంత్రి కేటీఆర్ మంగళవారం స్పందించి చిన్నారులకు పూర్తి భరోసా కల్పిస్తామని తెలిపారు. పిల్లల పూర్తి వివరాలను సేకరించాలని జిల్లా కలెక్టర్కు, జిల్లా బాలల పరిక్షణ అధికారులకు ట్విట్టర్ ద్వారా ఆదేశించారు. దీంతో కలెక్టర్ ఆదేశాలతో జిల్లా బాలల పరిరక్షణ అధికారులు మంగళవారం ముత్తిరెడ్డిగూడెం గ్రామానికి వెళ్లి చిన్నారులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారి చదువు, ఆర్థిక పరిస్థితిని తెలుసుకొని నిత్యావసర సరుకులను అందించారు. బాలల పరిరక్షణ అధికారులు పులుగుజ్జు సైదులు, కవిత, సర్పంచ్ ఆడెపు విజయస్వామి, ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మ, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.