నార్కట్పల్లి ఫిబ్రవరి 12 : చెర్వుగుట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శనివారం పార్వతీపరమేశ్వరులు కొండపై అశ్వవాహనంపై విహరించి భక్తులకు కనువిందు చేశారు. ఉత్సమూర్తులకు ఆలయ ప్రధాన అర్చకుడు పోతులపాటి రామలింగేశ్వరశర్మ ఆధ్వర్యంలో అర్చకులు మహా మండపం వద్ద 108 కలశాలతో అభిషేకం నిర్వహించారు. మన్యు సూక్తి హోమం, బలిహరణ, జయాది హోమం, ధ్వజారోహణ, త్రిశూల స్నానం, వసంతోత్సవం, చందనాభిషేకంతోపాటు క్షేత్ర పాలకుడు కాల భైరవుడికి అభిషేకం జరిపించారు. అనంతరం స్వామివారికి వైభవంగా పుష్పోత్పవం, ఏకాంత సేవ నిర్వహించారు. ఆలయ చైర్మన్ మేకల అరుణా రాజిరెడ్డి, ఇన్చార్జి ఈఓ మహేంద్రకుమార్, ఆలయాభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
నేడు గ్రామోత్సవం..
బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం గ్రామోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్త్తయ్యాయి. చెర్వుగట్టు, ఎల్లారెడ్డిగూడేల్లో పార్వతీ జడల రామలింగేశ్వరస్వామిని గజవాహనంపై ఊరేగించనున్నట్లు ఆలయ చైర్మన్ మేకల అరుణారాజిరెడ్డి, ఇన్చార్జి ఈఓ మహేంద్ర కుమార్, ప్రధాన అర్చకుడు పోతులపాటి రామలింగేశ్వరశర్మ తెలిపారు.