నాగార్జున సాగర్ ఆయకట్టులో వరి గడ్డికి గిరాకీ ఏర్పడింది. యంత్రాల సాయంతో కోసి భద్రపర్చడంతో విక్రయించేందుకు సౌకర్యంగా ఉంటున్నది. దాంతో ఆంధ్రా నుంచి వ్యాపారులు రంగంలోకి దిగి క్రయ, విక్రయాలు జరుపుతున్నారు. ఒక్క మోపు ధర రూ.100నుంచి 150 పలుకుతుండగా రైతులకు ఆర్థికంగా మేలు జరుగుతున్నది. ఎకరంలో కోత, గడ్డి కట్టలు కట్టడానికి రూ.3వేలు పెట్టుబడి అవుతుండగా అమ్ముకుంటే ఖర్చులు పోను రూ.7వేలు ఆదాయం ఉన్నదని రైతులు చెప్తున్నారు.
మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలో మిర్యాలగూడ, దామరచర్ల, వేములపల్లి, మాడ్గులపల్లి మండలాలున్నాయి. ఎక్కువ భాగం సాగర్ ఆయకట్టు పరిధిలో ఉండడంతో వానకాలంలో 90 శాతం రైతులు వరి సాగు చేశారు. ట్రాక్టర్ యంత్రాల సాయంతో వరిసాగు చేస్తుండడంతో రైతులందరికీ వరి గడ్డి అవసరం పెద్దగా ఉండడం లేదు. దాంతో పంట కోత పూర్తయిన తర్వాత గడ్డిని అమ్ముకొని ఆదాయం పొందుతున్నారు.
ఆయకట్టు నుంచి ఆంధ్రాకు….
సాగర్ ఆయకట్టు నుంచి నాన్ ఆయకట్టు ప్రాంతాలైన దేవరకొండ, తిప్పర్తి, పెద్దవూర, నకిరేకల్, కట్టంగూర్, నార్కట్పల్లి, భువనగిరి, రామన్నపేట తదితర ప్రాంతాలకు వరి గడ్డి ఎగుమతి అవుతున్నది. మరోవైపు ఆంధ్రాలో వాణిజ్య పంటల సాగు పెరిగిన నేపథ్యంలో గడ్డి కొరత ఏర్పడింది. దాంతో దళారులు పెద్ద ఎత్తున గడ్డి కొనుగోలు చేసి తరలిస్తున్నారు. గుంటూరు జిల్లా దాచెపల్లి, మాచర్ల, పిడుగురాళ్ల, గురజాల మండలాల రైతులు గడ్డిని కొనుగోలు చేస్తున్నారు.
ఎకరానికి రూ.7వేలు ..
రైతులకు ధాన్యంతో పాటు వరి గడ్డి విక్రయంతో ఆదాయం పొందుతున్నారు. ఎకరం పంటలో వరి గడ్డి 80 నుంచి 100 కట్టలు వస్తుంది. ఒక్క కట్ట రూ.100కు అమ్ముతున్నారు. యంత్రసాయంతో ఒక్క కట్ట కట్టేందుకు రైతుకు రూ.20 నుంచి 30 ఖర్చు అవుతుంది. కట్టకు రూ.30 ఖర్చు పోగా రూ.70 మిగులుతుంది. అంటే ఎకరం గడ్డి కట్టలు కట్టడానికి రూ.3 వేలు, రూ.7వేలు వస్తున్నాయి. ఐదెకరాలు ఉన్న రైతుకు గడ్డిపైనే సుమారు రూ.35 వేల ఆదాయం వస్తుంది.
స్థానికంగానూ పెరిగిన గిరాకీ..
సాగర్ ఆయకట్టు మండలాలైన నేరేడుచర్ల, పాలకవీడులో బాడువా పొలాలు అధికంగా ఉన్నాయి. పంట కోతల సమయంలో సుమారు 20 రోజుల పాటు తుఫాన్ కారణంగా ముసురు వాన కురిసింది. దాంతో ఎక్కువ మంది రైతులు చైన్ మిషన్తో పొలాలు కోయించారు. టైర్ల మిషన్తో కోసిన గడ్డిని రెండ్రోజులు ఆరబెట్టి కట్టలు కట్టించే వీలుంటుంది. కానీ, చైన్ మిషన్ కోస్తే గడ్డి సేకరణకు అవకాశం ఉండదు. దాంతో స్థానికంగా వరి గడ్డి కొరత ఏర్పడింది. ట్రాక్టర్ గడ్డి రూ.5వేల నుంచి రూ.7వేలు పెట్టి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వరి గడ్డి అమ్మకంతో అదనపు ఆదాయం
వరి గడ్డి అమ్ముకోవడంతో అదనంగా ఆదాయం వస్తున్నది. ఈ ఆదాయం పంట పెట్టుబడికి కొంత ఉపయోగపడుతుంది. నాకు ఆరు ఎకరాల భూమి ఉంది. వరి గడ్డి అమ్మితే సుమారు రూ. 50వేల ఆదాయం వచ్చింది.
– సైదులు, రైతు, ఉట్లపల్లి, మిర్యాలగూడ
తుఫాన్ దెబ్బతో గడ్డికి కొరత వచ్చింది..
ఈ ఏడాది పశు గ్రాసానికి చాలా ఇబ్బంది వచ్చింది. గతంలో టైర్ మిషన్లు పెట్టి, కూలీలతోని గడ్డి కట్టలు కట్టించేది. కానీ, ఈ సారి తుఫాన్ వల్ల చైన్ మిషన్ తెప్పించి పొలం కోయించినం. కట్టలు కట్టేందుకు ఆ గడ్డి ఉపయోగపడదు. అందుకే పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి గడ్డి కొనాల్సి వచ్చింది.
– భూక్యా చరణ్ నాయక్, కల్మటితండా, పాలకవీడు