యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ) : కిడ్నీ బాధితుల బాధలు తీర్చేందుకు జిల్లాలో మొదటిసారిగా 2022లో ఆలేరులో డయాలసిస్ కేంద్రాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి చొరవతో ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో 1200 చదరపు అడుగుల వైశాల్యంతో సెంటర్ ఏర్పాటైంది. 10 యంత్రాలను అందుబాటులోకి తెచ్చారు. రోజుకు ముగ్గురు చొప్పున సుమారు 30 మంది బాధితులకు సేవలు అందుతున్నాయి. అనుభవజ్ఞులైన సిబ్బందిని సైతం నియమించారు. దాంతో బాధితులకు వేల రూపాయాల ఆర్థిక భారం తప్పుతున్నది.
చౌటుప్పల్లో డయాలసిస్ సెంటర్..
చౌటుప్పల్ పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రం కిడ్నీ బాధితులకు వరంగా మారింది. ఈ ఏడాది జనవరి 3న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు, జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి చేతులమీదుగా సేవలను ప్రారంభించారు. 5 యంత్రాలతో నిత్యం 20 మందికి సేవలు అందిస్తున్నారు. సెంటర్ ఏర్పాటుతో చౌటుప్పల్, నారాయణపురం, భూదాన్ పోచంపల్లి, గట్టుప్పల్, చిట్యాల, వలిగొండ మండలాల బాధితులకు సేవలు అందుతున్నాయి. 100 కిలోమీటర్ల దూరానికి పైగా వెళ్లే రోగులంతా అత్యంత సమీపంలోనే ఉన్న డయాలసిస్ కేంద్రానికి వచ్చి చికిత్స పొంతున్నారు.
భువనగిరిలోనూ అందుతున్న సేవలు
మూత్రపిండ వ్యాధిగ్రస్తులకు మెరుగైన సేవలు ఉచితంగా అందించేందుకు భువనగిరి పట్టణంలో డయాలసిస్ సెంటర్ను ప్రభుత్వం ప్రారంభించింది. ఆస్పత్రిలోని ప్రత్యేక వార్డులో 5 యంత్రాలతో రోజుకు 20 మంది ఉచితంగా సేవలు అందిస్తున్నారు. దాంతో పేదలపై ఆర్థిక భారం తగ్గింది.
ఆధ్యాత్మిక క్షేత్రంలో అత్యాధునిక ఆస్పత్రి
ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా వెలుగొందుతున్న యాదగిరిగుట్టలో 100 పడకల దవాఖాన అందుబాటులోకి రానుంది. ఫిబ్రవరి 16న రాష్ట్ర మంత్రులు హరీశ్రావు, జగదీశ్రెడ్డి చేతుల మీదుగా దీనికి పునాదిరాయి పడింది. ఇప్పటి వరకు ఇక్కడ ఆరు పడకల ఆస్పత్రి మాత్రమే ఉంది. దీనిని అప్గ్రేడ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నవంబర్ 29న జీఓ జారీ చేసింది. ఆస్పత్రి నిర్మాణానికి రూ. 45.79 కోట్లు మంజూరు చేసింది. ఈ ఆస్పత్రి అందుబాటులోకి వస్తే గుట్టకు వచ్చే భక్తులతోపాటు, యాదగిరిగుట్ట, రాజాపేట, తుర్కపల్లి, బొమ్మలరామారం, ఆలేరు మండలాల ప్రజలకు మెరుగైన సేవలు అందనున్నాయి.
వచ్చే విద్యాసంవత్సరం నుంచి మెడికల్ కాలేజీ
రాష్ట్ర వ్యాప్తగా మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తీసుకొస్తున్న రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి భువనగిరి జిల్లాలో సైతం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నది. జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేయనున్నట్లు మంత్రి హరీశ్రావు ఇప్పటికే పలు మార్లు ప్రకటించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కాలేజీ ప్రారంభమవుతుందని ఇటీవల చౌటుప్పల్లో కూడా స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీ వస్తే సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. జిల్లా కేంద్రంలోనే 35 రకాల వైద్య విభాగాల సేవలు అందే అవకాశం ఉంటుంది. పేద విద్యార్థులకు వైద్య విద్య అందుతుంది. దాంతో పాటు అనేక మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది.
అధునాతన మార్చురీ
జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలో కొత్త మార్చురీ కోసం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రూ.99 లక్షలు మంజూరు చేసింది. భువనగిరి పట్టణ ప్రధానరహదారితోపాటు రోడ్లపై ప్రమాదాల్లో నిత్యం అనేక మంది ప్రాణాలు కోల్పోతుంటారు. నెలకు సుమారు 20 కిపైగా మృతదేహాలను తీసుకొస్తున్నారు. ప్రస్తుత మార్చురీలో రెండు ఫ్రీజర్లు మాత్రమే ఉండటం.. అవి కొన్ని సమయాల్లో పనిచేయక పోవడంతో సరిపోవడం లేదు. ప్రస్తుతం కొత్తగా ఏర్పాటు చేసే మార్చురీలో ఏసీ, ఫ్రీజర్లు, డాక్టర్కు ప్రత్యేక గది నిర్మించనున్నారు.
సత్ఫలితాలనిస్తున్న ఆరోగ్య మహిళ
అతివల ఆరోగ్యమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరోగ్య మహిళ కార్యక్రమం మెరుగైన సత్ఫలితాలను ఇస్తున్నది. ప్రతి మంగళవారం పీహెచ్ఎసీలకు మహిళలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. జిల్లాలోని గుండాల, బీబీనగర్ పీహెచ్సీల్లో ఇప్పటి వరకు 800 మందికి వైద్యసేవలు అందించారు. 80 మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అవసరం ఉన్న వారిని పెద్దాసుపత్రులకు రిఫర్ చేస్తున్నారు.
24 హెల్త్ సబ్ సెంటర్లకు భవనాలు
గ్రామీణ ప్రాంతాల్లో ఉండే హెల్త్ సబ్ సెంటర్ల బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగా ఇటీవల జిల్లాకు 24 హెల్త్ సబ్ సెంటర్లకు పక్కా భవనాలు నిర్మించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో భాగంగా రూ. 4.80కోట్లను మంజూరు చేసింది. సొంత భవనాలు లేక అద్దె భవనాలు, ఇరుకు గదుల్లో వైద్య సేవలు అందించాల్సి పరిస్థితి ఉండేది. మరికొన్ని శిథిలావస్థకు చేరుకున్నాయి. కొత్తభవనాలు రానుండటంతో ఇబ్బందులు తీరనున్నాయి.
ప్రజలకు చేరువైన ప్రభుత్వం వైద్యం
సీఎం కేసీఆర్ ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలకు చేరువ చేస్తుండడంతో చాలా మందికి లబ్ధి చేకూరుతున్నది. చౌటుప్పల్లో 100 పడకల దవాఖానకు శంకుస్థాపన చేయడమే ఇందుకు నిదర్శనం. ఇప్పటికే డయాలసిస్ కేంద్రం, పాలియేటివ్ సెంటర్ కూడా ఇక్కడే ఏర్పాటు చేశారు. గ్రామాల్లో పల్లె దవాఖానలు ఏర్పాటు చేశారు. గతంల ఏదైనా రోగమొస్తే హైదరాబాద్కు వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల వైద్య సేవలను ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నది. నయా పైసా ఖర్చులేకుండా చికిత్స అందిస్తున్నది.
-బొడిగె బాలకృష్ణగౌడ్, చౌటుప్పల్
మెరుగైన వైద్యం అందుతున్నది
భువనగిరిలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయడంతో మాలాంటి వారికి ఎంతో మేలు కలుగుతున్నది. ఫ్రీగా డయాలసిస్ చేస్తుండడంతో పాటు హైదరాబాద్కు వెళ్లే బాధ తప్పింది. ప్రైవేటు కంటే ప్రభుత్వ దవాఖానలోనే మంచిగా వైద్యం చేస్తున్నరు. నేను ప్రభుత్వ దవాఖానాకు రోజు తప్పించి, రోజు వచ్చి డయాలసిస్ చేయించుకుంటున్న. డాక్టర్లు మంచిగా ట్రీట్మెంట్ ఇస్తున్నరు. మా లాంటి వారికోసం ప్రభుత్వ దవాఖానలు ఏర్పాటు చేస్తున్న సీఎం కేసీఆర్ సార్కు జీవితాంతం రుణపడి ఉంటాం.
-బొల్లేపల్లి నవీన్కుమార్, భువనగిరి