కేతేపల్లి, జనవరి 12 : ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు పనిచేయాలని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ సూచించారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 18 నుంచి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు పథకం విజయవంతం చేయడానికి అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
సంక్షేమ పథకాల అమలుతీరులో అధికారులు కీలక పాత్ర పోషించాలని ఆయన సూచించారు. ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో రూ.2 లక్షలతో టాయిలెట్ల నిర్మాణం, మరో రూ.3 లక్షలతో స్థానిక పీహెచ్సీ వరకు సీసీ రోడ్డు నిర్మాణం తన నిధులతో చేపడుతానన్నారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై సభ్యులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. కాగా గ్రామ సమస్యలను పరిష్కరించాలని చీకటిగూడెం సర్పంచ్ కోట వెంకటేశ్వరరావు సమావేశ మందిరం ఎదుట అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. తోటి సభ్యుల విజ్ఞప్తి మేరకు ఆయన నిరసన విరమించారు. ఎంపీపీ శేఖర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వైస్ ఎంపీపీ మాధవి, తాసీల్దార్ డి.వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ రమేశ్ దీన్దయాళ్, ఎంపీటీసీలు బొజ్జ సుందర్, ఎడ్ల సంధ్య, బుర్రి యాదవరెడ్డి, డి.నర్మద, ఎం. వెంకన్నయాదవ్, పి.ఇందిర, పీఏసీఎస్ చైర్మన్ బోళ్ల వెంకట్రెడ్డి, సర్పంచులు పాల్గొన్నారు.