వేములపల్లి, ఏప్రిల్ 7 : మండలంలోని మొల్కపట్నం గ్రామంలో నాలుగు రోజులుగా తాగునీరు రావడం లేదని మహిళలు ఆదివారం బిందెలతో రోడ్డెక్కారు. మిషన్ భగీరథ నీటితోపాటు గ్రామంలో ఉన్న బోరు ద్వారా వచ్చే పైపులైన్లు పగిలిపోయి నీరు రావడం లేదని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ పాదూరి గోవర్ధని మాట్లాడుతూ నాలుగు రోజులుగా నీళ్లు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.
సమస్యను గ్రామపంచాయతీ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కరించడం లేదని తెలిపారు. వేసవిలో ఎండ తీవ్రత పెరుగడంతోపాటు గృహ అవసరాలకు నీరు లేక మరోవైపు పశువులు, జీవాలకు తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు అవుతున్నాయన్నారు. పైపులైన్లకు మరమ్మతులు చేపట్టి మిషన్ భగీరథ నీటిని నిత్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు.