యాదాద్రి భువనగిరి, మే 7 (నమస్తే తెలంగాణ) : జిల్లావ్యాప్తంగా 325 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని నిర్ణయించగా, ప్రస్తుతానికి 320 కేంద్రాలు ప్రారంభించారు. 82ఐకేపీ, 228పీఏసీఎస్, 10ఎఫ్పీఓలతో కేంద్రాలు కొనసాగుతున్నాయి. వీటి ద్వారా ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. శనివారం వరకు వివిధ కేంద్రాల్లో 52,952 మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నారు. ఇందులో 46,761 మెట్రిక్ టన్నుల ధాన్యం రైస్ మిల్లులకు తరలించగా, ఇంకా 6,191 మెట్రిక్ టన్నుల ధాన్యం తరలించాల్సి ఉంది. మొత్తం 5,916మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశారు. అధికారులు ఇప్పటికే జిల్లా దిగుబడి అంచనాలతో కొనుగోళ్లపై యాక్షన్ ప్లాన్ రూపొందించారు. జిల్లాలో సుమారు 6లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేసిన అధికారులు.. 5లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం 50శాతం వరి కోతలు పూర్తవగా మిగతావి కోత దశలో ఉన్నాయి.
మిల్లుల వద్ద రైతులకు ఇబ్బందులు కలుగకుండా పర్యవేక్షణకు ప్రత్యేకాధికారులను నియమించారు. 25మంది అధికారులు ఎప్పటికప్పుడు మిల్లుల వద్ద ఉండి కొనుగోళ్లు పర్యవేక్షిస్తున్నారు. రైతులను మధ్యవర్తులు మభ్యపెడితే తమ దృష్టికి తేవాలని సూచిస్తున్నారు. అయితే వరుసగా కురుస్తున్న వర్షాలతో ధాన్యం కొనుగోళ్లు కాస్త నెమ్మదిగా జరిగాయని, సోమవారం నుంచి వేగం చేస్తామని పౌరసఫరాల శాఖాధికారులు చెబుతున్నారు.
ధాన్యానికి ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర దకాలంటే రైతులు పలు సూచనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. రైతులు తమ ధాన్యాన్ని ప్రమాణాలకు అనుగుణంగా శుభ్రం చేసి, ఎండబెట్టి కేంద్రాలకు తేవాలి. నూర్పిళ్లలో రాళ్లు, మట్టి పెడ్డలు, చెత్తాచెదారం వంటివి లేకుండా శుభ్రం చేయాలి. ధాన్యాన్ని బాగా ఆరబెట్టి తేవాలి. ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చేముందు తాలు గింజలు, కల్తీ గింజలు, పొల్లు లేకుండా చూసుకోవాలి. రైతులు తమ ఫోన్ నంబర్ను ఆధార్తో అనుసంధానం చేసుకున్న తర్వాతే కేంద్రానికి తేవాలి. ధాన్యం విక్రయించే సమయంలో ఓటీపీ నంబర్ కోసం రైతులు ఫోన్ను తమ వద్దే ఉంచుకోవాలి. ఓటీపీ వచ్చాకే కొనుగోలు ప్రక్రియ ప్రారంభమవుతుంది. రైతులు ధాన్యాన్ని శాంపిల్ గా చూపించి టోకెన్ తీసుకోవాలి. తూకం వేసిన తర్వాత విధిగా స్లిప్ తీసుకోవాలి.
ఈ సారి సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోళ్ల కోసం ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లావ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని రకాల మిషన్లు సిద్ధంగా ఉంచారు. 700 తూకం వేసే పరికరాలు, 1200 తేమ నిర్ధారించే మీటర్లు అందుబాటులో ఉంచారు. రవాణాకు 240వాహనాలు ఏర్పాటు చేశారు. వర్షమొస్తే ధాన్యం తడవకుండా టార్పాలిన్లు సిద్ధంగా ఉంచారు. ప్రస్తుతం కేంద్రాల్లో 24లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. మరికొన్ని బ్యాగులు రానున్నాయి. మరోవైపు రైతులు తేమశాతం, తాలు లేకుండా ధాన్యం ఆరబెట్టుకొని తీసుకొచ్చేలా అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. సహాయ వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణాధికారులతో పాటు పౌర సరఫరాల అధికారులు సమన్వయం చేసుకుంటున్నారు.