నందికొండ, జూలై 18 : రాష్ట్రంలోని జల వనరులను సద్వినియోగం చేసుకుంటూ, జల విద్యుత్ కేంద్రాల్లో అన్ని యూనిట్లను ఉపయోగంలోకి తీసుకువస్తూ డిమాండ్కు తగినట్టుగా విద్యుత్ ఉత్పత్తి చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇందన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. నాగార్జున సాగర్ డ్యాం ప్రధాన జల విద్యుత్ కేంద్రంను శుక్రవారం ఆయన సందర్శించారు. అనంతరం జల విద్యుత్ కేంద్రంలోని సమావేశ మందిరంలో రాష్ట్రంలోని జల విద్యుత్ ప్రాజెక్ట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని జల విద్యుత్ ప్రాజెక్ట్లలో ఉపయోగంలో లేని యూనిట్లను ఉపయోగంలోకి తేవాలన్నారు. విద్యుత్ ఉత్పత్తిలో అధికారులు నిర్లక్ష్యం వహించరాదన్నారు. చేపట్టవలసిన పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు కార్యాచరణపై క్యాలెండర్ను రూపొందించి దాని ప్రకారం పనులను చేపట్టాలన్నారు.
నూతన సాంకేతికతో పురోగమించాలని, దానికి తగిన విధంగా మిషనరీ, సిబ్బందిని సిద్ధం చేయాలన్నారు. ప్రతి ఏటా విద్యుత్ వినియోగ డిమాండ్ పెరుగుతుందని, సంవత్సర కాలంలో 2 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ పెరిగిందన్నారు. డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ను సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సిబ్బందికి నూతన సాంకేతికతపై శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ప్రపంచం పునరుత్పాదక శక్తి వైపు వెళ్తున్న దృష్ట్యా దానిపై దృష్టి సారించాలన్నారు. గడిచిన సంవత్సర కాలంలో జెన్కో సిబ్బంది పద్ధతి ప్రకారం పనిచేయడం వల్ల ఎలాంటి బ్రేక్ డౌన్లు, విద్యుత్ కోతలు లేకుండా విద్యుత్ను అందించగలిగామన్నారు. ఇందుకు గాను ఆయ శాఖలోని అధికారులు, సిబ్బందిని అభినందించారు.
ప్రతిదీ విద్యుత్ పైన ఆధారపడి ఉందని, విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సమీక్ష సమావేశంలో రాష్ట్ర జెన్కో సీఎండీ డాక్టర్ హరీశ్ వివిధ ప్రాజెక్టుల వివరాలను వివరించారు. అనంతరం హిల్ కాలనీలోని బుద్ధవనంను డిప్యూటీ సీఎం సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్నాయక్, ఎమ్మెల్యేలు జైవీర్రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, బాలునాయక్, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్లు శ్రీనివాస్, నారాయణ అమిత్, హైడల్ డైరెక్టర్ బాలరాజు, సీఈలు మంగేశ్కుమార్, నారాయణ, ఎస్ఈలు పాల్గొన్నారు.
Nandikonda : నీటి వనరులను సద్వినియోగం చేసుకుంటూ విద్యుత్ ఉత్పత్తి : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క