కేతేపల్లి, ఆగస్టు 29 : తెలుగు భాషా పరిరక్షణకు ప్రతి ఒక్కరు నడుం బిగించాలని కేతేపల్లి మండలం భీమవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కే.భిక్షమయ్య అన్నారు. శనివారం గిడుగు రామ్మూర్తి జయంతి, ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని పాఠశాలలో వారి చిత్రపటాలకు ఉపాధ్యాయులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు వ్యవహారిక భాష కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు. ఆయన జయంతిని తెలుగు రాష్ట్రాలు తెలుగు భాష దినోత్సవముగా నిర్వహించుకోవడం హర్షణీయం అన్నారు. తెలుగు భాషకు పట్టని గొడుగు గిడుగు రామ్మూర్తి పంతులు అన్నారు. వ్యవహార భాషకు పట్టం కట్టిన మహనీయుడు గిడుగు అని కొనియాడారు.
ఇలాంటి వారి వలనే మనం సరళమైన భాషను మాట్లాడగలుగుతున్నామని అన్నారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని నేటి తరానికి చాటి చెప్పాలన్నారు. అమ్మ లాంటి కమ్మనైన మాతృబాషను మరువొద్దు అని అన్నారు. విద్యార్థులు మాతృ భాషపై మక్కువను పెంచుకోవాలని తెలిపారు. ధ్యాన్ చంద్ ను స్పూర్తి గా తీసుకుని విద్యార్థులు గొప్ప క్రీడాకారులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల తెలుగు భాష ఉపాధ్యాయుడు రాపోలు పరమేష్, కన్నె శివయ్య, బత్తుల జానకి రెడ్డి, గుమ్మడవల్లి రమేష్, మేడం శేఖర్, దోరేపల్లి నాగయ్య, సహాయ మేరీ, సీఆర్పీ మహేందర్, అటెండర్ అహ్మద్ పాల్గొన్నారు.

‘తెలుగు భాష పరిరక్షణకు నడుం బిగించాలి’