నల్లగొండ ప్రతినిధి, మే 25 (నమస్తే తెలంగాణ) : వరంగల్ – ఖమ్మం – నల్లగొండ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారానికి శనివారం సాయంత్రం తెరపడింది. పోలింగ్ ముగిసే సమాయానికి 48గంటల ముందు నుంచే ఎలాంటి ప్రచారం నిర్వహించకూడదు. దీంతో శనివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి అన్ని రకాల ప్రచారాలకు బ్రేక్ పడినట్టయింది. అయితే.. చివరి రోజు కూడా అభ్యర్థులు క్షణం తీరిక లేకుండా ప్రచారంలో ముగినితేలారు. కొందరు ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేయగా.. మరికొందరు ర్యాలీలు, సభలు నిర్వహించారు. కాగా, ప్రచారం ప్రారంభం నుంచి రోజురోజుకూ బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డికి మద్దతు అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. తమ ప్రచారంలో అన్ని వర్గాల నుంచి లభించిన ఆదరణతో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుపై ఆ పార్టీ శ్రేణులు పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు.
శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి. ప్రచారానికి గడువు ముగియడంతో ఇక అందరి దృష్టి పోలింగ్పై పడింది. రేపు ఉదయం ఎనిమిది గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. అంతకుముందే పోలింగ్ ఏజెంట్ల నియామకాలను అభ్యర్థులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ నెల ఆరంభం నుంచి అభ్యర్థులంతా వారివారి పరిమితుల్లో ప్రచారం సాగించారు. వీలైనంత మంది ఎక్కువ ఓటర్లను కలిసే ప్రయత్నాలు చేశారు. అయితే.. బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డికి పార్టీ యావత్తు అండగా నిలువడంతో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. పార్టీ అధినేత కేసీఆర్ తమ పార్టీ అభ్యర్థిగా రాకేశ్రెడ్డిని ప్రకటించడంతోనే సగం సక్సెస్ అయినట్లుగా మంచి ఆదరణ మొదలైంది. ఇతర అభ్యర్థులతో పోలిస్తే బీఆర్ఎస్ అభ్యర్థి అన్ని అంశాల్లోనూ మెరుగైన, ఉన్నత విలువలు కలిగిన వ్యక్తిగా ప్రాచుర్యం పొందారు. అదే రీతిలో ప్రచారంలోనూ దూసుకెళ్లారు.
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు సహకారంతో నియోజకవర్గమంతా చుట్టివచ్చే ప్రయత్నం చేశారు. ఇక ఉమ్మడి జిల్లా పరిధిలో మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి నేతృత్వంలో మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతల సహకారంతో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాకేశ్రెడ్డి ప్రచారం సాగింది. పార్టీ శ్రేణులు కూడా క్షేత్రస్థాయిలో ప్రతి ఓటర్ను కలిశారు. దీనికితోడు ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని అనేక ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలను కలువగా మంచి స్పందన లభించినట్లు పార్టీ శ్రేణులు తెలిపాయి. ప్రచారం చివర దశకు చేరుకుంటున్నా కొద్దీ ఇలాంటి మద్దతు భారీగా పెరిగింది.
ఇక గ్రామీణ ప్రాంతాల్లోని పట్టభద్రులు కాంగ్రెస్ పాలనలోని కరెంటు కోతలు, రైతుబంధు దగా, రుణమాఫీ హామీ మోసం, మెగా డీఎస్సీ అడ్రస్ లేకపోవడం వంటి వాటిపై పునరాలోచనలో పడ్డట్లు పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. వీటిన్నింటికీ తోడుగా కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ వ్యక్తిగత వ్యవహారశైలి, వివాదాస్పద వైఖరి వల్ల కాంగ్రెస్ పట్ల తీవ్ర విముఖతతో ఉన్నట్లు అర్థమవుతున్నది. మొత్తం ఈ ఎన్నికల్లో 52 మంది అభ్యర్థులు బరిలో నిలువగా.. బీజేపీతోపాటు ఇతర స్వతంత్ర అభ్యర్థులు ఎక్కువగా సోషల్ మీడియా ప్రచారానికే పరిమితమయ్యారు.