సూర్యాపేట , నవంబర్ 25 : నవంబర్ 26, 27, డిసెంబర్ 3, తేదీల్లో ప్రతి పోలింగ్ కేంద్రంలో బూత్ లెవెల్ అధికారులు అందుబాటులో ఉండాలని, విధులకు హాజరు కాకుంటే చర్యలు తప్పవని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ హెచ్చరించారు. శుక్రవారం సూర్యాపేట కలెక్టరేట్ నుంచి వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శని, ఆదివారాలలో స్థానిక పోలింగ్ కేంద్రాలలో మార్పులు, చేర్పులు ఉంటే సరిచేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. బీఎల్వోలు పోలింగ్ కేంద్రాలలో ఉదయం 10 నుంచి సాయత్రం 5 గంటల వరకు విధుల్లో ఉండాలని తెలిపారు.
జాబితా సవరణ సూపర్వైజర్లు వారికి కేటాయించిన పరిధిలో బీఎల్వోల హాజరును నమోదు చేయాలన్నారు. హాజరుకాని వారిని గుర్తించి నివేదిక తయారు చేసి ఈఆర్వోకు అందచేయాలని చెప్పారు. విధులకు హాజరుకాని బీఎల్వోలపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాల పరిధిలో రాజకీయ పార్టీల ప్రతినిదులు ఓట్లను పరిశీలించాలని సూచించారు. ట్రాన్స్జెండర్స్, సెక్స్ వర్కర్లను గుర్తించి వారిని సైతం ఓటరు జాబితాలో నమోదుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.
అంగవైకల్యం ఉన్న ఓటర్లను గుర్తించి సదరం డేటా ద్వారా వారిని ఓటరు జాబితాలో పీడబ్ల్యూడీ నమోదు చేయడానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. వీడియోకాన్ఫరెన్స్లో కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, అదనపు కలెక్టర్ మోహన్రావు, ఈఆర్వోలు కిశోర్కుమార్, రాజేంద్రకుమార్, వెంకారెడ్డి పాల్గొన్నారు. అనంతరం కోదాడ డివిజన్ నడిగూడెం మండలం సహాయ ఓటరు నమోదు అధికారి టి.నాగేశ్వర్రావును రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో సన్మానించారు. మండలంలో ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానాన్ని నాగేశ్వర్రావు 100 శాతం పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు.