రామగిరి, మే 23: నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ న్యాక్ గుర్తింపు గడువు ముగిసింది. దాంతో ఆ కమిటీకి యూనివర్సిటీ అధికారులు ఎస్ఎస్ఆర్(సెల్ఫ్ స్టడీ రిపోర్టు)ను ఇప్పటికే అందజేశారు. ఈ క్రమంలో వర్సిటీలోని అకాడమిక్ అంశాలు, బోధన, మౌలిక వసతులు పరిశీలనకు బుధవారం తనిఖీకి న్యాక్ బృందం రానుంది.నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో సాంకేతికతను అందిపుచ్చుకుంటూ నూతన అంశాల్లో అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్నది. నేటి నుంచి ఈ నెల 26 వరకు న్యాక్ బృందం రానుండగా ఆ దిశగా నూతన అభివృద్ధి చర్యలు, కోర్సులు అందుబాటులోకి తెచ్చిన అంశాలపై పూర్తి స్థాయి నివేదికలను వీసీ గోపాల్రెడ్డి పర్యవేక్షణ అన్ని విభాగాల్లో అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఆయా శాఖల్లో డిజిటల్, వర్చువల్ తరగతులకు వేర్వేరుగా గదులు, ల్యాబ్స్, హాస్టల్ ఇతర అంశాలను కమిటీ పర్యవేక్షణ చేయనుంది. ఇతర వర్సిటీలకు దీటుగా ఎంజీయూలో ఆన్లైన్ వాల్యూయేషన్, డిజిలాకర్తో విద్యార్థులకు సర్టిఫికెట్స్, పలు ఉన్నత సంస్థలతో విద్యార్థుల ఉన్నత విద్య, ఉద్యోగాల పరస్పర ఒప్పందాలు చేయడంతో ఎంతో మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించగా ఇదే న్యాక్ తనిఖీలో కీలకం కానుందని తెలుస్తుంది.
న్యాక్ ‘ఏ’-గ్రేడ్ లక్ష్యంగా..
ఎంజీయూకు ప్రస్తుతం న్యాక్ ‘బీ’ గ్రేడ్ ఉంది. ప్రస్తుతం అభివృద్ధ్దిలో రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు దీటుగా ముందుకు వెళ్తుండడంతో ‘ఏ’ గ్రేడ్ లక్ష్యంగా అధికారులు సర్వం సిద్ధం చేశారు. వర్సిటీ ఐక్యూఏసీ ఆధ్వర్యంలో న్యాక్ కమిటీకి సమర్పించిన ఎస్ఎస్ఆర్ (సెల్ఫ్ స్టడీ రిపోర్టు)లో తెలిపిన అంశాల వారీగా అని డిపార్టుమెంట్స్ను సర్వంగా సుందరంగా తీర్చిదిద్ది ఆధునీకరణ చేసి రిపోర్టులను తయారు చేశారు. పవర్పాయింట్ ప్రజెంటేషన్స్ సైతం అందుబాటులో ఉంచారు.
సెంట్రల్ లైబ్రరీలో 50 వేల జర్నల్స్..
వర్సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఎక్కడ లేని విధంగా జెగేట్తో ఆన్లైన్లో 50వేల జర్నల్స్ చూసుకునే అవ కాశం కల్పించారు. 20 కంప్యూటర్స్కు ఉచిత ఇంటర్నెట్తోఅందుబాటులో ఉంచారు. పోటీ పరీక్షల పుస్తకాలలు అందుబాటులోకి తేవడంతో విద్యార్థులతోనిత్యం లైబ్రరీ బిజీబీజీగా ఉంటుంది.
సోలర్, విండ్ పవర్..
ఇప్పటికే 60 కిలో వాట్స్తో సోలర్ పవర్ను ఉత్పత్తి చేస్తున్నారు. అదే స్థాయిలో ఎమ్మెస్సీ ఫిజిక్స్ కోర్సు విద్యార్థులకు విండ్ పవర్ను పరిచయం చేసేలా కిలో వాట్స్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన విండ్ పవర్ ప్లాంట్ను సైతం ఏర్పాటు చేస్తూ ఇతర వర్సిటీలకు రోల్మోడల్గా నిలిచేలా కృషి చేస్తున్నారు.
అన్ని సౌకర్యాలతో పరీక్షల విభాగం..
ఎంజీయూ పరీక్షల విభాగాన్ని మార్చి 14న నూతన ఆధునాతన భవనంలోకి మార్చారు. గతంలో న్యాక్ తనిఖీలో దీనికి తక్కువ మార్కులు రావడంతో ఈ పర్యాయం ఆధునిక వసతులుండడంతో మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది. వర్సిటీ పరిపాలనా భవనం వెనుకవైపు, ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో కొత్తగా నిర్మించిన 1500 మంది కూర్చుని సమావేశాలు జరిపేలా ఆంపి థియేటర్ అందుబాటులోకి తేచ్చారు. నూతన ఇంజినీరింగ్ కళాశాల భవనం ప్రారంభోత్సవ కానుండడంతో ప్రభుత్వం అందించే నిధులతో మహాత్మాగాంధీ యూనివర్సిటీ అభివృద్ధిలో పరుగెడుతూ రాష్ట్రంలో రోల్ మోడల్గా నిలుస్తున్నది. ఇవి న్యాక్ హోదా పెంచడంతో ఎంతగానో దోహదం చేస్తాయి.
విజయవంతంగా టీఎస్ ఎడ్ సెట్ నిర్వహణ
ఆరేండ్లుగా టీఎస్పీఈసెట్’ (తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ టెస్ట్) విజయవంతంగా నిర్వహించారు. ఈ విద్యా సంవత్సరం మే 18న రాష్ట్ర వ్యాప్తంగా ‘టీఎస్ఎడ్సెట్’ ఎంజీయూను ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి పర్యవేక్షణలో విజయవంతంగా నిర్వహించారు.
వచ్చే ఏడాది నుంచి కొత్త కోర్సులు..
2022-23 విద్యా సంవత్సరంలో ఎమ్మెస్సీ బోటని కోర్సు ప్రారంభించారు. అలాగే వర్సిటీలో ఉన్న 14 కోర్సుల్లో అదనంగా 140 సీట్లు పెంచడంతో గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు వర్సిటీలో చదివే అవకాశం దక్కింది. అలాగే వచ్చే విద్యా సంవత్సరం (2023-24)కి ఎంజీయూలో ఇంజినీరింగ్లో సీఎస్ఈ కోర్సును 60 మంది, ఎంఏ -సైకాలజీలో 50 విద్యార్థులతో ప్రారంభించనున్నారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆమోదం తెలపడంతో కోర్సులు విద్యార్థులకు అందుబాటులోకి వస్తున్నాయి.