యాదాద్రి భువనగిరి, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : శ్రావణ మాసంలో వచ్చే రాఖీ పౌర్ణమి కోసం అక్కాతమ్ముళ్లు, అన్నాచెల్లెళ్లు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. ఎంత దూరంలో ఉన్నా తోబుట్టువులందరూ రాఖీ పండుగ ద్వారా తమ కుటుంబ సభ్యులకు ప్రేమను తెలియజేస్తారు. ఈ నేపథ్యంలో దూరంలో ఉన్న తోబుట్టువులకు స్వయంగా వెళ్లి రాఖీలు కట్టలేనివారి కోసం ఆర్టీసీ ప్రత్యేక సేవలు అందిస్తున్నది. కార్గో, కొరియర్, పార్సిల్ సర్వీసుల ద్వారా రాఖీలు, స్వీట్లు పంపించే అవకాశం కల్పించింది. అతి తక్కువ ధరలతో ఈ సర్వీసులు అందిస్తున్న ఆర్టీసీ.. గ్రేటర్ హైదరాబాద్తోపాటు పలు జిల్లాలకు నేరుగా డోర్ డెలివరీ సౌలభ్యం కల్పిస్తున్నది.
ప్రత్యేక కౌంటర్లు.. డోర్ డెలివరీ
రాఖీ పౌర్ణమికి ప్రజలకు ప్రత్యేక సేవలు అందించేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. దూరంలో ఉన్న సోదరులకు రాఖీలు, మిఠాయిలు పంపించే ఆడబిడ్డలు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసింది. జిల్లాలో అయితే ఇతర ప్రాంతాల నుంచి ఆర్డర్ వస్తే కస్టమర్లు దగ్గరలోని కౌంటర్ల దగ్గరకు వెళ్లి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం భువనగిరి, మోత్కూరు, తిరుమగిరి, పోచంపల్లి, చౌటుప్పల్, యాదగిరిగుట్టలో కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఇక ఇక్కడి నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్, హన్మకొండ, వరంగల్, నిజామాబాద్ వంటి నగరాలకు ఆర్డర్ ఇస్తే నేరుగా డోర్ డెలివరీ చేయనున్నారు. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ర్టాలకు కూడా రాఖీలు ఆర్టీసీ కొరియర్, పార్సిల్ సర్వీసుల ద్వారా పంపించుకునే అవకాశం ఉంది.
సర్వీసు చార్జీలు తక్కువే..
ఆర్టీసీ పార్సిల్, కొరియర్ ద్వారా అందించే సేవలకు చార్జీలు తక్కువగానే ఉన్నాయి. 5కిలోల లోపు బరువుంటే 100 కిలోమీటర్ల వరకు 65 రూపాయల సర్వీసు చార్జీ తీసుకోనున్నారు. పార్సిల్ దూరం పెరిగే కొద్దీ చార్జీలో మార్పులుంటాయి. 10కిలోల బరువున్న పార్సిల్కు రూ.95 తీసుకుంటారు. తెలంగాణ పరిధిలో గరిష్ఠంగా ఒక్కో రాఖీ పార్సిల్కు రూ.150కి మించి ఉండదని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఉదయం ఆర్డర్ చేస్తే సాయంత్రంలోపు, దూరం ఎక్కువగా ఉంటే మరుసటి రోజు ఉదయం వరకు పార్సిల్ అందిస్తామంటున్నారు.
బుకింగ్స్ నడుస్తున్నాయి..
వివిధ కారణాలతో అనేక మంది నేరుగా తమ సోదరులకు రాఖీలు కట్టలేని పరిస్థితి ఉంటుంది. అటువంటి వారికి ఆర్టీసీ ప్రత్యేక సేవలు అదిస్తున్నది. ఎంత దూరంలో ఉన్నా తమ సోదరులకు రాఖీలు, మిఠాయిలను పంపించే అవకాశం కల్పించింది. పార్సిల్, కొరియర్ సర్వీసుల్లో రాఖీలు పంపించుకోవచ్చు. ఈ సేవలు అతి తక్కువ ధరలోనే అందిస్తున్నాం. యాదగిరిగుట్ట డిపో పరిధిలో ఇప్పటికే బుకింగ్స్ నడుస్తున్నాయి. అవసరం ఉన్నవాళ్లు సద్వినియోగం చేసుకోవాలి.
– శ్రీనివాస్ గౌడ్, డిపో మేనేజర్, యాదగిరిగుట్ట