నిత్యావసర ధరల పెంపు పుణ్యమాని అర్ధాకలితో అలమటిస్తున్న సామాన్య జనంపై మోదీ సర్కారు మళ్లీ మళ్లీ విరుచుకుపడుతున్నది. ప్రతి వస్తువునూ జీఎస్టీ తెస్తూ నోటికాడి ముద్దను లాగేస్తున్నది. పన్నుపోటుతో పేద, మధ్యతరగతి బతుకులను తలకిందులు చేస్తున్నది. తాజాగా పాలు, పాల అనుబంధ ఉత్పత్తులపై జీఎస్టీ వేయడంపై అన్ని వర్గాల ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఈ భారం జిల్లా ప్రజలపై నెలకు రూ.40లక్షలకుపైగా పడనున్నది. కేంద్రం తీరును నిరసిస్తూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు బుధవారంలో జిల్లాలో పలుచోట్ల ఆందోళనలు జరిగాయి. పాల ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీ విధించడంపై తుర్కపల్లిలో టీఆర్ఎస్ నాయకులతో కలిసి పాడి రైతులు రాస్తారోకో చేశారు. మోత్కూరు అంబేద్కర్ చౌరసాలో టీఆర్ఎస్ నాయకులు, రైతులు బైఠాయించి నిరసన తెలిపారు. గురువారం భువనగిరి జిల్లాకేంద్రంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించనున్నారు. మరోవైపు ఆలేరు నియోజకవర్గవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టి కేంద్ర తీరును ఎండగట్టాలని ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే గొంగి సునీతా మహేందర్రెడ్డి పిలుపునిచ్చారు.
యాదాద్రి భువనగిరి, జూలై 20 (నమస్తే తెలంగాణ) : కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ ట్యాక్స్ పేరుతో జీఎస్టీని తీసుకొచ్చింది. పెట్రో, లిక్కర్ మినహా అన్నింటినీ జీఎస్టీ పరిధిలోకి తెచ్చింది. అప్పటి నుంచి ఒక్కొక్క దానిపై కొత్తగా ట్యాక్స్ వేస్తూ ఇప్పటికే ఉన్న వాటిపై జీఎస్టీ శాతాన్ని పెంచుకుంటూ పోతున్నది. తాజాగా పాలు, పెరుగు, ఇతర ఉత్పత్తులపై ట్యాక్స్ల వాత పెట్టింది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నెలకు 60 కోట్ల దాకా స్టేట్ జీఎస్టీ కలెక్షన్ వస్తున్నది. ఇందులో యాదాద్రి భువనగిరిలో రూ.20కోట్ల దాకా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. తాజాగా విధించిన జీఎస్టీతో ఇది మరింత పెరుగనుంది. ఈ భారం మొత్తం సామాన్య ప్రజానీకంపైనే పడుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రతి రోజూ 5.5లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. వీటిలో సగం పాలు లూజ్గా అమ్మినా.. మిగతావి ప్యాకెట్ పాలు, పెరుగు, ఇతర బైప్రొడక్ట్స్ ప్యాక్డ్ రూపంలో విక్రయిస్తున్నారు. ఈ లెక్కన నెలకు ఒక్క పాల ఉత్పత్తులపైనే నెలకు రూ.20 లక్షల నుంచి రూ.25లక్షల దాకా అదనపు భారం పడనుంది. ఇదే కాకుండా తేనె, మాంసం, ఫిష్, హాస్పిటల్స్, హోటల్స్, ఎల్ఈడీ లైట్లు, తదితన వస్తువులపైనా కేంద్రం జీఎస్టీ విధించింది. వీటితో మరో రూ.20 లక్షల భారం పడనుంది.
కేంద్రం తీరుతో ఇప్పటికే ధరలన్నీ ఆకాశం వైపు..
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలతో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనాతో కకావికలమైన జనంపై కేంద్రం కనీసం కనికరించకుండా గుదిబండ మోపుతున్నది. వరుసబెట్టి పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచేసింది. అంతర్జాతీయంగా చమురు రేట్లు తగ్గుతున్నా దేశంలో మాత్రం రోజురోజుకు రేట్లు ఆకాశన్నంటుతున్నాయి. పెట్రో రేట్లు పెరుగడంతో ఆటోమెటిక్గా అన్ని రకాల ధరలు చుక్కలనంటాయి. ఏం కొనేటట్టు లేదు.. తినేటట్టు లేదు.. అన్న చందంగా మారింది. ఇక రూ.80 ఉన్న లీటరు పెట్రోల్ ఇప్పుడు రూ. 119కి చేరుకుంది. ఇక వంటింట్లో గ్యాస్ ధరలు భగ్గుమంటున్నాయి. నెలనెలా గ్యాస్ రేట్లు పెరుగడం పరిపాటిగా మారింది.
భగ్గుమంటున్న జనం.. రోడ్డెక్కి ఆందోళన
పెరిగిన జీఎస్టీ అమల్లోకి రావడంతో సామాన్య జనం మండిపడుతున్నారు. ఇప్పటికే అనేక వస్తువులపై జీఎస్టీ గుంజుతున్నారని, మళ్లీ ఏంటని ప్రశ్నిస్తున్నారు. తాగే పాలపై కూడా ట్యాక్స్ వసూలు చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఏ టీస్టాల్, హోటల్, బస్టాప్, రచ్చబండలో నలుగురు కలిసినా కేంద్రాన్ని తిట్టిపోయడమే కనిపిస్తున్నది. ఆఖరికి పాలపై కూడా జీఎస్టీ వేయడమంటే బీజేపీకి పోయే కాలం దగ్గర పడిందని దుయ్యబడుతున్నారు. ఇక సోషల్ మీడియాలో సైతం కేంద్రం తీరుపై ఫైర్ అవుతున్నారు. మీమ్స్ క్రియేట్ చేసి ఓ రేంజ్లో ఆటాడుకుంటున్నారు. ఇక టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు బుధవారం జిల్లాలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. జీఎస్టీ విధించడంపై రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. మరికొన్ని చోట్ల ర్యాలీలు నిర్వహించారు. తుర్కపల్లి, మోత్కూరులో ఆందోళన చేశారు.
నేడు భువనగిరిలో నిరసన
భువనగిరి అర్బన్ : పాలు, పాల ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం 5 శాతం జీఎస్టీ విధించినందుకు నిరసనగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని బాబూ జగ్జీవన్రామ్ చౌరస్తాలో ధర్నా నిర్వహించనున్నట్లు టీఆర్ఎస్ పట్టణ, మండలాధక్షులు ఏవీ కిరణ్కుమార్, జనగాం పాండు, ప్రధానకార్యదర్శులు రచ్చ శ్రీనివాస్రెడ్డి, నీలం ఓం ప్రకాశ్గౌడ్ బుధవారం ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు నిర్వహించే ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు.
పాలపై జీఎస్టీ పెంపు దారుణం
మోత్కూరు : కేంద్ర ప్రభుత్వం పాడి ఉత్పత్తులపై పెంచిన జీఎస్టీని తొలగించాలని డిమాండ్ చేస్తూ బుధవారం మోత్కూరులోని అంబేద్కర్ చౌరస్తాలో టీఆర్ఎస్ నాయకులు, రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పొన్నెబోయిన రమేశ్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా, రైతాంగ విధానాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నదన్నారు. నిత్యావసరాలతోపాటు, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను పెంచిన ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు వ్యవసాయ రంగం అనుబంధంగా ఉన్న పాలు, పాల ఉత్పత్తులపై జీఎస్టీని పెంచడం దారుణమని తెలిపారు. జీఎస్టీని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. మోత్కూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొణతం యాకూబ్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తీపిరెడ్డి మేఘారెడ్డి, టీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్ష, కార్యదర్శులు బొడ్డుపల్లి కల్యాణ్ చక్రవర్తి, గజ్జి మల్లేశం, సర్పంచుల ఫోరం మండల కన్వీనర్ రాంపాక నాగయ్య, గ్రంథాలయ కమిటీ చైర్మన్ కోమటి మత్స్యగిరి, నాయకులు మర్రి అనిల్, దామరోజు శ్రీకాంతాచారి, బోడ శ్రీను, గనగాని శ్రీశైలం, రైతులు బత్తిని రామలింగయ్య, నల్లబోగుల సతీశ్, వెంకటయ్య, రాములు, కిష్టయ్య పాల్గొన్నారు.
తుర్కపల్లిలో..
పాలు, పాల ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీని తొలగించాలని బుధవారం మండల కేంద్రంలోని చౌరస్తాలో టీఆర్ఎస్ మండల నాయకులు, పాడి రైతులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పిన్నపురెడ్డి నరేందర్రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని పెంచి సామాన్య, మధ్య తరగతి ప్రజలతోపాటు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నదన్నారు. పీఏసీఎస్ చైర్మన్ సింగిరెడ్డి నరసింహారెడ్డి, రైతు బంధు సమితి మండల కన్వీనర్ కొమిరిశెట్టి నర్సింహులు, ఎంపీటీసీ గిద్దె కర్ణాకర్, టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ శాగర్ల పరమేశ్, అధికార ప్రతినిధి తలారి శ్రీనివాస్, టీఆర్ఎస్వీ యువజన విభాగం మండలాధ్యక్షులు సీస భరత్, జాలిగాం కృష్ణ, సోషల్మీడియా నియోజకవర్గ కన్వీనర్ నల్ల శ్రీకాంత్, సర్పంచ్ మల్లప్ప, నాయకులు కల్లూరి నర్సింహారెడ్డి, గజం ఉప్పలయ్య, చాంద్పాషా, వెంకట్రెడ్డి పాల్గొన్నారు.
సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్న మోదీ ప్రభుత్వం
మోత్కూరు : కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని మరిచి జీఎస్టీ పేరుతో పన్నులు వేసి సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నదని సీపీఎం మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు అన్నారు. బుధవారం మోత్కూరు మండలంలోని దత్తప్పగూడెంలో పార్టీ గ్రామశాఖ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే గ్యాస్, పెట్రోల్ ధరలను పెంచిన బీజేపీ ప్రభుత్వం తినే తిండిని కూడా వదల కుండా పన్నుల భారం మోపుతున్నదన్నారు. గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయక పోగా అదానీ, అంబానీలకు ఆస్తులు కట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నదని విమర్శించారు. బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యవాదులు, ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు దడిపెల్లి ప్రభాకర్, మామిడి పద్మ, మామిడి కృష్ణ, ముత్తయ్య, మురళీధరన్ పాల్గొన్నారు.
జీఎస్టీ వాత ఇలా..
సోషల్ మీడియాలో ఓ వ్యంగ్యాస్త్రం
హాయ్.. మధ్యాహ్నం వంటల కార్యక్రమానికి స్వాగతం.. ఈ రోజు హైదరాబాదీ చికెన్ జీఎస్టీ ధమ్ బిర్యానీ ఎలా చేయాలో తెల్సుకుందాం..
ఈ జీఎస్టీ బిర్యానీ మీకు నచ్చినట్లయితే లైకులు, కామెంట్ల రూపంలో స్పందించండి. ఎలాంటి జీఎస్టీ వర్తించదు సుమా..!
పాలపై జీఎస్టీ విధింపు దుర్మార్గ చర్య
రైతును రాజును చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుంటే అందుకు భిన్నంగా కేంద్రం రైతు వెన్ను విరిచే చర్యలకు పూనుకోవడం సరికాదు. వ్యవసాయం, పాడి ఉత్పత్తులపై జీఎస్టీని విధించడం దుర్మార్గమైన చర్య. రైతులకు చేతనైతే సహాయపడాలి కానీ జీఎస్టీల పేరుతో రైతులను, పాడి ఉత్పత్తిదారులను మరింత ఇబ్బందులకు గురి చేయడం ఏంటి..? పంటతోపాటు, పాడిపై ఆధారపడే రైతులపై ఉక్కుపాదం మోపాలని చూస్తే ఊరుకునే ప్రసక్తి లేదు.
-కస్తూరి పాండు, పాలసంఘం చైర్మన్, బస్వాపురం
బతికున్నందుకు కూడా పన్నులు వేస్తరేమో..!
బీజేపీ పాలనలో సగటు పేదల జీవనం అగమ్యగోచరంగా మారింది. పాల ఉత్పతులు, ఇతర వస్తువులపై జీఎస్టీ విధింపుతో సామాన్య ప్రజలపై భారం పడుతుంది. ఉద్యోగ కల్పన, సంక్షేమం, అభివృద్ధి సరిగా లేకున్నా ప్రజల నుంచి మాత్రం ముక్కు పిండి ట్యాక్స్లు వసూలు చేస్తున్నారు. పేదోడు, ధనవంతుడు అనే తేడా లేకుండా ఇష్టం ఉన్నట్లు జీఎస్టీ వేస్తున్నరు. పాలపై కూడా జీఎస్టీ వేయడం బీజేపీ దరిద్ర పాలనకు నిదర్శనం. బతికితే కూడా లైఫ్ ట్యాక్స్ పేరుతో పన్నులు వేస్తరేమో.. వెంటనే కేంద్రం జీఎస్టీని విత్డ్రా చేసుకోవాలి.
– ఉగ్గి లత, రైతు, రామచంద్రాపురం, భువనగిరి
కడుపు నిండా తినకుండా చేస్తున్నరు
కేంద్ర ప్రభుత్వం పాలు, పాల ఉత్పత్తులపై జీఎస్టీ పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నది. మోదీ ప్రభుత్వ పాలనలోనే నిత్యావసర ధరలు భారీగా పెరిగిపోయాయి. పేద ప్రజల ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుస్తానన్న మోదీ చివరికి ప్రజలు కడుపు నిండా తినకుండా చేస్తున్నాడు. పాలపై జీఎస్టీ విధించడం దారుణం. పేద ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వాన్ని గద్దె దింపేవరకూ వెనుకాడం.
– మన్నె శ్రీధర్, మర్యాల, బొమ్మలరామారం
పేద ప్రజలపై మరింత భారం
ఇప్పటికే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుతో నిత్యావసర వస్తువులు ధరలు మండిపో తున్నాయి. తినే ఆహార పదార్థాలపైనే పన్నుల భారం మోపడం మోదీ ప్రభుత్వానికి ప్రజలపై ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతున్నది. కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాయడమే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం పనిచేస్తున్నది. పాల ఉత్పత్తులపై 5శాతం జీఎస్టీని తగ్గించకుంటే ప్రభుత్వం పతనమవడం ఖాయం.
– బోయిన నరేశ్, మన్నెవారిపంపు, భువనగిరి మండలం