రాచకొండ భూములు లాక్కుంటామన్న టీపీసీసీ రేవంత్రెడ్డిపై రైతులు, గిరిజనులు భగ్గుమంటున్నారు. అధికారంలోకి రాగానే ఇక్కడి భూములు ఏపీలోని అమరావతి మాదిరి లాక్కుంటామని అనడంపై దుమ్మెత్తిపోస్తున్నారు. రేవంత్రెడ్డి కుట్రపై తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ‘కార్పొరేట్ సంస్థలకు ఇయ్యనీకి మీ అయ్య జాగీరా..? మా తాతముత్తాల నుంచి వస్తున్న పొలాలను గుంజుకుంటవా..? నాడు ఉమ్మడి రాష్ట్రంలో బీడీఎల్ పేరుతో కుట్ర చేస్తే తిప్పికొట్టాం. ల్యాండ్ పూలింగ్కు వస్తే కిరోసిన్ పోసి దాడులు చేసినం.
ఇప్పుడు కూడా మా భూముల జోలికొస్తే తరిమి తరిమి తన్నుతం. రాచకొండ పేరెత్తితేనే ఉరికించి కొడుతం. రేవంత్ కుట్రలను భగ్నం చేస్తాం.’ అని హెచ్చరిస్తున్నారు. సెంట్ భూమి కూడా ఇచ్చేది లేదని కుండబద్ధలు కొడుతున్నారు. అధికారంలోకి రాక ముందే రేవంత్రెడ్డి రైతులకు వ్యతిరేకంగా కుట్రలకు తెరదీస్తున్నారని, ఇక ప్రభుత్వంలో ఉంటే ఇంకెంత కుయుక్తులు చేస్తారోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడగొడతామని శపథం చేస్తున్నారు.
తెలంగాణ వచ్చాక రాష్ట్రమంతా భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి. సాగు నీరు, రైతుబంధు తదితర ప్రభుత్వ కార్యక్రమాలతో ఎక్కడా లేని విధంగా భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ప్రస్తుతం రాచకొండ పరిధిలోని భూములు ఎకరం సగటు 80 లక్షల నుంచి కోటికి పైనే పలుకుతున్నాయి. ఇంతటి కాస్ట్లీ భూములను కాజేసేందుకు రేవంత్ రెడ్డి కుట్ర పన్నారు. ఈ భూములను అడ్డికిపావుశేరుకు కొనుగోలు చేసి.. విదేశీ కార్పొరేట్ కంపెనీలకు విక్రయించాలనే కుయుక్తులు పన్నుతున్నారు.
వాస్తవానికి ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలో రాచకొండ 32 వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. అయితే రేవంత్రెడ్డి మాత్రం సులభంగా 50 వేల ఎకరాలను సేకరిస్తామని స్పష్టం చేస్తున్నారు. దీంతో మిగతా 18వేల ఎకరాలు ఎక్కడి నుంచి తీసుకొస్తారనేది సందేహంగా మారింది. రాచకొండతోపాటు దాని చుట్టుపక్కల ప్రాంతాలైన నారాయణపురం, గట్టుప్పల, మర్రిగూడ, చౌటుప్పల్, మాల్, మంచాల, ఇబ్రహీంపట్నం తదితర మండలాల్లోని పలు గ్రామాల్లో సైతం సేకరించే అవకాశం లేకపోలేదని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
రాచకొండ పరిధిలోని ప్రజలు చైతన్యశీలురు అని చెప్పవచ్చు. తమ హక్కుల కోసం వారు నిరంతరం పోరాటం చేస్తున్నారు. గతంలో ఇదే రాచకొండలో భారత్ డైనమిక్ లిమిటెడ్(బీడీఎల్)కు భూములు కేటాయిస్తే పెద్దఎత్తున పోరాటం చేశారు. కనీసం అధికారులను అడుగు కూడా పెట్టనివ్వలేదు. వారు ఒంటిపై కిరోసిన్ పోసుకోవడంతోపాటు స్థలసేకరణకు వచ్చిన అధికారులపై కూడా కిరోసిన్ పోసి తీవ్రంగా వ్యతిరేకించారు. అదే విధంగా ఐటీఐ, కృషి విజ్ఞాన కేంద్రం, ఐటీ పార్కుల ప్రతిపాదనలు వచ్చినా ముందుకు సాగలేదు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ సీఎం చంద్రబాబునాయుడు అమరావతి పేరుతో రాజధాని నిర్మించారు. అయితే అక్కడ ఉన్న రైతుల భూములను అప్పనంగా గుంజుకున్నారు. అభివృద్ధి పేరుతో వేల ఎకరాలను లాక్కున్నారు. చంద్రబాబు శిష్యుడైన రేవంత్రెడ్డి సైతం ఇప్పుడిదే కుట్రకు తెరలేపుతున్నారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే రాచకొండ వద్ద 50 వేల ఎకరాలను సేకరిస్తామని ప్రకటించారు. ఓ జాతీయ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా క్లారిటీ ఇచ్చారు. సేకరించిన భూములను విదేశీ కార్పొరేట్ సంస్థలకు అప్పగించి.. వచ్చిన డబ్బులను కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ పథకాలకు వాడుకుంటామని నిర్మొహమాటంగా చెప్పారు.
ఎన్నో ఏండ్లుగా వ్యవసాయాన్ని నమ్ముకొని బతుకుతున్నం. సీఎం కేసీఆర్ ఇస్తున్న రైతుబంధు పుణ్యమా అని పెట్టుబడి బాధ తప్పింది. తెలంగాణ రాకముందు ఎకరం భూమి లక్ష లోపే ఉండేది. అలాంటిది ఇప్పుడు కోటి వరకు పెరిగింది. రాచకొండ ప్రాంతంలో 50 వేల ఎకరాల భూమిని సేకరించి వాటిని బడా కంపెనీలకు అమ్ముతానని రేవంత్రెడ్డి అనడం ఆశ్యర్యమేసింది. ఆ భూములను అమ్మి కాంగ్రెస్ పథకాలకు ఖర్చు పెట్టడమేంటి. మా భూముల జోలికొస్తే చూస్తూ ఊరుకోం. రేవంత్రెడ్డిని తరమి కొడుతం. ఇప్పుడు కాలం బాగా అయితుంది. నీళ్లు పుష్కలంగా ఉన్నయి. గతంలో కంటే ఇప్పుడు వ్యవసాయంలో లాభం వస్తుంది. కాంగ్రెసోళ్లకు చేతకాకపోతే గ్యారంటీ పథకాల గురించి మాట్లాడొద్దు. అంతేగానీ భూమలు జోలికి రావద్దు.
-నేనావత్ బంతిలాల్, అంతంపేట ఎంపీటీసీ, మర్రిగూడ
మా భూములు లాక్కుంటే ఊరుకునేది లేదు. మీ పార్టీ గొప్పలకు పోయి గ్యారంటీలు ఇచ్చుడేంది. తర్వాత మా భుములను అమ్మి హామీలు చేస్తాననడం ఏంది. తాతల తరాల నుంచి వాటినే నమ్ముకొని ఉన్నాం. మాకు జీవనాధారమే ఈ భూములు. ఈ భూముల్లో బర్రెలు, గొర్రెలను మేపుకోవడమే కాకుండా పంటలు కూడా పండించుకుంటున్నం. అలాంటి భూములను తీసుకుంటామంటే ఎంతటి వరకైనా సిద్ధమే.
-కరంటోతు భాస్కర్నాయక్, ఎనగండితండా, చౌటుప్పల్
రాచకొండ ప్రాంతంలో ఏండ్లుగా సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని గతంలో ఎన్నో ప్రభుత్వలను వేడుకున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ మా గిరిజన తండాల ప్రజలు పడుతున్న గోసలను అర్థం చేసుకుని పోడు భూములకు పట్టాలు ఇచ్చారు. రైతుబంధు, రైతుబీమా పథాకలను అందించి అండగా నిలబడ్డారు. మా భూములు గుంజుకుని కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పాలని చూస్తున్న రేవంత్రెడ్డి బెదిరింపులకు భయపడం. రాచకొండ ప్రాంతంలో అడుగు పెడితే తరిమి కోడుతాం. రైతులకు అండగా నిలబడాల్సిన నాయకులు అడ్డగోలుగా మాట్లాడితే చూస్తూ ఊరుకోం.
-పానుగోతు పాండునాయక్, సర్పంచ్, వెంకంబావితండా, సంస్థాన్నారాయణపురం