మునుగోడు, ఆగస్టు 16 : అభివృద్ధి నిరోధకులైన కోమటిరెడ్డి బ్రదర్స్ను ఈ ప్రాంతం నుంచి తరిమికొడుదామని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని జమస్తాన్పల్లి క్రాస్రోడ్డు వద్ద ఆర్కే ఫంక్షన్హాల్లో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బండ పురుషోత్తంరెడ్డి అధ్యక్షతన జరిగిన ఆత్మీయసభలో వారు మాట్లాడారు. మూడున్నరేండ్లలో మునుగోడు ఎమ్మెల్యేగా రాజగోపాల్రెడ్డి అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు. కేంద్ర సర్కారు ఇచ్చిన రూ. 22 వేల కోట్ల కాంట్రాక్టు కోసమే రాజగోపాల్రెడ్డి బీజేపీకి అమ్ముడు పోయారని, మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేపీకి తాకట్టుపెట్టారని విమర్శించారు. 20 ఏండ్ల పాటు నల్లగొండ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నమ్మి ఓట్లేసిన ప్రజలను మోసం చేశారని దుయ్య బట్టారు.
మునుగోడు ఉపఎన్నిక టీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమానికి-అవినీతిపరులకు మధ్య జరగనున్న యుద్ధంగా అభివర్ణించారు. గ్రామాల్లో రాష్ట్ర సంక్షేమ పథకాలపై ప్రతిఒక్కరికీ అవగాహన కల్పించి టీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. ఈ నెల 20న మునుగోడులో సీఎం కేసీఆర్ హాజరుకానున్న ప్రజాదీవెన సభ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం మండలంలోని పలు పార్టీలకు చెం దిన 400 మంది కార్యకర్తలు, నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీకి ఆహ్వానించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బండ పురుషోత్తంరెడ్డి, రాష్ట్ర నాయకుడు నారబోయిన రవి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జాజుల అంజయ్యగౌడ్, టీఆర్ఎస్ జిల్లా మాజీ కార్యదర్శి గుర్రం సత్యం, లాల్బహదూర్గౌడ్, దాడి శ్రీనివాస్రెడ్డి, భవనం శ్రీనివాస్రెడ్డి, వేమిరెడ్డి జితేందర్రెడ్డి, వైస్ ఎంపీపీ అనంత వీణ, బొల్గూరి నర్సింహ, ఎంపీటీసీలు, సర్పంచులు, గ్రామశాఖల అధ్యక్షులు పాల్గొన్నారు.