స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం హరిత వేడుక నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు కోటి మొక్కలు నాటాలని నిర్ణయించగా, అందులో నల్లగొండ జిల్లాకు 8లక్షల మొక్కలను లక్ష్యంగా పెట్టింది. ఆ మేరకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. నేటి ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామాలు, మున్సిపాలిటీల్లో ప్రజాప్రతినిధులతో భాగస్వామ్యంతో మొక్కలు నాటేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. కలెక్టర్ ఆర్వీ కర్ణన్ శుక్రవారం కలెక్టరేట్లో ఆయా శాఖల సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ యంత్రాంగం క్షేత్రస్థ్దాయిలో ఇప్పటికే ఆయా గ్రామాల్లో మొక్కలు నాటేందుకు గుంతలు తీసి సిద్ధంగా ఉంచింది.
నల్లగొండ, ఆగస్టు 25 : స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల ముగింపు సందర్భంగా జిల్లాలో శనివారం 8 లక్షల మొక్కలను నాటనున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ యంత్రాంగం క్షేత్ర స్థాయిలో ఇప్పటికే ఆయా గ్రామాల్లో మొక్కలు నాటడానికి గుంతలు తీసి సిద్ధంగా ఉంచింది. జిల్లాలో 844 గ్రామ పంచాయతీలు ఉండగా ఆయా గ్రామ పంచాయతీలకు ఒక లక్ష్యాన్ని నిర్ధేశించింది. మొత్తంగా గ్రామ పంచాయతీలను దృష్టిలో పెట్టుకుని ఆయా గ్రామాల్లో భూ భాగంతో పాటు ఇరిగేషన్, ఫారెస్ట్ భూ భాగాల నిడివిని బట్టి ఈ లక్ష్యాలను పెట్టారు. నేడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకే రోజులో ఆయా గ్రామాల్లో లక్ష్యాలకు అనుగుణంగా మొక్కలు నాటాల్సి ఉన్నది.
రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటుతూ జిల్లాలో 8 లక్షల టార్గెట్ పెట్టుకున్న జిల్లా యంత్రాంగం ఈ టాస్క్లో తప్పనిసరిగా ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దాంతో గ్రామీణ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రజా ప్రతినిధులను ఆహ్వానించి మొక్కలు నాటాలని కలెక్టర్ సూచించారు. అలాగే జిల్లా స్దాయిలో డీఎఫ్ఓ నోడల్ అధికారిగా వ్యవహరిస్తూ డీఆర్డీఏ పీడీతో పాటు డీపీఓ, జడ్పీ సీఈఓ, మెప్మా పీడీలు సభ్యులుగా ఉండి లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉంటుంది. ఇక మండల స్థాయిలో ఉండే నోడల్ అధికారి జిల్లా బృందానికి సమన్వయంగా పని చేస్తూ నేటి లక్ష్యాన్ని సాధించాల్సి ఉన్నది.