సమైక్య పాలనలో కరువుకు కేరాఫ్గా ఉన్న తుంగతుర్తి నియోజకవర్గం స్వరాష్ట్రంలో సస్యశ్యామలం అవుతున్నది. కాళేశ్వరం జలాల రాకతో ఈ ప్రాంతం రూపురేఖలు మారిపోగా.. తిరుమలగిరి మండలంలో ఎగువన ఉన్న గ్రామాలకూ పూర్తిస్థాయిలో నీళ్లందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఉమ్మడి రాష్ట్రంలో ఏండ్లకేండ్లకు ఎదురుచూసినా అడుగు ముందుకు పడని దేవాదుల ప్రాజెక్టు మూడో దశ పనులను ముమ్మరంగా చేపడుతుండడంతో త్వరలోనే రైతుల కల సాకారం కానున్నది.
దేవాదులకు అనుసంధానంగా జనగామ జిల్లాలో నిర్మిస్తున్న చెన్నూరు రిజర్వాయర్ నుంచి తిరుమలగిరి మండలంలోకి నీటిని తరలించనున్నారు. అందుకోసం చెన్నూరు రిజర్వాయర్ నుంచి తిరుమలగిరి మండలం వరకు 12 కిలోమీటర్లు మేర ప్రధాన కాల్వ, మూడు డీబీఎంలు నిర్మిస్తున్నది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పనులు పూర్తవుతాయన్నది అంచనా కాగా, 7 గ్రామాల పరిధిలో 14 వేల ఎకరాలకు సాగునీరు అందనున్నది.