యాదగిరిగుట్ట, మార్చి15: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగింది. వరుస సెలవులు రావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో తిరుమాడ వీధులు, క్యూ కాంప్లెక్స్ సందడిగా మారాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో క్యూలైన్లు, ప్రసాద విక్రయశాల, లక్ష్మీపుష్కరిణి, కల్యాణకట్ట భక్తులతో కిటకిటలాడాయి. స్వామివారి ధర్మ దర్శనానికి 3 గంటలు, వీవీఐపీ దర్శనానికి 2 గంటల సమయం పట్టింది.
సుమారు 45 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. అన్ని విభాగాలను కలుపుకుని స్వామివారి ఖజానాకు రూ. 52,06,106 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భవానీ శంకర్, అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి తెలిపారు. స్వామివారి ప్రధానాలయంలో ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని లక్ష పుష్పార్చన శాస్ర్తోక్తంగా జరిగింది.
స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో అర్చక బృందం, వేద పండితులు వివిధ రకాల పూలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. స్వయంభూ ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవ మూర్తులను పట్టువస్ర్తాలతో దివ్యమనోహరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై ఆసీనులుగావించారు. అర్చక బృందం, వేద పండితులు స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో వివిధ రకాల పూలతో లక్షపుష్పార్చన నిర్వహించారు.
తెల్లవారు జామునే ఆలయ ద్వారాలు తెరిచిన అర్చకులు సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం తిరువారాధన జరిపి, ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వయంభూ ప్రధానాలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు స్వామి, అమ్మవార్లకు నిత్యోత్సవాలు శాస్ర్తోక్తంగా సాగాయి. లక్షపుష్పార్చన వేడుకల్లో దేదాదాయ ధర్మదాయ శాఖ డైరక్టర్ హనుమంతరావు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.