యాదగిరిగుట్ట, ఫిబ్రవరి3 : పాతగుట్ట బ్రహ్మోత్సవాల్లో శుక్రవారం రాత్రి భాగంగా లక్ష్మీనరసింహ స్వామి కల్యాణ మహోత్సవం కనుల పండువగా జరిగింది. తుల లగ్న పుష్కరాంశ సుముహూర్తమున నారసింహుడు అమ్మవారి మెడలో మాంగల్యధారణ చేసే అపూర్వ ఘట్టాన్ని అర్చకులు, వేదపండితులు వైభవంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్లను ఉదయం హనుమంత వాహన సేవ, రాత్రి గజవాహన సేవపై ఆలయ తిరువీధుల్లో ఊరేగించారు. కల్యాణ వేడుకను చూడటానికి భక్తులు వందలాదిగా తరలివచ్చారు.
భక్తజనం పులకింత
లక్ష్మీనరసింహ స్వామి కల్యాణతంతును వీక్షించడానికి భక్తులు పాతగుట్టకు భారీగా తరలివచ్చారు. పెండ్లికొడుకు, పెండ్లి కూతురుగా స్వామి, అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో నిత్యారాధనల అనంతరం పారాయణికులతో నిత్య ప్రబంధ పారాయణాలు, మూలమంత్ర, మూర్తిమంత్ర జపాలు, లక్ష్మీ అష్టోత్తర నామ జపాలు నిర్వహించారు. ధన, కనక, వజ్ర, వైఢూర్యాలు, పట్టువస్ర్తాలతో అమ్మవారిని, స్వామివారిని అలంకరించారు. జై నారసింహ.. జై జై లక్ష్మీనరసింహ అంటూ భక్తుల కోలాటాల మధ్య గజవాహన సేవ ఆసక్తిగా నడిచింది. వేదపండితుల వేదమంత్రోచ్ఛారణలతో మేళాలు, కోలాట నృత్యాల నడుమ గజవాహనంపై స్వామి, అమ్మవార్లను కల్యాణ వేదిక వద్దకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఉదయం స్వామి, అమ్మవార్లకు వేద మంత్రోచ్ఛారణ నడుమ తిరుమంజన మహోత్సవం వేడుక వైభవంగా సాగింది.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
బ్రహ్మోత్సవాల సందర్భంగా యాదగిరిగుట్ట కు చెందిన శ్రీ భాగ్యలక్ష్మి భజన మండలి ఆధ్వర్యంలో సాంస్కృతి కార్యక్రమాలు, గుండ్లపల్లికి చెందిన వీరప్రతాప భజన మండలి ఆధ్వర్యంలో భజన కార్యక్రమం, జీవీఆర్ మ్యూజికల్ ఇన్స్టిట్యూట్ వారితో భక్తి సంగీతం, పట్టణానికి చెందిన మిర్యాల నిఖిల బృందం నృత్య ప్రదర్శన భక్తులను ఆకట్టుకున్నాయి.
శ్రీవారి అనుగ్రహం..
శ్రీవారి తిరు కల్యాణమహోత్సవం తిలకించిన భక్తులకు శ్రీవారి అనుగ్రహం లభిస్తుందని స్కంధపురాణంలో స్పష్టం చేసిన విషయాన్ని కల్యాణోత్సవ వ్యాఖ్యాత శ్రీ దరూరి రామానుజాచార్యులు వివరించారు. సమస్త ప్రాణకోటికి, ప్రకృతి మండలానికి లక్ష్మీనరసింహుడి అనుగ్రహం, సకల ఆయురారోగ్యాలు కలుగుతాయని వేదాలు, ఇతిహాసాలలో కూడా పేర్కొనబడి ఉందని ఆయన తెలిపారు.
పారాయణాలు, నిత్య హవనాలు..
నిత్యపూజల అనంతరం సాయంత్రం 6 గంటలకు పారాయణాలు, నిత్య హవనాలను పాంచరాత్రాగమ శాస్త్రరీత్యా నిర్వహించారు. శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవం అలంకారసేవ గజవాహనంపై ఆస్థాన మండపానికి వేంచేయగా ప్రధానార్చకబృందం పర్యవేక్షణలో వేద పండితులు, పారాయణికుల బృందం, అర్చక బృందం, వేదపండితులు సుముహూర్తంలో శ్రీస్వామి వారి అమ్మవారి కల్యాణమహోత్సవ వేడుకలు నిర్వహించారు. కల్యాణ విశేషాలను ప్రధానార్చకులు, వేదపండితులు వివరించారు. ఈ వేడుకల్లో ఆలయ ఇన్చార్జి ఈఓ రామకృష్ణారావు, ప్రధానార్చకులు మోహనాచార్యులు, ఉప ప్రధానార్చకులు మాధవాచార్యులు, డీఈఓ దోర్బాల భాస్కర్ శర్మ, ఏఈఓ గజవెల్లి రమేశ్బాబు, అధికారి రామారావునాయక్, ముఖ్య అర్చకులు భాస్కరాచార్యులు, అర్చకులు నరేశాచార్యులు, సంపతాచార్యులు, సత్యనారాయణాచార్యులు, పరిచారకులు వినయ్కుమారాచార్యులు, ఫణికుమారాచార్యులు, వేద పండితులు ఫణికుమారశర్మ, పవన్కుమారాచార్యులు, వినయ్కుమారాచార్యులు, పారాయణికులు పాల్గొన్నారు.