ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు నాణ్యమైన బోధనను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. తాజాగా హైస్కూల్ స్థాయిలో అభ్యసన సామర్థ్యాలు పెంచేందుకు విద్యాశాఖ ఆధ్వర్యంలో కార్యాచరణ సిద్ధం చేస్తున్నది. ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల్లో చదవడం, రాయడం, గణితం, చతుర్వేద ప్రక్రియల్లో సామర్థ్యాల పెంపునకు దోహదపడిన తొలిమెట్టు కార్యక్రమం స్ఫూర్తితో ఉన్నత, ప్రాథమికోన్నత స్థాయిల్లో విద్యాప్రమాణాల పెంపు కోసం లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం(లిప్)కు శ్రీకారం చుట్టనున్నది. 2023-24 విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో అమలు చేసేందుకు విద్యాశాఖ – సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో అమలు చేయనున్నది. విద్యార్థులు మాతృభాషతోపాటు ద్వితీయ, తృతీయ భాషలను స్పష్టంగా మాట్లాడడం, తప్పులు లేకుండా రాయడం, అర్థం చేసుకోవడం, ఆలోచించడం, వ్యక్తపర్చడం, స్వీయ సామర్థ్యాల పెంపు, గణితం, సామాన్య, సాంఘిక శాస్ర్తాల్లో ప్రతిభ చాటేలా కార్యాచరణ రూపొందించింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 821 ప్రభుత్వ ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలలు ఉండగా, అన్ని స్కూళ్లలో 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు రెగ్యులర్ తరగతులకు ఆటంకం కలుగకుండా
లిప్ కార్యాచరణ అమలు చేయనున్నారు.– రామగిరి, మే 8
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలు, విద్యా ప్రమాణాల పెంపే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే చదవడం, రాయడం, గణిత సంఖ్యలు, చతుర్వేద ప్రక్రియలతోపాటు వివిధ అంశాల్లో కనీస సామర్థ్యాలు సాధించేలా 2022-23 విద్యా సంవత్సంలో తొలిమెట్టు కార్యక్రమం అమలు చేసింది. దీంతో కరోనాతో నెలకొన్న అభ్యసన సంక్షోభం నుంచి 1నుంచి 5వ తరగతి పిల్లలు గట్టెక్కడంతోపాటు విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. దీని స్ఫూర్తితో 6 నుంచి 9వ తరగతి విద్యార్థుల్లో సైతం సామర్థ్యాలతోపాటు విద్యా ప్రమాణాల పెంపే లక్ష్యంగా ‘లర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం (లిప్) అమలుకు సర్కార్, విద్యాశాఖ సన్నద్ధమైంది. ఇప్పటికే అమలుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని విషయ నిపుణులతో హైదరాబాద్లో వర్క్షాప్ నిర్వహించి అమలుకు కార్యాచరణ చేపట్టారు. వచ్చే విద్యా సంవత్సరం అమలు చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని విద్యా నిపుణులు పేర్కొంటున్నారు.
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులకు ఉత్తమమైన, గుణాత్మక విద్యను అందించి వారి భవిష్యత్కు బాటలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ మేరకు ప్రభుత్వం, విద్యాశాఖ నేషనల్ అచివ్మెంట్ సర్వే-2017లో వెల్లడైన అంశాలతోపాటు భాష, గణితం వంటి అంశాల్లో విద్యార్థుల్లో ప్రమాణాల పెంపునకు త్రీఆర్స్ (చదువడం, రాయడం, ఆర్థమెటిక్), ఏబీసీ (అటైన్మెంట్ ఆఫ్ బేసిక్ కాంపిటెన్సీ) వంటి అంశాలను అమలు చేయడంతో మంచి ఫలితాలు వచ్చాయి. అయితే.. కరోనా నేపథ్యంలో రెండేండ్లు 1నుంచి 5వ తరగతి పిల్లల్లో కనీస సామర్థ్యాలు తగ్గినట్లు గుర్తించారు. దాంతో పిల్లల్లో కనీస సామర్థ్యాలు పెంచేలా గత విద్యా సంవత్సరం రాష్ట్ర విద్యాశాఖ తొలిమెట్టు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఉత్తమ ఫలితాలు రావడంతో అదే స్ఫూర్తితో ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో చదివే 6 నుంచి 9వ తరగతి విద్యార్థుల్లో సామర్థ్యాలు పెంచేందుకు లర్నింగ్ ఇంప్రూమెంట్ ప్రోగ్రాం (లిప్)కు శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం సైతం ఆయా పాఠశాలల్లో మూడేండ్లు కొనసాగించి ప్రతి ఏడాది ప్రత్యేక కార్యాచరణతో సామర్థ్యాలు పెంచేలా చర్యలు తీసుకోనున్నారు. లిప్ అమలు విషయలో తొలుత ఉపాధ్యాయులకు అవగాహన పరిచి శిక్షణ అందించాలని సూత్రప్రాయంగా విద్యాశాఖ నిర్ణయించింది.
వచ్చే విద్యా సంవత్సరం అన్ని ప్రభుత్వ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో చదివే 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు లర్నింగ్ ఇంప్రూమెంట్ ప్రోగ్రాం (లిప్) అమలు చేయాలని సర్కార్ నిర్ణయించడంతో విద్యాశాఖ – సమగ్రశిక్ష ఆధ్వర్యంలో ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పిల్లలు చదువడం, అర్థం చేసుకోవడం, ఆలోచించడం, వ్యక్తపర్చడం, స్వీయ సామర్థ్యాల పెంపు, గణితంలో రాణించి జీవితంలో వినియోగించుకునేలా అభ్యసన సామర్థ్యాలను సాధించేలా కార్యాచరణ రూపొందించేలా నిర్ణయాలు చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని జిల్లాల విద్యాశాఖ – సమగ్రశిక్ష సెక్టోరియల్ అధికారులతోపాటు విషయ నిపుణులతో హైదరాబాద్లో వర్క్షాపు నిర్వహించారు. ఇందులో లిప్ కార్యక్రమం అమలుకు విధి విధానాలపై చర్చించి ప్రణాళికలు రూపొందించారు. దీనిలో భాగంగా జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభమైన తర్వాత తొలుత విద్యార్థులకు ఉపాధ్యాయులు అవగాహన కల్పించి ప్రత్యేక ప్రణాళికతో రెగ్యులర్ తరగతులకు ఆటంకం కలుగకుండా లిప్ విధానంలో పాఠ్యాంశాలు బోధిస్తారు. దీన్ని కూడా తొలిమెట్టు మాదిరిగా విద్యా సంవత్సరం చివరి వరకు జరిగేలా చర్యలు తీసుకోనున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 821 ప్రభుత్వ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో అమలు చేయనున్నారు. పాఠశాలలు పునఃప్రారంభం కాగానే ఆయా పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు రిసోర్స్పర్సన్స్తో శిక్షణ ఇవ్వనున్నారు.
పిల్లలతో చదివించడం, పాఠ్యాంశాన్ని ధారాళంగా చదివేలా ప్రోత్సహించడం, మాతృభాషతోపాటు ద్వితీయ, తృతీయ భాషలను స్పష్టంగా, చురుగ్గా తప్పులు లేకుండా రాయగలిగేలా శిక్షణ ఇవ్వనున్నట్లు సమాచారం. అదేవిధంగా భాషా నైపుణ్యాలు పెంచడం, వ్యాకరణాన్ని గుర్తించడం, అక్షరాలు, పదాలు, వాక్యాలను స్పష్టంగా ఉచ్ఛరించేలా చూస్తారు. వీటితోపాటు ఇతర సబ్జెక్టులు సైన్స్ (రసాయన, భౌతిక, జీవశాస్ర్తాలు), సోషల్లో సైతం ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు విషయ నిపుణులు వెల్లడిస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లోని 1నుంచి 5వ తరగతుల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి వారిలో కనీస సామర్థ్యాలను పెంచేలా గత సంవత్సరం నిర్వహించిన తొలిమెట్టు విజయవంతమైంది. దీని స్ఫూర్తితో ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 6నుంచి 9వ తరగతి చదివే విద్యార్థులకు వచ్చే ఏడాది (2023-24) లర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం (లిప్) అమలు దిశగా ప్రభుత్వం, విద్యాశాఖ చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో వర్క్షాప్ సైతం నిర్వహించారు. ప్రభుత్వ నిర్ణయం, విద్యాశాఖ ఆదేశాలు, డీఈఓ సూచనలు, ఉత్తర్వులతో వచ్చే విద్యా సంవత్సరం కార్యాచరణ రూపొందిస్తాం. తొలిమెట్టు లాగానే నిపుణులైన ఉపాధ్యాయులకు శిక్షణ అందిస్తాం. విద్యాభివృద్ధే లక్ష్యంగా అందరి సహకారంతో ముందుకు వెళ్తాం.
– ఆర్.రామచంద్రయ్య, సెక్టోరియల్ అధికారి, జిల్లా విద్యాశాఖ – సమగ్రశిక్ష, నల్లగొండ