దళితుల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎస్సీలను అన్ని విధాలుగా ఆదుకుంటున్నది. దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టి ఒక్కో కుటుంబానికి రూ.10లక్షల సాయం అందించి ఆర్థిక పురోభివృద్ధికి బాటలు వేసింది. ఇప్పటికే తొలి విడుతగా జిల్లాలో 412 మందికి దళిత బంధు యూనిట్లు అందాయి. ఆయా కుటుంబాలు వ్యాపారాలు చేసుకుంటూ సంతోషంగా ఉన్నాయి. ఇక రెండో విడుత మరింత మందికి అందించేందుకు సర్కారు సన్నాహాలు చేస్తున్నది. జిల్లా వ్యాప్తంగా సుమారు మూడు వేల మందికి ఇచ్చేలా నిర్ణయం తీసుకోగా త్వరలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను అధికారులు చేపట్టనున్నారు. ఇందుకు దాదాపు ప్రభుత్వం రూ. 300 కోట్లు ఖర్చు చేయనున్నది. ఎస్సీల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళిత బంధు పథకం దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. జిల్లాలో ఈ పథకం మొదటి విడుత కార్యక్రమం వంద శాతం పూర్త్తికాగా.. రెండో విడుత పంపిణీకి సిద్ధం చేస్తున్నారు. ఒక్కో నియోజకవర్గంలో 1100 మందికి ఇవ్వాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయించగా.. జిల్లా వ్యాప్తంగా సుమారు 3వేల మందికి అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి గ్రామాన్ని సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్నారు. దళిత బంధు పథకాన్ని ఇక్కడి నుంచే పైలట్ ప్రాజెక్ట్ కింద అమలు చేశారు. ఇందులో భాగంగా గ్రామం మొత్తం సర్వే చేయించి దళితులందరికీ దళిత బంధు ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు అధికారులు 75 మందిని గుర్తించారు. దాంతో రాష్ట్రంలోనే మొట్టమొదటగా ఇక్కడే పథకాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత హుజూరాబాద్లో మొదలుపెట్టారు. వాసాలమర్రిలోని 75 మంది లబ్ధిదారులు ప్రభుత్వం అందజేసిన దళిత బంధు నిధులతో వివిధ రకాల వ్యాపారాలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 412 మందికి దళిత బంధు డబ్బులు అందాయి. ఇందులో భువనగిరి నియోజకవర్గంలో వంద మందికి, ఆలేరులో 175 మందికి, జిల్లా పరిధిలోని మునుగోడు నియోజకవర్గంలో 61 మందికి, నకిరేకల్లో 39 మందికి, తుంగతుర్తి నియోజకవర్గంలో 38మందికి దళిత బంధు డబ్బులు గ్రౌండింగ్ అయ్యాయి. ప్రభుత్వం ఇచ్చిన సాయంతో లబ్ధిదారులు నిలదొక్కుకోవడమే లక్ష్యంగా అధికారులు కొత్తకొత్త బిజినెస్లు పెట్టిస్తున్నారు. కిరాణా, మెడికల్ సామాన్ల డీలర్షిప్, ప్లాస్టిక్ ప్లేట్లు, క్లాస్ షోరూమ్, టీకప్పుల తయారీ, డయాగ్నోస్టిక్స్, సెంట్రింగ్ తదితర కొత్త బిజినెస్లు ఏర్పాటు చేసుకొని లబ్ధిదారులు విజయవంతంగా నడుపుతున్నారు.
దళితబంధు లబ్ధిదారుల వివరాలు, వారు నిర్వహిస్తున్న యూనిట్లను పొందుపరిచేందుకు ప్రభుత్వం ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తెచ్చింది. వివరాలు నమోదు చేయడానికి ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించారు. వారు యూనిట్ ద్వారా లబ్ధిదారులు నెలనెలా పొందుతున్న ఆదాయ వివరాలను కూడా పొందుపరుస్తున్నారు. లబ్ధిదారులకు ప్రభుత్వం దళిత బంధు పథకం ద్వారా ఇచ్చిన యూనిట్ ఏమిటి? అది ఎక్కడ పనిచేస్తుంది? నెలనెలా వస్తున్న ఆదాయం ఎంత? అనే సమ్రగ సమాచారం యాప్లో నిక్షిప్తం చేస్తున్నారు.