HomeNalgondaThe State Government Has Brought In Handloom Mitra Scheme For Weavers
చేనేతకు చేయూత
ఉమ్మడి రాష్ట్రంలో చేనేత కార్మికుల ఇంట వినిపించిన ఆకలి కేకలు ఆనాటి దుర్భర పరిస్థితులను తేటతెల్లం చేస్తాయి. చేతిలో కళ ఉన్నా, చేసేందుకు పని దొరుకని పరిస్థితి.
స్వరాష్ట్రంలో మారిన నేతన్నల బతుకులు
చేనేత కార్మికులకు అండగా బీఆర్ఎస్ సర్కారు
ఉమ్మడి రాష్ట్రంలో దుర్భర పరిస్థితులు
నేడు నేత కుటుంబాల్లో వెలుగులు
సామాజిక భద్రత కోసం నేతన్నకు చేయూత
రసాయనాలు, నూలుపై 40శాతం రాయితీ
రైతు బీమా మాదిరి నేతన్న బీమా పథకం
రుణమాఫీ పథకం అమలు.. పింఛన్ సౌకర్యం
జిల్లాలో ఏడు బ్లాక్లెవల్ క్లస్టర్ల ఏర్పాటు
స్వరాష్ట్రంలో నిలిచిన వలసలు.. ఆగిన ఆత్మహత్యలు
ఉమ్మడి రాష్ట్రంలో చేనేత కార్మికుల ఇంట వినిపించిన ఆకలి కేకలు ఆనాటి దుర్భర పరిస్థితులను తేటతెల్లం చేస్తాయి. చేతిలో కళ ఉన్నా, చేసేందుకు పని దొరుకని పరిస్థితి. సమైక్య పాలకులు పట్టించుకోక, నాటి ప్రభుత్వాల నుంచి కనీస సాయం అందక నేతన్న బతుకుకు ఆధారమన్నదే లేకుండా పోయిన దుస్థితి. కుటుంబాలను పోషించుకోలేని దయనీయ స్థితిలో నేసిన నూలే ఉరిపోగై నేతన్న కుత్తికకు వేలాడేది. అలాంటి చీకటి రోజులను దాటుకుని తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనలో నేతన్నల బతుకులు మారాయి. వలసలు వాపస్ అయ్యాయి. సర్కారు తోడ్పాటుతో చేనేత కార్మికులు సొంతూళ్లోనే ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. చేనేత మిత్ర స్కీమ్ కింద నూలుపై సబ్సిడీ, ప్రత్యేక పొదుపు పథకంతో నేతన్నకు చేయూత, చేనేత బీమాతో వంటి అనేక కార్యక్రమాలు అమలవుతున్నాయి. చేనేత రుణమాఫీ, నేత కార్మికులకు పింఛన్, బ్లాక్ లెవల్ క్లస్టర్లు ఏర్పాటు తదితర కార్యక్రమాలతో నేత కార్మికుల స్థితిగతులు మారాయి.
– యాదాద్రి భువనగిరి, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ)
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేతన్నలకు సహకార రంగం, సహకారేతర రంగంలో ఉన్న వారికి అన్ని రంగాల్లో అన్ని పథకాల్లో లబ్ధి చేకూరుస్తున్నది. యాదాద్రి భువనగిరి జిల్లాలో డిజిటల్ సర్వే ప్రకారం పని చేస్తున్న చేనేత మగ్గాలు 6651, మర మగ్గాలు 2165, నేత వృత్తిపై జీవనోపాధి పొందుతున్న కళకారుల మగ్గాలకు జియోట్యాగ్ చేశారు. గతంలో చేనేత పథకాలు సహకార రంగంలో ఉన్న వారికి మాత్రమే అందుబాటులో ఉండేవి. జిల్లాలో పోచంపల్లి ఇక్కత్, టై అండ్ డై సిల్క్, కాటన్ వస్ర్తాలకు 205లో జీఓ నంబర్ 4 ద్వారా గుర్తించింది. అదే విధంగా పేరెన్నిక కలిగిన పుట్టపాక తేలియా రుమాలు, చీరెలు, చున్నీలను జీఓ నంబర్ 599 ద్వారా గుర్తించింది. జిల్లాలో సహకార రంగంలో 44 చేనేత సహకార సంఘాలు ఉండగా, వాటిలో ప్రస్తుతం 10 చేనేత సహకార సంఘాలు పూర్తిగా పనిచేస్తున్నాయి. ఆరు సంఘాలు పాక్షికంగా పనిచేస్తూ.. నేతన్నలకు పని కల్పిస్తున్నాయి.
చేనేత మిత్ర పథకం..
నేతన్నల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేనేత మిత్ర పథకాన్ని తీసుకొచ్చింది. దీని కింద ప్రభుత్వం నేత కార్మికులకు రసాయనాలు, నూలుపై 40 శాతం రాయితీ కల్పిస్తున్నది. అందులో భాగంగా ఐదుశాతం కొనుగోలుదారుడికి, 35శాతం చేనేత అనుబంధ కళాకారులకు పొందిన వేతనాల నిష్పత్తిలో నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నది. ఈ పథకం కింద జిల్లాలో 173 నేత కార్మికులు, 180 మాస్టర్ వీవర్ల కింద 2,423 మగ్గాలు కలిగిన నేతన్నలు, 42 స్వయం సహాయక బృందాలు, 452 మగ్గాలు కలిగిన నేతన్నలు, 10 సహకార సంఘాల్లో 492 మంది కలిపి మొత్తం 3,540 మగ్గాలు ఈ పథకం కింద నమోదయ్యాయి. ఈ పథకం కింద ఇప్పటి వరకు 18.07 కోట్లను నేరుగా విడుదల చేశారు.
నేత కార్మికులకు రూ.2వేల పింఛన్..
చేనేత కార్మికులను ఆదుకోవడంలో భాగంగా సర్కారు మరో గొప్ప పథకానికి నాంది పలికింది. నేతన్నల మనుసు తెలిసిన కేసీఆర్ వారికి రూ. 2వేల పెన్షన్ ఇస్తున్నారు. వృద్ధాప్య పింఛన్కు అర్హత 57 సంవత్సరాల వయసు కాగా, నేత కార్మికులకు మాత్రం 50 ఏండ్లకే పింఛన్ అందజేస్తున్నారు. దీంతో వేల మంది నేతలన్నలకు భరోసా లభిస్తున్నది. బక్కచిక్కిపోయిన వారికి ఆసరా అవుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో మాత్రం నేత కార్మికులకు ఎలాంటి పింఛన్ లేదు.
నేతన్న బీమా పథకం..
నేత కార్మికుల కోసం రైతు బీమా తరహాలో చేనేత బీమా పథకాన్ని 2022 ఆగస్టు 7న రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీని కింద 18 నుంచి 59 ఏండ్లలోపు నేతన్నలు అర్హులు. జిల్లాలో 9,734 చేనేత కార్మికులు, 943 మంది మరమగ్గాల నేత కార్మికులు నమోదు చేసుకున్నారు. జిల్లాలో దురదుష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయిన 24 మంది కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5లక్షల చొప్పున పరిహారం అందింది.
రుణ మాఫీ పథకం..
జిల్లాలోని 10 చేనేత సహకార సంఘాలకు నాబార్డ్ ద్వారా రుణ రీఫైనాన్స్ కింద డీసీసీబీ నల్లగొండ నుంచి 4.52 కోట్ల రుణ పరపతి మంజూరైంది. అదేవిధంగా పావలా వడ్డీ పథకం కింద చేనేత సహకార సంఘాలకు 1.53 కోట్లు మంజూరయ్యాయి. చేనేత కళాకారులకు జిల్లా సహకార బ్యాంక్ నుంచి, జాతీయ బ్యాంక్ల నుంచి 2010 నుంచి 2017మార్చి వరకు తీసుకున్న వ్యక్తిగత రుణాలు రూ.లక్షల వరకు ప్రభుత్వం మాఫీ చేసింది. ఈ పథకం కింద జిల్లాలో 1,014 మంది చేనేత కార్మికులకు సుమారు రూ. 7కోట్ల లబ్ధి చేకూరింది.
బ్లాక్ లెవల్ క్లస్టర్లు..
జిల్లాలో నేత కార్మికుల కోసం ఏడు బ్లాక్లెవల్ క్లస్టర్లు మంజూరయ్యాయి. భూదాన్పోచంపల్లి, ఆలేరు, కొయ్యలగూడెం, వలిగొండ, రామన్నపేట, భువనగిరి, నారాయణపురంలో 10.48 కోట్లతో అమలు చేస్తున్నారు. దీని ద్వారా ఆధునిక మగ్గాలు, ఇతర పనిముట్లు, మౌలిక వసతుల కల్పన కోసం ఈ క్లస్టర్ల నిధులు వినియోగిస్తున్నారు.
నేతన్నకు చేయూత..
నేతన్నలకు సామాజిక భద్రత కల్పించడం కోసం తెలంగాణ ప్రభుత్వం నేతకార్మికుల నెలసరి చేనేత ఆదాయంలో ఎనిమిది శాతం ఆర్డీ-1లో జమచేసిన తర్వాత.. రాష్ట్ర ప్రభుత్వం ఆర్డీ-2లో 15 శాతాన్ని నేరుగా జమ చేస్తున్నది. ఆ మొత్తం నగదును వడ్డీతో సహా మూడేండ్ల తర్వాత కార్మికులకు అందిస్తున్నది. ఈ పథకం కింద జిల్లాలో 2017-20 సంవత్సరంలో 5,312 మంది నేతన్నలకు రూ.37.26 కోట్లను ప్రభుత్వం తమ వాటాగా విడుదల చేసింది. ప్రస్తుత 2021-2024 సంవత్సరానికి గానూ 6,241 మంది కార్మికులు నమోదు చేసుకున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం 32.38 కోట్లను విడుదల చేసింది.
కొండా లక్ష్మణ్ బాపూజీ చేనేత పురస్కారాలు..
రాష్ట్ర ప్రభుత్వం కొండా లక్ష్మణ్ బాపూజీ పేరున జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని నైపుణ్యం ఉన్న కార్మికులకు ఏటా అవార్డులను ప్రదానం చేస్తున్నది. దీన్ని 2018లో ప్రవేశపెట్టారు. జిల్లాలో నైపుణ్యం గల చేనేత కార్మికులను 2018లో ఆరుగురు, 2019లో ఇద్దరు, 2020లో ముగ్గురు, 2021లో నలుగురు, 2022లో ముగ్గురికి నగదు పుస్కారం, మెమెంటోతో సత్కరించారు. ఈ ఏడాది ఈ పురస్కారానికి జిల్లా నుంచి ముగ్గురు ఎంపికయ్యారు.
కొయ్యలగూడెంలో ఆధునిక వస్త్ర సముదాయం..
చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలో చేనేత సహకార సంఘానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంపోనెంట్ పథకం కింద ఆధునిక వస్త్ర సముదాయాన్ని మంజూరు చేసింది. ఇందుకు రూ.95లక్షల నిధులు విడుదల చేసింది. ఈ ఏడాది జూన్ ఆరో తేదీన షోరూం నిర్మాణ పనులకు రాష్ట్ర ఐటీ, జౌళి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం ఈ పనులు
కొనసాగుతున్నాయి.
నిలిచిన వలసలు.. ఆగిన ఆత్మహత్యలు
ఉమ్మడి ఏపీలో వేల సంఖ్యల్లో నేత కార్మికుల కుటుంబాలు ఇతర రాష్ర్టాలకు వలసలు వెళ్లేవి. భువనగిరి, ఆలేరు, నకిరేకల్, మునుగోడు నియోజకర్గాల నుంచి సూరత్, భీమండి, కొయంబత్తూర్ తదితర ప్రాంతాలకు పొట్టచేతబట్టుకొని తరలివెళ్లేవారు. కానీ, తెలంగాణ వచ్చాక సీన్ రివర్స్ అయ్యింది. వలసలు ఆగిపోగా.. అక్కడున్న వారంతా తిరిగి సొంతూర్లకు వచ్చేశారు. మరోవైపు నాడు పెద్ద ఎత్తున ఆత్మహత్యలకు పాల్పడేవారు. కానీ ఇప్పుడు చేతినిండా పని, మంచి కూలి గిట్టుబాటు అవుతున్నది. పైగా సర్కారు అనేక పథకాలతో ఆదుకుంటున్నది. ఆత్మహత్యలు అనే ముచ్చటే లేదు.
కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
తెలంగాణ ప్రభుత్వము అధికారంలోకొచ్చాక చేనేత కార్మికులను గుర్తించి జియో ట్యాగ్ ఏర్పాటు చేశారు. దీంతో కార్మికులకు నేరుగా బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమచేసి లబ్ధిదారులకు అందేలా చర్యలు చేపట్టారు. త్రిఫ్ట్ పథకం చేనేత మిత్ర, చేనేత బీమా, యారన్ సబ్సిడీ పథకాలతో అన్ని విధాలా లబ్ధి పొందుతున్నారు. కరోనా సమయంలో చేనేత చేయూత పథకం కింద పొదుపు చేసుకున్న కార్మికులకు గడ్డుకాలంలో డబ్బులు అందించారు. కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్న మంత్రి కేటీఆర్కు ధన్యవాదాలు.
సీఎం కేసీఆర్ అందిస్తున్న త్రిఫ్ట్ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంది. ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాలు చాలా బాగున్నాయి. సబ్సిడీపై నూలు ఇవ్వడంతో చేనేత కార్మికులకు చేయూతనిస్తున్నది. ప్రభుత్వం అమలు చేస్తున్న త్రిఫ్ట్ పథకం వల్ల కార్మికులకు ఆర్థిక స్వావలంబన పెంపొందుతుంది. కార్మికుడు తన ఆదాయాన్ని బట్టి నెలనెలా పొదుపు చేసే మొత్తానికి అంతకు మరో రెండు రెట్లు ప్రభుత్వం కల్పిస్తున్నది. ప్రభుత్వం ప్రకటించిన చేనేత బీమా సైతం ఆకస్మిక మరణం పొందిన చేనేత కార్మికులకు బాసటగా నిలుస్తున్నది.
చేనేత కుటుంబాల్లో ఆత్మహత్యలు ఆగిపోయాయి
నా చిన్నతనం నుంచి మగ్గం పనులు చేస్తున్నా. మా తల్లిదండ్రులు మగ్గం నేస్తుంటే నేను అచ్చులు అతకడం, రంగులు అద్దడం, కండెలు పట్టెడం లాంటి పనులు చేసేదాన్ని. మగ్గం పనులు చేస్తూ మా కుటుంబసభ్యులకు పట్టెడు అన్నం పెట్టడానికి మా నాన్న చాలా ఇబ్బందులు పడేవారు. మేమందరం ఒక పూట తీని మరో పూట పస్తులు ఉండేవాళ్లం. మగ్గం పనులు నడువక చేసిన అప్పులు తీర్చలేక మా ఊరిలో ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నరు. నా భర్తతో కలిసి ఇప్పుడు మగ్గం పనులు చేస్తున్నా. మగ్గం పనులు చేస్తూ నా ఇద్దరూ ఆడబిడ్డలను మంచిగా చదివిస్తున్నా. సీఎం కేసీఆర్ సార్ వచ్చాక నేత కార్మికల ముఖంలో సంతోషం కనబడుతుంది. సీఎం కేసీఆర్ సార్ వచ్చాక మా చేనేత కుటుంబాల్లో ఆత్మహత్యలు ఆగిపోయాయి. మా కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ సార్కు జీవితాంతం రుణపడి ఉంటాం.