కేతేపల్లి, ఫిబ్రవరి 22 : కేతేపల్లి మండల పరిధిలోని మూసీ ఆయకట్టేతర గ్రామాల్లో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. గతంలో బోర్లు, బావులు, ఏఎమ్మార్పీ నీటితో రైతులు వానకాలం, యాసంగి పంటలను సాగు చేసేవారు. నిరంతర విద్యుత్ అందుబాటులో ఉండటంతో వరి, ఇతర ఆరుతడి పంటలకు ఇబ్బంది రాలేదు. ప్రస్తుతం ఏఎమ్మార్పీ కాల్వకు నీళ్లు రావడం లేదు. దాంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం యాసంగిలో వరి సాగు చేసిన మూసీ ఆయకట్టు నీరు పూర్తిగా అందని గ్రామాలైన మండలంలోని కొండకిందిగూడెం, బండపాలెం, ఇనుపాముల, కొర్లపహాడ్, గుడివాడ, ఇప్పలగూడెం గ్రామాల్లో పొలాలు ఎండుతున్నాయి. ఆయా గ్రామాల్లో సుమారు 8 వేల ఎకరాల్లో వరి వేశారు. నీళ్లులేక ఈ పొలాలు నెర్రెలు బారుతున్నాయి. కరెంటు సమస్యలు కూడా రైతులను వేధిస్తున్నాయి. ప్రస్తుతం పొలాలు చిరుపొట్ట, పొట్ట దశలో ఉన్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆయా గ్రామాల్లో సగం పైగా పొలాలు ఎండిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. మండల వ్యాప్తంగా మూసీ ఆయకట్టు, ఆయకట్టేతర గ్రామాల్లో ప్రస్తుత యాసంగిలో 19,500 ఎకరాల్లో రైతులు వరిసాగు చేశారు. ఆయకట్టు గ్రామాల్లో నీటికి ఇబ్బందులు లేవు.
నాకున్న రెండు బోర్లను నమ్ముకొని ఈ యాసంగిలో 5 ఎకరాల్లో వరి నాటు వేసిన. ప్రస్తుతం పొలం పొట్టదశకు చేరుకుంది. భూగర్భజలాలు తగ్గడంతో బోర్లలో సరిపడా నీరు రావడం లేదు. దీనికి తోడు కరెంటు కోతలు కూడా తీవ్రంగా ఉన్నాయి. వరుస తడులు నీరు పెట్టినప్పటికీ లాభం లేదు. ఈ పరిస్థితుల్లో చేసేదేమీ లేక రెండు ఎకరాల పొలం వదిలేశాను. నోటికాడికి వచ్చిన పొలం ఎండిపోవడంతో చాలా బాధగా ఉన్నది. సరిపడా నీళ్లు, కరెంట్ ఉంటే నా పొలం ఎండిపోకుండా కాపాడుకునే వాడిని.