నేరేడుచర్ల, నవంబర్ 5 : అసెంబ్లీ ఎన్నికల్లో తొలి అంకమైన నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది. పోటీ చేస్తున్న అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే.. ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని, పొరపాటు చేస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుందని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. నామినేషన్ పత్రాన్ని సరిగా నింపి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అప్పగించడం, విధి విధానాలను అనుసరించి వ్యవహరించడం, పలు అంశాలను తూచ.
తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా ఎన్నికల అఫిడవిట్లో తమ ఆస్తులు, నేర చరిత్ర, కులం వంటి వివరాలను పక్కాగా నమోదు చేయాలి. ఇందులో ఏ మాత్రం పొరపాటు జరిగినా నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉన్నది. అఫిడవిట్లో వివరాలు తప్పుగా నమోదు చేస్తే.. ఎన్నికల్లో విజయం సాధించినా ప్రత్యర్థులు కోర్టును ఆశ్రయిస్తే పదవిని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల నామినేషన్ పత్రాల్లో పూర్తి వివరాలను జాగ్రత్తగా నమోదు చేయాలని, నామినేషన్ వేసే సమయంలో నిర్ధేశించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు.
ఎన్నికల్లో పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్ పత్రాల్లో తమకున్న ఆస్తుల వివరాలను విధిగా నమోదు చేయాలి. స్థిర, చర ఆస్తులతోపాటు ఆభరణాలు, వాహనాల వివరాలను నిర్ధిష్ట ప్రొ ఫార్మాలో పేర్కొన్నాలి. వారికున్న రుణాలు, అప్పులు, ఈ ఐదేండ్లలో జరిగిన ఆర్థిక లావాదేవీల వివరాలను అందించాలి.
రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా తమ కులం వివరాలను అఫిడవిట్లో నమోదు చేయాలి. ఈసీ ప్రకటించిన రిజర్వేషన్ ప్రకారంగానే అభ్యర్థులు పోటీ చేయాల్సి ఉండడంతో ఆ కులం వివరాలతో పాటు రెవెన్యూ అధికారి జారీ చేసిన ధ్రువపత్రం జత చేయాలి. జనరల్ స్థ్ధానాల్లో పోటీ చేసే వారికి ఈ నిబంధన వర్తించదు.
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఈసీ నిబంధనల మేరకు నామినేషన్ పత్రాల అఫిడవిట్లో ఆస్తులు, కేసుల వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలి. ఈ వివరాలను ఎన్నికల సంఘం వెబ్సైట్లో ప్రజల ముందు ఉంచుతుంది. తప్పుడు సమాచారం నమోదు చేస్తే భవిష్యత్లో న్యాయపరంగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఎన్నికల అఫిడవిట్ను పూర్తిగా నమోదు చేయాలి. లేకుంటే తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి అభ్యర్థులు జాగ్రత్తగా వ్యవహరించడం శ్రేయస్కరం.