కట్టంగూర్, అక్టోబర్ 14: నిమ్మ ధరలు పాతాళంలోకి పడిపోవడంతో నిమ్మ పండించే రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. నిమ్మసాగులో రాష్ట్రంలోనే పేరున్న ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులు పడిపోయిన ధరతో ఆందోళన చెందుతున్నారు. వేల రూపాయలను పురుగు మందులకు ఖర్చు చేసిన అన్నదాతల పరిస్థితి దయనీయం. ధరలు పడిపోవడంతో నష్టాలు తప్పేలా లేవంటూ అన్నదాతలు అందోళన చెందుతున్నారు. నిమ్మ ధర నిలకడ లేకుండా రోజుకో ధర పలుకుతోంది.
ఇటీవల ధర పూర్తిగా పడిపోవడంతో రైతులకు సమస్యలు వచ్చిపడ్డాయి. ప్రస్తుతం ఒక బస్తా పండు కాయలు రూ.70 నుంచి 100, పచ్చి కాయలు రూ.100 నుంచి 200లకు మించి పలకడం లేదు. ఆటో కిరాయి, కోత కూలీ కూడా గిట్టడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది మొదటి నుం చి నిమ్మకు సరైన ధర లేకపోవడంతో రైతులు నష్టాల్లో కూరుకుపోయారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి నిమ్మకాయలు అధికంగా ఢిల్లీ, బెంగళూరు, ఒరిస్తా, చత్తీస్ఘడ్ రాష్ర్టాలకు ఎగుమతి చేస్తుంటారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మ రైతుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
5271 ఎకరాల్లో నిమ్మ సాగు..
నకిరేకల్ నియోజకవర్గం నిమ్మసాగులో జిల్లాలోనే మొదటి స్థానంలో ఉంది. నియోజకవర్గంలోని చిట్యాల, కట్టంగూర్, నార్కట్పల్లి, నకిరేకల్, కేతేపల్లి మండలాలతోపాటు తుం గతుర్తి నియోజకవర్గంలోని శాలిగౌరారం మండలంలో సుమారు 2వేల మంది రైతులు 5271 ఎకరాల పైగా నిమ్మ సాగుచేస్తున్నారు. నకిరేకల్లో ఏర్పాటు చేసిన నిమ్మ మార్కెట్ కు పలు గ్రామాల రైతులు అటోలు, మినీ లారీల్లో నిమ్మకాయలు తీసుకొస్తుంటారు.
రోజు రోజుకూ తగ్గుతున్న ధర..
బస్తా (25కిలోలు) నిమ్మకాయలు మార్కెట్కు తరలించేందుకు రూ.వంద ఖర్చవుతుండగా ధర మాత్రం రూ.200 మించి రావడం లేదు. గతేడాది ఇదే సమయంలో బస్తా ధర రూ.1200 నుంచి 2వేల వరకు, ఓ సమయంలో రూ.2700 వరకు పలికింది. అయితే గత రెండు నెలల నుంచి క్రమంగా నిమ్మ ధరలు పడిపోతున్నాయని రైతులు తెలిపారు. ఎకరా సాగు కోసం రైతులు 1.20లక్షలు ఖర్చు చేశారు. పంట దిగుబడి బాగుందని, ఈ ఏడాది మంచి ఆదాయం వస్తుందని భావించిన రైతులకు ధరలు ఢమాల్ అనడంతో నిరాశే మిగిల్చింది. గతే దాడి రూ.80 ఉన్న ధర ప్రస్తుతం రూ.10కి పడిపోయింది.
చేతి ఖర్చులు కూడా రావడం లేదు..
నిమ్మ సాగు వల్ల సంపాదించిందేమీ లేదు. కనీసం పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదు. గతేడాది ఇదే సమయంలో కిలో వంద రూపాయలు పలికిన ధర ఇప్పుడు రూ.10 రూపాయల కన్నా తక్కువ పలుకుతోంది. ఖాళీ బస్తాకు రూ.10, ఆటో కిరాయి బస్తాకు రూ. 20 నుంచి 30, కమీషన్ రూ.15 పోను మా చేతి ఖర్చులకు కూడా మిగలడం లేదు. ఇంత భారీ మొత్తంలో ధర పడిపోవడం ఇదే మొదటి సారి. ప్రభుత్వ స్పందించి నిమ్మకు గిట్టుబాటు ధర కల్పించాలి.
-అంతటి రాము, నిమ్మ రైతు, కట్టంగూర్