సమైక్య పాలనలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో అనేక అవకతలు, ఆరోపణలకు ఆస్కారం ఉండేది. దాంతో ప్రతిభ కలిగిన వారికి కొన్నిసార్లు అన్యాయం జరిగేది. రాత పరీక్షలో మాల్ ప్రాక్టీస్ లేదా పైలటింగ్, ఇంటర్వ్యూల్లో అక్రమాలు జరిగేవన్న విమర్శలు ఉన్నాయి.
పైరవీకారులు, డబ్బున్నోళ్లకే ఎక్కువగా పోలీసు ఉద్యోగాలు దక్కేవని చెప్పుకునేవారు. కాగా స్వరాష్ట్రంలో సర్కార్ కొలువుల నియామకాల్లో అక్రమాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. దాంతో ప్రతిభనే గీటురాయిగా ఉద్యోగాల ఎంపిక జరుగుతున్నది. బుధవారం వెలువడిన కానిస్టేబుళ్ల ఫలితాల్లో ధనిక, పేద అనే తేడా లేకుండా ప్రతిభ కనబర్చిన అభ్యర్థులే ఉద్యోగాలు సాధించారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో మొత్తం 1,249 మంది కానిస్టేబుళ్లుగా ఉద్యోగాలు సాధించారు. యాదాద్రి భువనగిరి జిల్లావాసులు రాచకొండ పరిధిలో కొలువులు కొట్టారు. మొత్తంగా నిరుపేద కుటుంబాలకు చెందినవారే ఎక్కువ మంది ఉన్నారు. రూపాయి ఖర్చు కాకుండా, ఎవరి పైరవీ లేకుండా ఉద్యోగాలు రావడంతో ఆయా కుటుంబాల్లో సంతోషం వెల్లువిరుస్తున్నది. ఆగస్టులో వెలువడిన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఎస్ఐ) పోస్టుల భర్తీ కూడా పూర్తి పారదర్శకంగా జరిగిన విషయం తెలిసిందే.
1,249 మంది కానిస్టేబుళ్లుగా ఎంపిక
కాగా, బుధవారం వెలువడిన కానిస్టేబుళ్ల ఫలితాల్లో నల్లగొండ, సూర్యాపేట జిల్లాల నుంచి సివిల్, ఏఆర్, టీఎస్ఎస్పీ విభాగాల్లో కలిపి మొత్తం 1,249 మంది ఎంపికయ్యారు. నల్లగొండ జిల్లా నుంచి 784 మంది ఎంపిక కాగా, అందులో 347 మంది సివిల్, 115 మంది ఏఆర్, 222 మంది టీఎస్ఎస్పీ విభాగాల్లో ఉద్యోగాలు సాధించారు. సూర్యాపేట జిల్లా నుంచి మొత్తం 465 మంది ఎంపిక కాగా అందులో 229 మంది సివిల్, 89 మంది ఏఆర్, 147 టీఎస్ఎస్పీ విభాగాల్లో కానిస్టేబుళ్లుగా ఉద్యోగాలు సాధించారు. వీరిలో మెజార్టీ అభ్యర్థులు పేద, నిరుపేద కుటుంబాలకు చెందినవారే ఉండడం విశేషం.
ఉద్యోగాల భర్తీలో ఎలాంటి అక్రమాలు, పైరవీలకు ఆస్కారం లేకుండా కట్టుదిట్టంగా వ్యవహరించారనడానికి ఈ ఫలితాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. గతంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అంటేనే డబ్బుతో కూడినవని అభిప్రాయాలు ఉండేవి. ఇక రాత పరీక్షల్లోనే పైలెటింగ్, ఇతర అక్రమాలు, ఇంటర్వ్యూల సమయంలో డబ్బులకు పెద్ద పీట లాంటివి కనిపిస్తుండేవి. పేద అభ్యర్థుల్లో హైలీ టాలెంటెడ్ వాళ్లల్లో కొందరికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చి ఆ తర్వాత అమ్మకానికి పెట్టే పరిస్థితులు ఉండేవి. కానీ ఇలాంటి వాటికి చెక్ పెడుతూ స్వరాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ కొనసాగుతున్నది. ఇప్పటికే అనేక ఉద్యోగాలను అవకతకలు లేకుండా భర్తీ చేశారు.
బుధవారం సాయంత్రం విడుదలైన పోలీస్ కానిస్టేబుళ్ల పోస్టులు సైతం ప్రతిభ ఆధారంగానే ఎంపిక పూర్తయ్యింది. వెల్లడైన ఫలితాలను పరిశీలిస్తే అత్యంత సామాన్య కుటుంబాలకు చెందిన యువకులు చాలా మంది ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఒక్కో కుటుంబం నుంచి రెండు ఉద్యోగాలు పొందినవారు సైతం ఉన్నారు. ఇక ఒకే ఊరి నుంచి ఏడెనిమిది మంది కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించినవారు ఉండడం విశేషం. వీరంతా పరీక్షల నిర్వహణపైనా, ప్రభుత్వ చిత్తశుద్ధిపైనా పూర్తి సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ సర్కారు చిత్తశుద్ధితోనే ఇది సాధ్యమైందని ప్రశంసిస్తున్నారు. ఎక్కడా కూడా చిన్న అనుమానాలకు తావులేకుండా పరీక్షలు నిర్వహించారని, పరీక్షల ఫలితాల వెల్లడిలోనూ కటాఫ్ మార్కుల నిర్ధారణలోనూ అంతా పారదర్శకంగా జరిపారని చెబుతున్నారు. కేవలం ప్రతిభ ఆధారంగా తమ చిన్ననాటి కల నెరవేరుతుండడం తమతోపాటు తమ కుటుంబ సభ్యులకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని చెప్పారు. ప్రస్తుత ఉద్యోగాలు తమ జీవితాల్లో మార్పునకు తొలిమెట్టు లాంటివని సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్ 5(నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అనగానే సమైక్య పాలనలో అనేక అవకతవకలు, ఆరోపణలకు ఆస్కారం ఉండేది. దాంతో ప్రతిభ కలిగి వారికి కొన్నిసార్లు తీరని అన్యాయం జరిగేది. రాత పరీక్షలో మాల్ ప్రాక్టీస్ లేదా పైలటింగ్ లాంటివి, అవి కాకపోయినా ఇంటర్వ్యూల్లోనూ అనేక అక్రమాలకు నిలయంగా రిక్రూట్మెంట్ ఉండేదన్న విమర్శలు ఉన్నాయి. దాంతో కొన్ని ఉద్యోగాల వైపు సాధారణ కుటుంబాలకు చెందినవారు దృష్టి కూడా పెట్టేవారు కాదు. ఇక ఖాళీ అయిన ఉద్యోగాల భర్తీపైనా ప్రభుత్వాలు పెద్దగా దృష్టి పెట్టేవి కావు.
కానీ నీళ్లు, నిధులు, నియమాకాల పేరుతో సాగిన ఉద్యమంతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. ఇలా సాధించుకున్న తెలంగాణలో నియామకాలను పెద్దఎత్తున చేపట్టేందుకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. నియామకాలను సైతం అత్యంత పారదర్శకంగా నిర్వహించడమే లక్ష్యంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. పైరవీలకు ఆస్కారం ఉన్న ఇంటర్వ్యూలను తొలిగించారు. స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు దక్కాలని, అందరికీ సమన్యాయం జరిగేలా కొత్త జోనల్ వ్యవస్థను తీసుకొచ్చారు. దీని ప్రకారం వేలాది ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నది. ఓ వైపు టీఎస్పీఎస్సీ ద్వారా గ్రూప్స్తోపాటు ఇతర పరీక్షలు నిర్వహిస్తూనే మరోవైపు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా పోలీస్ శాఖలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
గత ఆగస్టులో 543 ఎస్ఐ పోస్టులను భర్తీ చేశారు. ఎంపికైన వారికి శిక్షణ ప్రక్రియ కొనసాగుతున్నది. ఇక కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం గత ఏడాదిలోనే నోటిఫికేషన్ విడుదల చేశారు. గత డిసెంబర్లో దేహదారుఢ్య పరీక్షలు పూర్తి చేశారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో కలిపి పురుషులు మొత్తం 26,433 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 23,524 మంది ఫిజికల్ పరీక్షలకు హాజరయ్యారు. అందులో 12,124 మంది అర్హత సాధించారు. ఇక మహిళల విషయంలో 4,698 మంది దరఖాస్తు చేసుకోగా 4,264 మంది ఫిజికల్ పరీక్షలకు హాజరుకాగా 2,889 మంది అర్హత సాధించారు. వీరందరికీ ఈ ఏడాది ఏప్రిల్ 29న తుది ఎంపిక కోసం రాత పరీక్ష నిర్వహించారు. మొత్తం 11,239 మంది పరీక్షకు హాజరైనట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఉద్యోగం వచ్చినందుకు ఆనందంగా ఉంది
గత మూడు మాసాల క్రితం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పోలిస్ కానిస్టేబుల్ రాతపరీక్షలో నాకు సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చినందుకు ఆనందంగా ఉంది. తల్లిదండ్రుల ప్రోత్సహాం ప్రణాళికబద్దంగా కష్టపడి చదువుకోవడం వలన నాకు ఉద్యోగం వచ్చింది. ప్రభుత్వం నిజాయితీగా రాత పరీక్ష నిర్వహించడం వలనే నాకు పోలిస్కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. భవిష్యత్లో ఎస్ఐ ఉద్యోగం కోసం ప్రిపేరైతా. కచ్చితంగా ఎస్ఐ ఉద్యోగం సాధించడంతో పాటు శాంతిభద్రతలు కాపాడి పేదలకు అండగా ఉంటా.
– కనకరాజు అఖిల, కొత్తపల్లి, అనుముల మండలం
కష్టపడితేనే ఫలితం దక్కుతుంది
ప్రభుత్వ ఉద్యోగానికి ఎంతో కష్టపడితే కానీ ఫలితం దక్కదు. మా కుటుంబ సభ్యులు అందించిన ప్రోత్సాహం, తెలంగాణ ప్రభుత్వం సకాలంలో వేసిన నోటిఫికేషన్తోనే నాకు టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ కొలువు దక్కింది. ఎవరైనా టీఎస్ఎస్పీ పట్ల వ్యతిరేకంగా మాట్లాడితే నమ్మవద్దు. అలాగే దేశంలోనే గ్రూప్ పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహించేది కేవలం మన రాష్ట్రంలోని టీఎస్పీఎస్సీనే. పుకార్లు నమ్మి సమయాన్ని వృథా చేసుకోకుండా కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించాలి.
-గడ్డం సుఖేందర్రెడ్డి, మర్రిగూడెం, మాడ్గులపల్లి
మా నాన్న కష్టానికి ఫలితం..
మాది చండూరు మండలం కస్తాల. మాది వ్యవసాయ ఆధారిత కుటుంబంతోపాటు మా నాన్న ఆటోడ్రైవర్గా పని చేస్తూ నన్ను, మా అన్నయ్యను చదివించారు. మా అన్నయ్య కొద్ది మార్కులతో ఉద్యోగం సాధించలేకపోయినా నాన్న కష్టం వృథా కాకుండా నాకు ఉద్యోగం వచ్చినందుకు సంతోషంగా ఉంది. మున్ముందు ఎస్ఐగా ఎంపిక కావడమే నా లక్ష్యం. యువతకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ఎన్నో నోటిఫికేషన్లు ఇస్తున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు.
– కట్ట మల్లికార్జున్, కస్తాల, చండూరు
స్నేహితుల సహకారంతో ఉద్యోగం సాధించా
నిరుపేద కుటుంబంలో పుట్టి తల్లిదండ్రుల ప్రోత్సాహం, స్నేహితుల సహకారంతో పోలీస్ ఉద్యోగం సాధించాను. బీటెక్ చదివిన నేను పోలీస్ జాబ్పై మక్కువతో కానిస్టేబుల్ ఉద్యోగానికి దరఖాస్తు చేసి ప్రిపేరయ్యాను. స్నేహితుల వద్ద పుస్తకాలు తీసుకొచ్చి ఇంటి వద్ద ఉండే చదివాను. నాకు జాబ్ రావడంలో నా మిత్రుల పాత్ర మరువలేనిది. నోటిఫికేషన్ ఇచ్చి పారదర్శకంగా ఉద్యోగాలు భర్తీ చేసిన తెలంగాణ ప్రభుత్వానికి ఎల్లవేళలా రుణపడి ఉంటాను.
-కడారు ప్రశాంత్రెడ్డి, నాగారంబంగ్లా
పోలీస్ అవ్వాలన్న కల నెరవేరింది
మాది మధ్యతరగతి కుటుంబం. మా నాన్న రాశీ రీఫ్యాక్టరీస్ కంపెనీలో పని చేస్తున్నాడు. మా అమ్మ కూలి పనికి వెళ్తుంది. నేను ఆడపిల్లను అయినా సరే మగవారికి ధీటుగా ఆటలు, చదువులో రాణించాలనే తపనతో మా నాన్న నన్ను ఆ దిశగా ముందుకు నడిపించాడు. కష్టపడి చదివి నా చిన్ననాటి కల అయిన పోలీస్ ఉద్యోగం సాధించా. ఉద్యోగం రావడం చాలా సంతోషంగా ఉంది. ఉద్యోగానికి పేరు, ప్రఖ్యాతలు తేవడమే లక్ష్యంగా పని చేస్తాను.
-జాల ఇంద్రజ, నార్కట్పల్లి
రాజాపేట మండలంలో 13 మందికి ఉద్యోగాలు..
రాజాపేట, ఆక్టోబర్ 5 : మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 13 మంది యువకులు కానిస్టేబుళ్లుగా ఉద్యోగాలు సాధించారు. దూదివెంకటాపురానికి చెందిన చామకూర మధుకుమార్, మంగ శిరీష, నెమిలెకు చెందిన తాటికొండ రాజు, పోతర్ల వెంకటేశ్, పండుగ బాబు, పాముకుంటకు చెందిన మేక శ్రీనివాస్, మామిడిగళ్ల అనిల్కుమార్, రాజాపేటకు చెందిన గుర్రాల కరుణాకర్, కుర్రారానికి చెందిన పుప్పాల నరేశ్, బాల్ద సంపత్, పుట్టెగూడేనికి భూక్యా ప్రకాశ్, ముడావత్ మాలు, మాడోతు హనుమంత్ ఉద్యోగాలు సాధించారు. వీరిని తల్లిదండ్రులు, ఆయా గ్రామాల ప్రజలు అభినందించారు.
తల్లిదండ్రుల కోరిక నెరవేర్చా..
మాది భూదాన్పోచంపల్లి మండలం జూలూరు గ్రామం. నాకు అక, చెల్లి ఉన్నారు. మా కుటుంబం మా నాన్న రెకల కష్టం మీద ఆధారపడి ఉంది. మా తల్లిదండ్రులు నాకు ఉద్యోగం రావాలని నమ్మకం పెట్టుకున్నారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా, వారి కోరిక నెరవేర్చాలన్న పట్టుదలతో చదివి ఏఆర్ కానిస్టేబుల్కు ఎంపికయ్యాను. ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి సకాలంలో ఉద్యోగాలకు ఎంపిక చేయడం అభినందనీయం.
-చిందం ప్రసాద్, జూలూరు, భూదాన్పోచంపల్లి
పరీక్ష రాసిన ఐదుగురికీ ఉద్యోగాలు..
మాడ్గులపల్లి, అక్టోబర్ 5 : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కానిస్టేబుల్ ఫలితాల్లో మండలానికి చెందిన ఐదుగురు కానిస్టేబుళ్లుగా ఉద్యోగం సాధించారు. మండలంలోని మర్రిగూడేనికి చెందిన నలుగురు యువకులు, ఒక యువతి ఉద్యోగాలు పొందారు. అయితే గ్రామం నుంచి వీరు ఐదుగురు మాత్రమే కానిస్టేబుల్ పరీక్ష రాయగా అందరికీ కొలువులు దక్కడం విశేషం. ఉద్యోగాలు సాధించిన వారిలో గడ్డం సుఖేందర్రెడ్డి, (టీఎస్ఎస్పీ), దేవిరెడ్డి వినయ్రెడ్డి(ఎస్పీఎఫ్), గాదె విక్రమ్రెడ్డి(ఎస్పీఎఫ్), దేవిరెడ్డి వేణుగోపాల్రెడ్డి(సివిల్), దేవిరెడ్డి అనుషారెడ్డి(సివిల్) విభాగాల్లో ఉద్యోగాలు సాధించారు.
కోచింగ్ లేకుండానే కొలువు సాధించిన గీత కార్మికుడి బిడ్డ
నకిరేకల్, అక్టోబర్ 5 : నకిరేకల్ పట్టణానికి చెందిన నర్సింగ్ యాదయ్య, జానమ్మ దంపతుల కుమారుడు నర్సింగ్ రాజు. యాదయ్య కల్లు గీస్తూ కొడుకును చదివించాడు. రాజు 1 నుంచి 10వ తరగతి వరకు నకిరేకల్ ప్రభుత్వ జిల్లా పరిషత్ హైస్కూల్లో చదివాడు. ఇంటర్ కాకతీయ జూనియర్ కళాశాలలో చదివాడు. అనంతరం పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడంతో నకిరేకల్ పట్టణంలోని వాసవీ సేవా సమితి, లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వాసవీనగర్లోని వాసవీ కళాశాల స్టడీ హాల్లో ప్రిపేర్ అయ్యాడు. స్టడీహాల్ బుక్స్ను వినియోగించుకుని సొంతంగా ప్రిపేర్ అయ్యాడు. పట్టుదలతో చదివి కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించడంతో తల్లిదండ్రులు, పట్టణ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అన్నదమ్ముళ్లు అదరగొట్టారు!
హుజూర్నగర్ , అక్టోబర్ : మండలంలోని బూరుగడ్డ గ్రామానికి చెందిన యరగాని భిక్షం, సుజాత దంపతుల కుమారులు వేణుకుమార్, సాయికుమార్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించి పలువురి ప్రశంసలు అందుకున్నారు. మధ్యతరగతి కుటుంబం కావడం, చిన్నతనం నుంచి అమ్మ, నాన్న పడుతున్న కష్టాలను చూసి చలించిపోయి ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే తపనతో సాధన చేసి కొలువును సాధించినట్లు వేణు, సాయి తెలిపారు. గ్రామీణ విద్యార్థులు చెడువ్యవసనాలకు బానిసలు కాకుండా జీవితంలో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ దిశగా పయనించి విజయం సాధించాలన్నారు.
పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ
ప్రభుత్వ ఉద్యోగమే ఏకైక లక్ష్యంగా కష్టపడ్డాను. ప్రైవేట్ స్కూల్లో వలంటీర్గా పని చేస్తూనే జాబ్కు ప్రిపేర్ అయ్యాను. కొద్ది మార్కుల్లో ఎస్ఐ జాబ్ కోల్పోయాను. ఇప్పుడు సివిల్ కానిస్టేబుల్కు ఎంపికవడం సంతోషంగా ఉంది. అమ్మానాన్న ఎంతో కష్టపడి నన్ను, అక్కను చదివించారు. వాళ్ల కష్టానికి ప్రతిఫలం దక్కాలని అనుకున్నాను. అమ్మాయిలు తమ కాళ్లమీద తాము నిలబడాలంటే మంచి జాబ్ ఉండాలని పట్టుదలతో ప్రిపేర్ అయ్యాను. మాది గ్రామీణ ప్రాంతం అవడంతో నోటిఫికేషన్ వచ్చాక ప్రాక్టీస్, కోచింగ్కు ఇబ్బంది అవుతున్నదని హైదరాబాద్ వెళ్లాను. నోటిఫికేషన్ల సమయంలో రాజకీయ పార్టీల సృష్టించిన గందరగోళాలేవీ పట్టించుకోలేదు. కేవలం నా చదువు మీదే నమ్మకంతో ప్రిపేర్ అయ్యాను. ఉద్యోగాల ఎంపిక చాలా ఫర్ఫెక్ట్గా జరిగింది. ఎక్కడా, ఎవరికీ రూపాయి లంచం ఇవ్వలేదు. పైరవీలకు తావులేదు. రాష్ట్ర ప్రభుత్వం చాలా పారదర్శకంగా ఉద్యోగాలను భర్తీ చేసింది.
-ముత్యాల శ్రావ్య, పెదవీడు, మఠంపల్లి మండలం
పైరవీలకు తావులేకుండా ఉద్యోగం వచ్చింది
కానిస్టేబుల్ ఉద్యోగం రావడం సంతోషంగా ఉంది. ఎలాంటి పైరవీలకు తావులేకుండా ఉద్యోగం వచ్చింది. సీఎం కేసీఆర్ ప్రభుత్వంతోనే ఇది సాధ్యమైంది. నాన్న శంకరయ్య లారీ డ్రైవర్గా పని చేసేవాడు. నేను ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు అనారోగ్యంతో చనిపోయాడు. ఆర్థిక ఇబ్బందులు తీవ్రంగా బాధించేవి. దాంతో ఖర్చుల నిమిత్తం చిన్న చిన్న పనులు చేసుకుంటూ డిగ్రీ పూర్తి చేశాను. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో చదివి కానిస్టేబుల్ ఉద్యోగం సాధించా. అమ్మ పద్మ ప్రస్తుతం గ్రామపంచాయతీ స్వీపర్గా పని చేస్తున్నది. తమ్ముడు రాకేశ్ను కూడా చదువుకుంటుండు. ఈ ఉద్యోగంతో మా కుటుంబానికి భరోసా వచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్లు వేసి మాలాంటి నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తున్నది.
-బోయ రాజు, పంతంగి, చౌటుప్పల్ మండలం
మా తల్లిదండ్రుల కష్టాలు తీరనున్నాయి
రైతు కుటుంబానికి చెందిన మా తల్లిదండ్రులు దేవులా, బీచాలి దంపతులకు మేము ఇద్దరం సంతానం. మా అన్నయ్య వ్యవసాయం చేస్తుంటాడు. నాకు చదువుపై ఉన్న ఆసక్తితో నా తల్లిదండ్రులు కష్టపడి నన్ను చదివించారు. నేను ఎంఫార్మసీ పూర్తి చేశాను. కుటుంబ కష్టాలను తీర్చాలనే నేను కష్టపడి చదివాను. గతంలో పోలీస్ ఉద్యోగం సాధించడంలో రెండుసార్లు విఫలమయ్యాను. ఈసారి ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో బాగా చదివాను. మూడోసారి అనుకున్నది సాధించాను. పోలీస్ ఉద్యోగానికి సన్నద్ధమవుతున్న తరుణంలో ప్రతి వారం నా భార్యతో పరీక్ష పెట్టించుకునేవాణ్ని. ఇప్పుడు నా కల నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది. పోలీస్ ఉద్యోగానికే పరిమితం కాకుండా గ్రూప్-2కు కూడా సన్నద్ధమవుతున్నా. అది కూడా సాధిస్తాననే నమ్మకం ఉంది.
-బానోతు రవీందర్, రోళ్లబండతండా, సూర్యాపేట
ప్రతిభకు పట్టం కట్టిన ప్రభుత్వానికి ధన్యవాదాలు
నాది మేళ్లచెర్వు మండలంలోని కందిబండ. మాది మధ్య తరగతి కుటుంబం. మా నాన్న ప్రైవేట్ ఉపాధ్యాయుడిగా పని చేస్తూ నన్ను చదివించాడు. కోదాడలో ఇంటర్ వరకు, జగిత్యాల ప్రభుత్వ కళాశాలలో బీటెక్ పూర్తి చేశాను. ఎయిర్ఫోర్స్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే కొద్దిలో తప్పిపోయింది. తెలంగాణ ప్రభుత్వం ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడంతో దరఖాస్తు చేసుకున్నా. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా మొదటి ప్రయత్నంలోనే కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపిక కావడం సంతోషంగా ఉంది. ఎలాంటి పైరవీలు, లంచాలకు తావు లేకుండా ప్రతిభకు పట్టం కట్టిన ప్రభుత్వానికి ధన్యవాదాలు.
-కేశగాని సాయితేజ, కందిబండ, మేళ్లచెర్వు
లంచానికి తావులేకుండా జాబ్
నేను డిగ్రీ పూర్తి చేసి పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడగానే హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటూ ప్రిపేర్ అయ్యాను. దేహదారుఢ్య పరీక్షలకు సాధన చేసి ఈవెంట్స్లో మెరిట్ సాధించాను. మొదటి ప్రయత్నంలోనే ఏఆర్ ఉద్యోగం సాధించాను. తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉద్యోగ సాధనకు ఎంతో ఉపయోగపడింది. అంతేకాకుండా ఎలాంటి పైరవీలు, లంచాలకు తావులేకుండా పోలీస్ రిక్రూట్మెంట్ పూర్తిచేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
– పిల్లుట్ల సౌజన్య, చిలుకూరు
గ్రామాలు, మండలాల వారీగా ఉద్యోగాలు..
మునగాల, అక్టోబరు 5 : మండల పరిధిలోని తాడువాయి గ్రామానికి మాతంగి వెంకన్న, నాగమణి దంపతుల కుమారులైన మహేశ్, సూర్య తొలి ప్రయత్నంలోనే పోలీస్ ఉద్యోగాలు సాధించారు. బుధవారం వెలువడిన పోలీస్ ఫలితాల్లో మహేశ్(టీఎస్ఎస్పీ) ఉద్యోగం సాధించగా, సూర్య(ఎస్పీఎఫ్) ఉద్యోగం పొందాడు. వీరి తండ్రి చిన వెంకన్న దివ్యాంగుడు. తల్లి నాగమణి కూలి పనులు చేస్తూ వీరిని చదివించింది. నిరుపేద కుటుంబంలో అన్నదమ్ముళ్లు పోలీస్ ఉద్యోగాలు సాధించడంతో వారిని పలువురు అభినందించి సన్మానం చేశారు. తొలి ప్రయత్నంలోనే పోలీస్ ఉద్యోగాలు సాధించామని వారు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయడం ఆనందంగా ఉంది. బాబాయి మాతంగి రమేశ్ను(ఆర్డీఓ) ఆదర్శంగా తీసుకొని ఉద్యోగాలు సాధించినట్లు చెప్పారు.
అక్కాచెల్లెళ్లకు పోలీస్ కొలువులు
శాలిగౌరారం, అక్టోబర్ 4 : కన్న తండ్రి కాలం చేసినా అనుకున్న లక్ష్యాన్ని మాత్రం మర్చిపోలేదు. పట్టువదలకుండా చదివి ఏఆర్ పోలీస్ కొలువులు సాధించారు అక్కాచెల్లెళ్లు. శాలిగౌరారం మండలం మనిమద్దెకు చెందిన జనగాం సత్తయ్య, ఎల్లమ్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. వృత్తి రీత్యా కల్లుగీత కార్మిక కుటుంబం కావడంతో ప్రతి ఏటా బతుకుదెరువు కోసం ఛత్తీస్ఘడ్ తదితర రాష్ర్టాలకు కల్లు గీసేందుకు వెళ్లేవారు. ఈ నేపథ్యంలో పిల్లల చదువుకు ఇబ్బంది కావొద్దనే ఉద్దేశంతో ఎల్లమ్మ తల్లిగారి ఊరైన మోత్కూర్ మండలం బుజులాపురంలో ఉంచి వెళ్లేవారు. అప్పట్నుంచి అక్కాచెల్లెళ్లు అమ్మమ్మ ఊర్లోనే ఉండి చదువుతున్నారు.
1 నుంచి 10 వరకు బుజులాపురం, పై చదువుల కోసం వేర్వేరు కళాశాలల్లో చేరి ఉన్నత విద్యను అభ్యసించారు. స్రవంతి ఎమ్మెస్సీ పూర్తి చేయగా, శ్రావణి ఎమ్మెస్సీ చదువుతున్నది. ఈ క్రమంలో పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేశారు. కోచింగ్ తీసుకోకుండా కష్టపడి చదివి మొదటి ప్రయత్నంలోనే స్రవంతి 135, శ్రావణి 137 మార్కులు సాధించి ఏఆర్ కానిస్టేబుళ్లుగా ఎంపికై ఆదర్శంగా నిలిచారు. కాగా, తండ్రి ఎల్లయ్య 6 ఏండ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు.
పెద్దసూరారంలో అన్నదమ్ముళ్లకు..
నల్లగొండ రూరల్, అక్టోబర్ 5 : మండలంలోని పెద్దసూరారం గ్రామానికి చెందిన ఐదుగురు కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించారు. వారిలో గ్రామానికి చెందిన బండారు మహేశ్(సివిల్), బండారు నవీన్(ఏఆర్) కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించగా వీరిద్దరు అన్నాదమ్ముళ్లు. వీరి పెద్ద అన్న సైతం గతంలోనే కానిస్టేబుల్ ఉద్యోగం పొంది విధులు నిర్వహిస్తున్నాడు. అలాగే గ్రామానికి చెందిన బండారు నర్సింహ 17 ఏండ్లు ఆర్మీలో పని చేసి ప్రస్తుతం కానిస్టేబుల్ ఫలితాల్లో సివిల్ కానిస్టేబుల్గా ఎంపికయ్యాడు. గ్రామానికి చెందిన తంతనపల్లి సతీశ్(సివిల్), కొమ్మగొని సతీశ్(ఏఆర్) కానిస్టేబుళ్లుగా ఉద్యోగాలు సాధించారు. ఉద్యోగాలు సాధించిన వీరంతా నిరుపేద విద్యార్థులే కావడం గమనార్హం.
పేదరికం నుంచి ప్రభుత్వ ఉద్యోగం వరకు..
తిప్పర్తి, అక్టోబర్ 4 : మండలంలోని పజ్జూరుకు చెందిన కంకణాల మహేశ్ కుటుంబానిది రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. తల్లిదండ్రులు కూలి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పేద కుటుంబానికి చెందిన మహేశ్ పట్టుదలతో చదివి కానిస్టేబుల్ ఉద్యోగం సాధించి ఉద్యోగానికి పేదరికం అడ్డుకాదని నిరూపించాడు. అలాగే మండలంలోని రామలింగాలగూడెంలో గ్రామపంచాయతీ కార్మికుడిగా పనిచేస్తున్న వనపర్తి వెంకన్న కూతురు వనపర్తి అఖిల సివిల్ కానిస్టేబుల్గా ఎంపికైంది. తమ బిడ్డలు ప్రభుత్వం ఉద్యోగానికి ఎంపికైనందున వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.