2023ను కల్యాణ నామ సంవత్సరంగా చెప్పుకోవచ్చు. రెండు నెలలు మినహా పది మాసాలు మంచి ముహూర్తాలు ఉండడంతో ఈ ఏడాదంతా భాజాభజంత్రీల మోత మోగనున్నాయి. తెలుగింటి గడపలు కల్యాణ శోభతో కళకళలాడనున్నాయి. అనేక జంటలు ఒక్కటి కానున్నాయి. రికార్డు స్థాయిలో వివాహాలు నమోదు కానుండడంతో కల్యాణ మండపాలకు, వివాహ అనుబంధ వ్యాపారాలకు డిమాండ్ పెరుగనుంది.
మఠంపల్లి, జనవరి 22 : 2023లో ఏప్రిల్, జూలై నెలలు మినహా మిగతా 10నెలలు మంచి ముహూర్తాలున్నాయి. దీంతో ఈ ఏడాది రికార్డు స్థాయిలో వివాహాలు జరుగనున్నాయి. ఊరూ వాడ భాజాభజంత్రీలతో హోరెత్తనున్నాయి. గత రెండేండ్లుగా కరోనా కారణంగా మంచి ముహూర్తాలున్నా పెండ్లిళ్లు పెద్ద సంఖ్యలో జరుగలేదు. హంగూ ఆర్భాటాలు లేకుండా సాదాసీదాగా కొన్ని జంటలు ఏకమయ్యాయి.
ఈ ఏడాది పెద్ద సంఖ్యలో ముహూర్తాలు ఉండడం, కరోనా తగ్గుముఖం పట్టడంతో పెద్ద సంఖ్యలో శుభకార్యాలు జరిగే అవకాశముంది. దీంతో ఫంక్షన్ హాళ్లు, వివాహాలకు సంబంధించిన వ్యాపారాలు జోరందుకోనున్నాయి. కల్యాణ మండపాలు, డెకరేషన్లకు డిమాండ్ ఈ ఏడాది వివాహాలు, శుభాకార్యాలకు ఎక్కువ మంచి రోజులు ఉండడంతో కల్యాణ మండపాలు, భాజాభజంత్రీలు, డెకరేషన్లు, ఫొటో, వీడియోగ్రాఫర్లు తదితర వివాహ సంబంధిత కార్యక్రమాలకు మంచి డిమాండ్ ఏర్పడనుంది. కొవిడ్ అనంతరం ఈ ఏడాదే ఎక్కువ శుభకార్యాలకు అవకాశం దొరకడంతో వీరికి పెద్ద ఎత్తున ఉపాధి దొరకనుంది.
మే నెలలో 16 రోజులు శుభ ఘడియలే..
ఈ ఏడాది జనవరిలో నాలుగు రోజులు, ఫిబ్రవరిలో 12, మార్చిలో 14 రోజులు శుభ ముహూర్తాలుండగా.. మే నెలలో అత్యధికంగా 16రోజులు శుభ ఘడియలే. జూన్లో 7రోజులు, ఆగస్టులో 8, సెప్టెంబర్లో 6, అక్టోబర్లో 10, నవంబర్, డిసెంబర్ నెలల్లో 14రోజుల పాటు పెండ్లిళ్లకు, శుభకార్యాలకు ముహూర్తాలు ఉన్నాయి. ఏప్రిల్లో గురు మూఢమి, జూలై నెలలో ఆషాఢం, అధిక శ్రావణం కారణంగా ముహూర్తాలు లేవు. మిగిలిన అన్ని నెలల్లో వివాహాలు జరుపుకొనేందుకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. దీంతో పలువురు తల్లిదండ్రులు ఇప్పటి నుంచే తమ పిల్లలకు సంబంధాలు వెతికే పనిలో పడ్డారు. పెండ్లిళ్లతో పాటు గృహ ప్రవేశాలు, కొత్త వ్యాపార ప్రారంభోత్సవాలు, ఇతర శుభకార్యాలు నిర్వహించుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
శుభకార్యాలకు ఈ ఏడాది మంచి తరుణం
2023 సంవత్సరం వివాహాలు, శుభకార్యాలు చేసుకునే వారికి మంచి తరుణం. ఏప్రిల్, జూలైలో మినహా మిగిలిన అన్ని మాసాల్లో మంచి ముహూర్తాలే ఉన్నాయి. మే నెలతో పాటు ఫిబ్రవరి, మార్చి, నవంబర్, డిసెంబర్ నెలల్లో ఎక్కువ రోజులు శుభ ఘడియలు ఉన్నాయి.
– సోమయాజు సూర్యనారాయణశాస్త్రి, తెలుగు పండితుడు, మఠంపల్లి