అనేక సంస్కరణలతో ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని, పేదలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు ఏర్పాటు చేసిన గురుకులాలు దేశానికి రోల్ మాడల్గా నిలిచాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా గురు పూజోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించి ప్రశంసా పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు వేల సంఖ్యలో గురుకులాల్లో చదువుతున్నారని, ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం సంవత్సరానికి రూ.1.25 లక్షలు ఖర్చు చేస్తున్నదని తెలిపారు. మంచి సమాజం తయారు కావాలంటే మంచి విద్యతోనే సాధ్యమవుతుందని, విద్యావంతుల తయారీలో ఉపాధ్యాయుల పాత్ర ఎనలేనిదని అన్నారు. దేశ వ్యాప్తంగా విద్యారంగంలో బ్రిటీష్ కాలం నాటి పద్ధతులకు స్వస్తి పలుకాల్సిన అవసరం ఉన్నదని, అది సీఎం కేసీఆర్తోనే సాధ్యమవుతుందని చెప్పారు.
సూర్యాపేట, సెప్టెంబర్ 5 : రాష్ట్రంలోని విద్యారంగంలో వినూత్న సంస్కరణలకు శ్రీకారం చుట్టి విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ 136వ జయంతి సందర్భంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో సమీకృత కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన గురు పూజోత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించి ప్రశంసాపత్రాలు అందించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో పేద బిడ్డలకు కార్పొరేట్ విద్యను అందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ గురుకులాలను ఏర్పాటు చేసి అద్భుతమైన ఫలితాలు తెస్తున్నారన్నారు.
తెలంగాణ గురుకులాలు దేశానికే రోల్ మోడల్గా నిలిచాయన్నారు. గురుకులాలలో చేరడానికి విద్యార్థులు చూపిస్తున్న స్పందనే వాటి విజయానికి నిదర్శనమన్నారు.సమైక్య రాష్ట్రం తో పోలిస్తే తెలంగాణలో విద్యారంగం ఎంతో మార్పు వచ్చిందన్నారు. ఈ విజయంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల పాత్ర మరవలేనిదని పేర్కొన్నారు. ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ మాట్లాడుతూ విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయులను గౌరవించడం చాలా మంచి సంప్రదాయమన్నారు.అంతకుముందు సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కలెక్టర్ ఎస్. వెంకట్రావ్, జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికా యుగంధర్రావు, అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, పాల్గొన్నారు.