యాదాద్రి, అక్టోబర్ 20 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారికి సువర్ణ పుష్పార్చన అత్యంత వైభవంగా జరిగింది. ప్రధానాలయ ముఖ మండపంలో గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దఫాలుగా 600 రూపాయల టిక్కెట్ తీసుకున్న భక్తులతో స్వామివారికి సువర్ణపుష్పార్చన జరిపించారు. బంగారు పుష్పాలతో దేవేరులకు అర్చన చేశారు. మొదటగా శ్రీమన్యుసూక్త పారాయణం జరిపారు. ప్రత్యేకంగా బంగారంతో తయారు చేసిన 108 పుష్పాలను శ్రీవారి సన్నిధిలో ఉంచి వాటితో అర్చన జరిపారు. స్వామి, అమ్మవార్లకు నిత్య తిరుకల్యాణోత్సవం అత్యంత వైభవంగా సాగింది. ప్రధానాలయ మొదటి ప్రాకార మండపంలో సుదర్శ నారసింహహోమం జరిపిన అనంతరం స్వామి, అమ్మవార్లను దివ్యమనోహరంగా ముస్తాబు చేసి గజ వాహనంపై వేంచేపు చేసి వెలుపలి ప్రాకార మండపంలో ఊరేగించారు. అనంతరం లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా నిత్య తిరుకల్యాణ తంతును జరిపారు. కల్యాణోత్సవంలో భక్తులు పాల్గొని కల్యాణ తంతును వీక్షించారు.
తెల్లవారుజూమునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం తిరువారాధన జరిపి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం జరిపారు. స్వామికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శనభాగ్యం కల్పించారు. సాయంత్రం స్వామివారికి వెండి మొక్కు జోడు సేవ, దర్భార్ సేవ చేపట్టారు. రాత్రివేళ స్వామివారికి తిరువారాధన చేపట్టి, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన జరిపారు. రాత్రి ప్రధానాలయ ముఖ మండపంలో ప్రతిష్ఠామూర్తులకు తిరువారాధన, సహస్రనామార్చన జరిగాయి. స్వామివారి ఖజానాకు 19,30,885 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
యాదాద్రి నూతన క్యాలెండర్ ఆవిష్కరణ
లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో రూపొందించిన 2023 సంవత్సరం క్యాలెండర్ను ఆలయ ఈఓ ఎన్.గీత, అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి గురువారం కొండపైన ఈఓ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ క్యాలెండర్ను 25 రూపాయలకు ప్రధానాలయంలో విక్రయించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ డీఈఓ దోర్భాల భాస్కర్శర్మ, ఏఈఓ గట్టు శ్రవణ్కుమార్ పాల్గొన్నారు.