సూర్యాపేట సిటీ, ఏప్రిల్ 1 : జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో పోలీస్ సైబర్ వారియర్స్ పని చేస్తుండగా వారికి సోమవారం సైబర్ వారియర్స్ హెల్ప్లైన్ నంబర్లను, మొబైల్ ఫోన్లను ఎస్పీ రాహుల్ హెగ్గే జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెరుగుతున్న సాంకేతికతతో పాటు సైబర్ మోసాలు పెరుగుతున్నాయని, సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేసి ఆర్థిక నష్టాన్ని కలిగిస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సైబర్ మోసానికి గురైన వారు 1930 జాతీయ టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చన్నారు. సైబర్ నేరాల ఫిర్యాదులు, కేసుల స్థితిగతులను తెలుసుకునేందుకు వీలుగా అన్ని పోలీస్స్టేషన్లలో పోలీస్ సైబర్ వారియర్స్కు నూతన హెల్ప్లైన్ నంబర్లు, ఫోన్స్ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ వారు అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ అధికారి రాజేశ్మీనా, సైబర్ సెక్యూరిటీ డీఎస్పీ శ్రీనివాస్రావు, సైబర్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, సైబర్ సెక్యూరిటీ సెల్ సిబ్బంది పాల్గొన్నారు.
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో శాంతి భద్రతల పర్యవేక్షణలో భాగంగా ఏప్రిల్ 1 నుంచి 30 వరకు నెల రోజుల పాటు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్-1861 అమల్లో ఉంటుందని ఎస్పీ రా హుల్ హెగ్డే ఒక ప్రకటనలో తెలిపారు. అనుమతి లేనిదే జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీ లు, పబ్లిక్ మీటింగ్లు, సమావేశాలు నిర్వహించరాదన్నారు. ఉల్లఘిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 7 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ రాహుల్ హేగ్డే తెలిపారు. పోలీస్ పరిధిలో ప్రతి అంశాన్ని చట్ట పరిధిలో పరిష్కరించడంలో, బాధితులకు న్యాయం చేయడంలో వేగంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీస్ అధికారులను ఎస్పీ ఆదేశించారు. అనంతరం పదవీ విరమణ పొందిన హెడ్ కానిస్టేబుల్ జార్జ్ను ఎస్పీ సన్మానించారు.