బొడ్రాయిబజార్, మే 20 : సూర్యాపేట.. దేశంలో చెత్త రహిత, పరిశుభ్ర పట్టణంగా నిలువడమే కాకుండా చెత్త నుంచి ఆదాయం సమకూర్చుకునే మున్సిపాలిటీగా పేరు దక్కించుకుంది. ఇప్పటికే మూడు బుట్టల విధానంతో ప్రజల ద్వారా చెత్తను సేకరిస్తున్నది. తడి, పొడి, హానికరమైన చెత్తను వేరు చేయించి మున్సిపాలిటీ ట్రాక్టర్ ద్వారా సేకరిస్తూ పారిశుధ్య నిర్వహణలో రాష్ర్టానికి, యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచింది. చెత్త నుంచి ప్లాస్టిక్ కవర్లు, వస్తువులను వేరు చేసి వాటి ద్వారా ఇటుకలు, టైల్స్, ఎరువును తయారు చేస్తూ అదనపు ఆదాయం సమకూర్చుకుంటున్నది. ఇదే క్రమంలో పొడి చెత్త ద్వారా ప్రజలకు ఆదాయం సమకూర్చాలని వినూత్న ఆలోచన చేసింది. మేరీ లైఫ్ మేరా స్వచ్ఛ సెహర్ కార్యక్రమంలో భాగంగా పొడి చెత్తను కిలో రూ.5చొప్పున ప్రజల నుంచి కొనుగోలు చేస్తున్నది. దాంతో ప్రజలు తమ ఇండ్లల్లో వారం రోజులపాటు ఉత్పత్తి అయ్యే పొడి చెత్తను దాచి శనివారం నుంచి వారంలో ఒక రోజు ఆయా వార్డుల్లో ఏర్పాటు చేసే ఆర్ఆర్ఆర్ (రెడ్యూస్, రీ యూజ్, రీ సైక్లింగ్) కేంద్రాల్లో విక్రయిస్తున్నారు. నోట్ పుస్తకాలు, ప్లాస్టిక్ వస్తువులు, పాత చెప్పులు, పాత బట్టలు, బాటిల్స్, కాగితాలు, రేకులు, ఇతరత్రా పొడి చెత్త వస్తువులను తమ ఇంట్లో భద్రపర్చి ఆర్ఆర్ఆర్ సెంటర్లలో విక్రయించాల్సిందిగా మున్సిపల్ ప్రజాప్రతినిధులు, అధికారులు సూచిస్తున్నారు. ఇలా చేయడంతో రోడ్లు శుభ్రంగా ఉండడంతోపాటు ప్రజలకు డబ్బులు రావడం, పారిశుధ్య కార్మికులకు పని సులువు కానుంది. మున్సిపాలిటీకి ఆదాయం సమకూర్చుకోవడమే కాకుండా చెత్త ద్వారా ప్రజలకు ఆదాయాన్ని సమకూర్చి పెడుతుండడంతో పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సూర్యాపేటను పరిశుభ్రమైన పట్టణంగా ఉంచాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ప్రజలకు ఆదాయాన్ని సమకూర్చేందుకు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పొడి చెత్తను సేకరించి డబ్బులు చెల్లిస్తున్నాం. ప్రజలు వారం రోజులపాటు దాచిన పొడి చెత్తను ఆర్ఆర్ఆర్ కేంద్రాల్లో విక్రయించి డబ్బులు పొందాలి.
– పెరుమాళ్ల అన్నపూర్ణ, మున్సిపల్ చైర్పర్సన్
మూడు బుట్టల విధానంతో పట్టణ ప్రజలు తడి, పొడి, హానికరమైన చెత్తను వేరు చేసి మున్సిపల్ ట్రాక్టర్కు అందిస్తున్నారు. ఇలా అందిస్తున్న ప్రజలకు పొడి చెత్త ద్వారా ఆదాయాన్ని సమకూర్చాలని నిర్ణయించాం. దాచిన పొడి చెత్తను వారంలో ఒక రోజు వార్డులో ఏర్పాటు చేసే ఆర్ఆర్ఆర్ సెంటర్లలో విక్రయించాల్సిందిగా సూచించాం. ఇక్కడ విక్రయించిన పొడి చెత్తకు కిలో రూ. 5చొప్పున చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది. ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలి.
– పి.రామానుజులరెడ్డి, మున్సిపల్ కమిషనర్
మున్సిపాలిటీ సిబ్బంది వారం రోజులుగా పొడి చెత్తను తీసుకెళ్లడం లేదు. ఎందుకో నాకు అర్థం కాలేదు. శనివారం చెత్త కొనుగోలు చేస్తున్నారంటే ఆశ్చర్యపోయి మా ఇంట్లో ఉన్న పొడి చెత్తను తీసుకెళ్లాను. మున్సిపల్ సిబ్బంది జోకి 12కిలోలు అయితే 60 రూపాయలు చెల్లించారు. మరో వారం చెత్తను దాచి అమ్మితే నల్లా బిల్లుకు సరిపోతుంది. ఇలా చెత్తను తీసుకొని డబ్బులు చెల్లించడం బాగుంది.
– కొత్తకొండ శ్రీను, 25వ వార్డు