యాదాద్రి, జూలై 19 : సీఎం కేసీఆర్ చేపట్టిన సంస్కరణలతో పాటు తాజాగా పది పరీక్షల్లో వచ్చిన ఫలితాలతో ప్రభుత్వ పాఠశాలలకు ఆదరణ పెరిగిందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. పాఠశాలల్లో పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించామని ఇందుకు విద్యాధికారులు సహకరించాలని కోరారు. యాదగిరిగుట్ట పట్టణంలోని హరిత హోటల్లో మంగళవారం ఆమె డీఈఓ నారాయణరెడ్డితో సమీక్ష చేశారు. నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, అధ్యాపకుల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. ఇంగ్లీష్ బోధన, భోజన తీరు, పాఠశాలల్లో నెలకొన్న మౌలిక సమస్యలపై ఆరా తీశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు- మన బడి పనుల పురోగతిపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ ‘మన ఊరు మన బడి’ పథకంలో భాగంగా నియోజకవర్గంలో 103స్కూళ్లకు రూ.17,11,02,936 నిధులు మంజూరయ్యాయని తెలిపారు.
ఈ నిధులతో ఇప్పటికే 85స్కూ ళ్లలో పనులు ప్రారంభం అయ్యాయన్నారు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటం, మరికొన్ని స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండటంతో పాటు అధ్యాపకుల సంఖ్య తక్కువగా ఉండటం, విద్యార్థులు తక్కువ ఉన్న స్కూళల్లో అధ్యాపకుల సంఖ్య ఎక్కువగా ఉండటం వంటి సమస్యలను పరిష్కరించేందుకు రేషనలైజేషన్ ప్రక్రియ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా నియోజకవర్గవ్యాప్తంగా ఎక్కడెక్కడ అధ్యాపకుల సమస్య ఉందో పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. స్కూళ్లలో ఫిర్యాదులంటే స్థానిక ఎస్ఎంసీ చైర్మన్, ప్రధానోపాధ్యాయుల అనుమతితో ఈ నెల 22వ తేదీలోపు ఎంఈఓ దృష్టికి తెస్తే పరిష్కరిస్తామన్నారు. నియోజకవర్గవ్యాప్తంగా 8 మండలాల్లో 1075 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయన్నారు. గతంతో పోలిస్తే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. ఈ నెలలోపు విద్యార్థులకు స్కూల్ యూనిఫాంలు అందిస్తామన్నారు. ఇప్పటికే 79శాతం విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశామని, జూలై లోపు వందశాతం పూర్తి చేస్తామన్నారు. సమావేశంలో వివిధ మండలాల ఎంఈఓలు పాల్గొన్నారు.
గిరిజనుల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
బొమ్మలరామారం : గిరిజనుల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ గొంగిడి సునితామహేందర్రెడ్డి అన్నారు. మండలంలోని కాండ్లకుంట తండాలో గిరిజనుల ఆరాధ్య దైవమైన సీత్లాభవాని(దాటుడు) పండుగను గ్రామస్తులు మంగళవారం ఘనంగా జరుపుకొన్నారు. పండుగకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సునీతామహేందర్రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేసి నైవద్యం సమర్పించారు. గిరిజనుల సంప్రదాయ దుస్తులు ధరించి వారితో కలిసి సంప్రదాయ నృత్యం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసి అధిక నిధులు కేటాయిచడంతో గిరిజనుల కష్టాలు తీరిపోయాయన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ చిమ్ముల సుధీర్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పోలగాని వెంకటేశ్గౌడ్, కుకుట్ల బాలసింగ్, దండు యాదగిరి, నవీన్గౌడ్, హరియానాయక్ పాల్గొన్నారు.