దేశానికి ఆదర్శంగా నిలిచేలా ప్రణాళికలు
రూ.152 కోట్లతో నూతన గృహాలు,
ప్రభుత్వ భవనాల నిర్మాణం
ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి
మాస్టర్ ప్లాన్పై ఆర్అండ్బీ అధికారులతో సమీక్ష
ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిని సకల హంగులతో తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి తెలిపారు. సోమవారం యాదగిరిగుట్ట పట్టణంలోని తన నివాసంలో వాసాలమర్రి అభివృద్ధి పనులు, గృహ నిర్మాణాలకు చేపట్టాల్సిన మాస్టర్ ప్లాన్పై పంచాయతీరాజ్ యాదగిరిగుట్ట డివిజన్ డిప్యూటీ ఈఈ వెంకటేశ్వర్లు, భువనగిరి డీఈఈ గిరిధర్తో సమీక్ష జరిపారు. మార్పులు, చేర్పులపై పలు సూచనలు ఇచ్చారు. రూ.152 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పనులకు ఇప్పటికే డీపీఆర్ను ప్రభుత్వానికి పంపినట్లు, దేశానికే ఆదర్శంగా నిలిచేలా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించినట్లు ప్రభుత్వ విప్ సునీత తెలిపారు.
యాదాద్రి, జూలై11 : సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన వాసాలమర్రిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు కావాల్సిన ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి తెలిపారు. యాదగిరిగుట్ట పట్టణంలోని ఆమె నివాసంలో వాసాలమర్రి అభివృద్ధి పనులు, గృహ నిర్మాణాలకు చేపట్టాల్సిన మాస్టర్ ప్లాన్పై పంచాయతీరాజ్ యాదగిరిగుట్ట డివిజన్ డిప్యూటీ ఈఈ వెంకటేశ్వర్లు, భువనగిరి డీఈఈ గిరిధర్తో సోమవారం సమీక్షించారు. మార్పు, చేర్పులపై పలు సూచనలు చేసి త్వరగా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మాట్లాడుతూ వాసాలమర్రి గ్రామంలో రూ.152కోట్లు ఖర్చు చేసి సర్వహంగులతో తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. ఇప్పటికే డీపీఆర్ తయారు చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. వాసాలమర్రి గ్రామంలో ఇంటింటికీ సర్వే నిర్వహించి 481కుటుంబాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇందుకు అనుగుణంగా లేఅవుట్ తయారు చేసి విశాలమైన రోడ్లతో పాటు కమ్యూనిటీ, అంగన్వాడీ భవనం, ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక, ఉన్నత పాఠశాల భవనాలు, గ్రామ పంచాయతీ భవనం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కమర్షియల్ కాంప్లెక్స్, ఆట స్థలం, సెప్టిక్ ట్యాంకులను ఆధునిక హంగులతో నిర్మించేందుకు డీపీఆర్ సిద్ధమైనట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన వాసాలమర్రిని దేశంలోనే గొప్పగా చెప్పుకునేలా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.
ఎల్డీఎస్ ట్రస్టు సేవలు అభినందనీయం
యాదాద్రి / బీబీనగర్ : ఎల్డీఎస్ ఛారిటబుల్ ట్రస్టు సేవలు అభినందనీయమని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని నిరుపేదలకు సాయం చేసేందుకు ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. యాదగిరిగుట్ట కొండపైన గల వీఐపీ అతిథి గృహంలో సోమవారం ఆమె ఎల్డీఎస్ ఛారిటబుల్ ట్రస్టు ప్రతినిధులు ఎల్డర్ గెర్లాచ్, సిస్టర్ గెర్లాచ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇన్చార్జి శేఖర్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటికే ఎల్డీఎస్ ట్రస్టు ఆధ్వర్యంలో నియోజకవర్గవ్యాప్తంగా 138 వాటర్ ప్లాంట్లు, కుట్టు మిషన్లు అందించారన్నారు. త్వరలో నిరుపేదలకు సేవ చేసేందుకు మరింత ముందుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు. ట్రస్టు ప్రతినిధులు ఎల్డర్ గెర్లాచ్, సిస్టర్ గెర్లాచ్ మాట్లాడుతూ కొవిడ్ కారణంగా రెండేండ్లుగా ఛారిటబుల్ పనులు నిలిచిపోయాయని, తిరిగి ఈ ఏడాది నుంచి పునఃప్రారంభిస్తున్నామన్నారు. ఆలేరు నియోజకవర్గంలో అతి పేద కుటుంబాలకు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ సందర్భంగా మహవీర్ జైన్ ట్రస్టు ఆధ్వర్యంలో పట్టణంలో నిర్వహిస్తున్న డయాలసిస్ కేంద్రంతో పాటు గతంలో అమర్చిన వాటర్ ప్లాంట్లను సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా బీబీనగర్ మండల కేంద్రంతో పాటు రాయరావుపేట్ గ్రామంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్లను ఎల్డీఎస్ ఛారిటబుల్ ట్రస్టు సభ్యులు ఎంపీపీ సుధాకర్గౌడ్తో కలిసి పరిశీలించారు.